కిరణ్కు దళిత బిరుదు: మంద వర్సెస్ కారెం
ముఖ్యమంత్రి మాలలకు బంధువుగా, మాదిగ ఉప కులాలకు రాబందుగా వ్యవహరిస్తున్నారని మందకృష్ణ మాదిగ దుయ్యబట్టారు. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాజమండ్రి దళిత చైతన్య సభలో ఎంపీ హర్షకుమార్ ఇచ్చిన దళిత బంధు కిరీటంతో ఆయన దళితులకు దగ్గరైనట్లు భావిస్తే అవి పగటి కలలుగానే మిగిలిపోతాయని మందకృష్ణ హెచ్చరించారు.
ముఖ్యమంత్రి దళిత బంధువు కాదని, ఆ బిరుదు ఇచ్చిన హర్షకుమార్కి లేదా ఆయన సామాజిక వర్గం మాలలకు బంధువు అవుతారేమో కానీ మాదిగ ఉప కులాలకు కాదని అన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రధానికి లేఖ రాయాలని కోరినా, ఢిల్లీ వెళ్లినప్పుడు అధిష్ఠానంతో దీనిపై చర్చించాలని సూచించినా, సీఎం పట్టించుకోవడం లేదని అన్నారు. అఖిలపక్షానికి ఢిల్లీకి తీసుకువెళ్లాని కోరితే ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో వెళ్లారు కదా? అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చివరి క్షణంలో ముఖ్యమంత్రి మొహం చాటేయడంతో దామోదర నేతృత్వం వహించాల్సి వచ్చిందన్నారు.
గతంలో వైయస్, రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో మాలలకు మూడు, మాదిగలకు మూడు మంత్రి పదవులు ఇచ్చి సమ న్యాయం పాటించారని, కిరణ్కుమార్రెడ్డి మాత్రం మాలలకు నాలుగు, మాదిగలకు మూడు మంత్రి పదవులు ఇచ్చారని, మాదిగల పట్ల ఉన్న తన వ్యతిరేక భావాన్ని ఇలా బయటపెట్టుకున్నారని విమర్శించారు.
విదేశాల్లో చదువుకునే ఎస్సీ విద్యార్థులకు రూ.5లక్షలు ఇస్తామని సీఎం చేసిన ప్రకటనతో 80% మాలలే లబ్ధి పొందుతారన్నారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా ఉన్న వృద్ధులు, వితంతువులు, వికలాంగుల సమస్యలపై సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వీరి సమస్యలపై 25న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
దళితుల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించడం మంద కృష్ణకు తగదని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ అన్నారు. సీఎం చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కువ శాతం ఉపయోగించుకుంటున్నది మాదిగలేనన్న సత్యం ఆయన గుర్తించాలని మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. సీఎం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఎవరైనా బహిరంగ చర్చకు రావొచ్చని సవాల్ విసిరారు. సబ్ ప్లాన్ గొప్ప చట్టమని, లోపాలుంటే సవరించుకునేలా సూచనలివ్వాలి తప్ప చట్టాన్నే నిర్వీర్యం చేయడానికి ఎవరు ప్రయత్నించినా ఎస్సీ, ఎస్టీలకు ద్రోహం చేయడమేనన్నారు.