జైలు పక్షులకు నో: జగన్కు, గాలికి మరో దెబ్బ!
ప్రజా ప్రతినిధులు దోషులుగా తేలితే అదే రోజు నుంచి వారు పదవులకు అనర్హులని జస్టిస్ ఎకె పట్నాయక్, జస్టిస్ ఎస్జె ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే ధర్మాసనం గురువారం మరో సంచలన తీర్పు ఇచ్చింది. పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయరాదని పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఎన్నికల ప్రధానాధికారి, మరికొందరు వేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు స్పందించింది.
కింది కోర్టు ఉత్తర్వుల్లో ఏ లోపమూ కనిపించడం లేదని తాజాగా స్పష్టం చేసింది. ఓటు హక్కు వినియోగించుకునే వ్యక్తి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయొచ్చని.. జైలుకెళ్లడం, పోలీస్ కస్టడీ వల్ల ఓటు హక్కును కోల్పోయే వ్యక్తికి పోటీ చేసే అవకాశం ఉండదని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఏ చట్టం కిందనైనా ముందస్తు నిర్బంధంలోకి వెళ్లిన వ్యక్తులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది.
చట్ట సభల్లో సభ్యత్వానికి అర్హతలను వివరించే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 4, 5 ప్రకారం ఓటర్ను మాత్రమే అర్హుడిగా పేర్కొన్నట్లు ధర్మాసనం వెల్లడించింది. చట్టంలోని సెక్షన్ 62(5) ప్రకారం పోలీస్ కస్టడీతోపాటు శిక్ష పడటం, ఇతర కారణాలతో జైలులో ఉన్న వ్యక్తి ఏ ఎన్నికల్లోనూ ఓటు వేయడానికి వీల్లేదని కూడా ప్రస్తావించింది. 4,5, 62(5) సెక్షన్లను కలిపి చూస్తే జైలులో లేదా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయరాదన్న నిర్ణయానికి రావచ్చని కోర్టు తేల్చి చెప్పింది.
"హైకోర్టు ఆదేశాల్లో మాకు లోపమేమీ కనిపించడం లేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 62(5) ప్రకారం ఓటు హక్కులేని వ్యక్తి ఓటరు కాదు. కాబట్టి అతను పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు'' అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికే కనీసం రెండేళ్ల శిక్ష పడిన వ్యక్తి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇక కస్టడీలో ఉన్న వారు కూడా పోటీ చేయడానికి వీల్లేదని తాజాగా పేర్కొంది.
ఎన్నికల నాటికి బెయిల్ రాకుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వంటి వారికి కోర్టు తీర్పు ప్రకారం పోటీ చేసే అవకాశం ఉండదు. గాలి, జగన్, మోపిదేవిలు ఏడాదిగా పైగా జైలులో ఉంటున్నారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని, అన్నీ రూల్స్ ప్రకారమే జరిగాయని, ఈ సెప్టెంబరులో జగన్కు తప్పకుండా బెయిల్ వస్తుందని, పోటీ చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.