సర్వే: జగన్కు చిల్లు, చిరు మీసం మెలేసినా!(పిక్చర్స్)
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా క్రమంగా తగ్గుతోందా? అంటే ఇటీవల పలు రాజకీయ పార్టీలు అవునని చెబుతున్నాయి. రాజకీయ పార్టీలే కాకుండా పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని తేల్చుతున్నాయి. గత సర్వేల్లో జగన్ పార్టీకి సగానికి పైగా ఎంపీ స్థానాలు వస్తాయని తేలింది. అయితే, ఇప్పుడు మాత్రం జగన్ పార్టీ 12 స్థానాలకే పరిమితం కానుందని సి ఓటరు సర్వేలో తేలింది.
జగన్ హవా క్రమంగా తగ్గుతోందనేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 12, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితిలు తొమ్మిది చొప్పున, కాంగ్రెసు పార్టీ ఎనిమిది పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయట. రాష్ట్రానికి సంబంధించి సి ఓటరు సర్వే ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కొద్ది రోజుల క్రితం నాటి హవా ఇప్పుడు కనిపించడం లేదని తాజా సర్వేలో తేలింది.
రాష్ట్రంలో తమ హవానే కొనసాగుతుందని జగన్ పార్టీ, తెలంగాణలో తమనే పట్టం కడతారని తెరాస ఇన్నాళ్లు చంకలు గుద్దుకుంది. పరిస్థితి కూడా ఇన్నాళ్లు అలాగే ఉంది. అయితే క్రమంగా మార్పు కనిపిస్తోందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అటు కేంద్రంలో యుపిఏ, ఎన్డీయేలలో ఏదీ అధికారంలోకి రాలేదని ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషించనున్నాయని సి ఓటర్ సర్వే పేర్కొంది. సీ ఓటరు సర్వే సర్వే అంచనా ప్రకారం... రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైయస్సార్ కాంగ్రెసు 12, తెరాస 9, టిడిపి 9, కాంగ్రెసు 8, మజ్లిస్ 1 గెలుచుకోవడమే కాకుండా బిజెపి కొత్తగా మూడు పార్లమెంటు స్థానాలలో విజయ దుందుభి మోగుస్తుందంట.
ఈసారి కేంద్రంలో యూపిఏ, ఎన్డీయే ఏదీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు లేవట. మూడు, నాలుగు కూటములుగా విడిపోయిన ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయట. పార్టీ పరంగా బిజెపి, కూటమిపరంగా ఎన్డీయే మరిన్ని సీట్లు ఎక్కువగా తెచ్చుకుంటున్నా అధికారాన్ని చేపట్టేందుకు ఆమడ దూరంలో నిలవడం ఖాయమని సీఓటర్ సర్వే పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపిఏ బలం 128కి పడిపోతుందట. ఏకంగా 99 సీట్లకు గండి పడుతుందని సర్వే చెబుతోంది.
ప్రస్తుతం ఎన్డీయే కూటమి బలం 152. ఎన్నికలు వస్తే ఆ బలం 184కు పెరుగుతుంది. అందులోనూ బిజెపియే 25 సీట్లు అదనంగా గెలుచుకుంటుంది. కానీ అధికారం చేజిక్కించుకోలేకపోవడమే కమలానికి నిరాశ కలిగించే విషయం. సమాజ్వాది నేత ములాయం కలలకంటున్న మూడో కూటమి 111 స్థానాలు గెలుచుకుంటుందని సి ఓటర్ పేర్కొంది. ఈ ఎన్నికల ఆటలో అత్యధిక లబ్ధి పొందనున్నది నాలుగో కూటమేనట. అన్నా డిఎంకె, తృణమూల్, బిఎస్పీ, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి తదితర పార్టీలను నాలుగో కూటమి కింద జత కడతాయట. అవి 120 స్థానాలు గెలుచుకుంటాయని సి ఓటర్ పేర్కొంది.
ఢిల్లీ గద్దెపై జాతీయ పార్టీల ఏకఛత్రాధిపత్యానికి ఎప్పుడో తెర పడింది. దాదాపు రెండు దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాల హవా నడుస్తోంది. అయితే 1999 నుంచి బిజెపి, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటములే రాజ్యం సాగిస్తున్నాయి. ఈసారి మాత్రం ఆ రెండు పార్టీలు కాకుండా కూటములే ప్రధానం కానున్నాయని సి ఓటర్ సర్వే గణాంకాలు చెబుతున్నాయి. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ తరహా మరో 'ఫ్రంట్' అధికారంలోకి వచ్చినా రావొచ్చని స్పష్టం చేస్తున్నాయి. మరో విషయమేమంటే మూడు, నాలుగు కూటములు కలిసినా 'మ్యాజిక్ మార్క్' 272ను చేరుకోవడం లేదు.
కాగా, ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే జగన్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని జగన్కు అనుకూలంగా ఉన్న మరో సర్వే తేల్చిందట. 294 స్థానాలున్న అసెంబ్లీలో జగన్ పార్టీకి 150, తెదేపాకు 55, కాంగ్రెసుకు 35, తెరాసకు 35 స్థానాలు వస్తాయని ఆ సర్వేలో తేలిందట. అయితే, జగన్ అనుకూల సర్వేలోనే ఆ పార్టీకి బొటా బొటీ మెజార్టీ వస్తుందని తేలిందంటే ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.
రాష్ట్రంలో జగన్ పార్టీ హవా క్రమంగా తగ్గుతోందని సర్వేలు చెబుతున్నాయి. గతంలో 30 ఎంపీ, 230 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పగా ఇప్పుడు 12 ఎంపీ, 150 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తేలిందట. ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉన్న నేపథ్యంలో మరింత హవా తగ్గవచ్చునని భావిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్, జైలు సెంటిమెంట్ అన్ని అప్పటి వరకు తగ్గిపోయి జగన్కు ఎదురుగాలి తప్పదంటున్నారు.
చంద్రబాబు నాయుడు పాదయాత్ర వల్ల టిడిపి పరిస్థితి చాలా మెరుగు పడినట్లుగా సర్వేల ద్వారా తెలుస్తోంది. ఎన్నికలు వచ్చే ఏడు జరిగితే టిడిపికి మరింత లాభం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నారా - నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు పార్టీకి కొంత నష్టం చేకూర్చే అవకాశాలున్నాయి. అంతా ఒక్కటైతే మాత్రం పార్టీకి తిరుగుండదంటున్నారు.
తెరాస పరిస్థితి కూడా జగన్ పార్టీ పరిస్థితిలాగే ఉంది. కొద్ది నెలల క్రితం తెరాసకు 70 నుండి 80 సీట్ల మధ్య వస్తాయని సర్వేలో తేలింది. కానీ, ఇప్పుడు అది 35కు పడిపోయింది. తెలంగాణ వాదం పోటీలో ఆ పార్టీకి ధీటుగా బిజెపి, సిపిఐలు ఉండటంతో పాటు టిడిపి తెలంగాణపై ఓ వైఖరి చెప్పడం వల్ల తెరాసకు కొంత గండిపడింది.
కిరణ్ ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా, బొత్స ఎంతగా మరలా తమదే అధికారమని చెప్పినా కాంగ్రెసు పార్టీ వచ్చే ఎన్నికల్లో 35 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందట.
చిరంజీవి కూడా కాంగ్రెసును కాపాడలేరట. సొంతగా పార్టీ పీఆర్పీ ఉంటే ఆయన ఇమేజ్ కలిసి వచ్చేదని కానీ, కాంగ్రెసులో కలిసినందున ఆయన ఇమేజ్ పార్టీకి ఉపయోగపడే అవకాశాలు ఏమాత్రం లేవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని కాపాడి నాడు పిఆర్పీని కాంగ్రెసులో కలిపేసిన చిరు.. ఎంతగా మీసం మెలేసినా కాంగ్రెసుకు ఫలితం దక్కదంటున్నారు.
అనూహ్యంగా ఈసారి బిజెపి మూడు పార్లమెంటు స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయట. మూడు పార్లమెంటు స్థానాలు గెలుచుకోవడమంటే రెండంకెల్లోనే బిజెపి అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇటీవల మజ్లిస్ పార్టీ వ్యవహార శైలి వల్ల కూడా ఆ పార్టీకి ఓ వర్గం ఓట్లు భారీగా పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
షర్మిల, చంద్రబాబుల పాదయాత్ర, కెసిఆర్ పల్లెపల్లెకు తెలంగాణ, కిరణ్ పథకాలు, బిజెపి తెలంగాణవాదం ఆయా పార్టీలకు ఏమేరకు లాభిస్తాయో, ఎన్నికలు వచ్చే సమయానికి ఇంకెంతగా ఓటు గాలి మళ్లుతుందో చూడాలి.