కెసిఆర్ కూతురు కవితకు లైన్ క్లియర్!
శనివారం జరిగిన తెరాస ఆవిర్భావ సభ వేదికపై పార్టీ కల్వకుంట్లర కవిత కూర్చోవడం చర్చనీయాంశమైంది. గతంలో తెరాస వేదికలపై ఎప్పుడూ కవిత కనిపించలేదు. ఆవిర్భావ సభ వేదికపై కూర్చోవడం ఆమె నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తారనే ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఎంపి అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశంతో ఉన్న కవిత, జిల్లాలో జరిగే అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఆమె పోటీ చేసే విషయాన్ని తెరాస నేతలు బహిరంగంగా ప్రకటించకపోయినా వేదికపై ఆమె కూర్చోవడంతో పోటీ చేయడం దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఆవిర్భావ సభలో ఎంపి అభ్యర్ధిగా కవిత పేరు ప్రకటిస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. కవిత మెట్టినిల్లు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పొతంగల్ కావడంతో ఆమె ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ నుండి కాంగ్రెసు పార్టీ ఎంపీ మధుయాష్కీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
మరోవైపు పార్టీ ఆవిర్భావ సభ అనంతరం కెసిఆర్ తన ఫాంహౌస్కు చేరుకున్నారు. కెసిఆర్ ఫాం హౌస్లో ఉండటం నిత్యం చర్చనీయాంశమవుతోంది. తాజాగా ఆయన తెరాస ప్రతినిధుల సమావేశం, 13వ వార్షికోత్సవ కార్యక్రమం అనంతరం ఫాం హౌస్కు వెళ్లిపోయారు.