ఫొటోలు: జగన్ సహా ఐదుగురు నడిపించారు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఐదుగురు కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డిని నీడలా అంటి పెట్టుకుని ఉన్న సూరీడి వాంగ్మూలం జగన్ కేసులో అత్యంత కీలకమైందగా భావిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుకు సంబంధించి అత్యంత ముఖ్యమైన విషయాలను సూరీడు సిబిఐ విచారణలో వెల్లడించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు తెలుగు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన మొదటి అభియోగపత్రం ఆధారంగా నమోదైన (సిసి 8/12) కేసులో సిబిఐ రెండో అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఇందులో 82వ సాక్షిగా సూరీడు ఉన్నాడు. చార్జిషీట్తో పాటు సూరీడి వాంగ్మూలాన్ని సిబిఐ కోర్టుకు సమర్పించింది. వైయస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్రైమెక్స్ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాపరెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, నిత్యానంద రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, పొట్లూరి వరప్రసాద్, ఎకె దండమూడి, ఎన్. శ్రీనివాసన్, సజ్జల రామకృష్ణా రెడ్డి, పార్థసారథి రెడ్డి, శ్రీనివాస రెడ్డి తదితరులు తరుచుగా వచ్చి కలుస్తుండేవారని సూరీడు చెప్పినట్లు సమాచారం.
ఏదైనా ప్రయోజనం పొందాలనుకునేవారు తొలుత కెవిపి రామచంద్రరావును కలిసేవారని, ఆ తర్వాత వైయస్ వద్దకు వెళ్లేవారని సూరీడు చెప్పినట్లు తెలుస్తోంది. అప్పట్లో సునీల్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి ఇంట్లోనే వుండేవారట. దీంతో ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినవారు ఎంత చెల్లించాలన్నది కెవిపి నిర్ణయించేవారని, సునీల్ రెడ్డి వసూలు చేసేవారని సూరీడు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. తమకు అందిన సొమ్మును ఎలా వినియోగించాలనే విషయాన్ని వైయస్ జగన్, విజయసాయి రెడ్డి, సునీల్ రెడ్డి కలిసి నిర్ణయించేవారని అంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే వసూళ్లకు కేంద్ర బిందువుగా మారారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందినవారు ఆయన కుమారుడు వైయస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ.
వైయస్ హయాంలో కెవిపి రామచందర్ రావు కీలక పాత్ర పోషించేవారని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరూ తొలుత కెవిపినే కలవాల్సి వచ్చేదని, ఒకవేళ ఆయనను కాదని వైయస్ దగ్గరకు వెళ్లినా ఆయన కెవిపిని కలవాలని చెప్పేవారని సూరీడు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం.
వైయస్ జగన్ సతీమణి భారతీరెడ్డి సమీప బంధువు సునీల్ రెడ్డి ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినవారి నుంచి కెవిపి నిర్ణయించిన మేరకు వసూలు చేసేవారని, అప్పట్లో సునీల్ రెడ్డి వైయస్ నివాసంలోనే ఉండేవారని, దీంతో ఇది ఆయనకు అప్పగించారని సూరీడు సిబిఐకి చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
వసూలు చేసిన సొమ్మును ఎలా వినియోగించాలనే విషయంపై విజయసాయిరెడ్డి, వైయస్ జగన్ నిర్ణయం తీసుకునేవారని అంటున్నారు. ఆ సొమ్మును ఎలా పెట్టుబడులు పెట్టాలో వారు నిర్ణయించేవారట.
వైయస్ ప్రభుత్వ హయాంలో ప్రయోజనం పొందినవారు వైయస్ జగన్ కంపెనీల్లో పెద్ద యెత్తున పెట్టుబడులు పెట్టారని ఆరోపణ. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్ కోట్లాది రూపాయలు కూడబెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.