నిన్న కసబ్ నేడు అఫ్జల్: ముందస్తు వ్యూహమేనా?
వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో జరగాల్సిన లోక్సభ ఎన్నికలను ఆరు నెలల ముందే ఎదుర్కొనే సన్నాహాల్లో యూపిఏ ఉన్నదని చెబుతున్నారు. ఇటీవలి పరిణామాలు ఈ సందేహాలను నిర్ధారిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. గత నవంబర్ 21న కసబ్ను, శనివారం అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని బట్టి పలువురు ముందస్తు ఎన్నికల అంచనా వేస్తున్నారు. అఫ్జల్ గురుపై శుక్రవారం రాత్రి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకుంది.
బిజెపి హిందుత్వ అజెండాను బలంగా లేవనెత్తుతున్న తరుణంలో, పార్లమెంటు బడ్జెట్ భేటీకి ముందు తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికలను ముందుకు జరిపే సూచనగా పేర్కొంటున్నారు. మరోవైపు ఈ ఏడాదిలోనే లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు బిజెపి అగ్ర నేత వెంకయ్యనాయుడు చెప్పారు కూడా. శనివారం చెన్నైలో, ఆదివారం హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు అవకాశముందన్నారు.
కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారి మాత్రం ముందస్తు ఎన్నికలను కొట్టి పారేస్తున్నారు. అయితే, గతంలో స్వయంగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సైతం ముందస్తు ఎన్నికల సంకేతాలు ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు లేవంటూనే కాంగ్రెసు ఆ దిశగా పావులు కదుపుతోందని అంటున్నారు. అజ్మల్ కసబ్, అఫ్జల్ గురుల ఉరి శిక్ష అమలు అందులో భాగమే అంటున్నారు.