జగన్ ఎఫెక్ట్: యువ జోరు, రోజాపై ఇందిర సై! (పిక్చర్స్)
హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికలలో ఆయా పార్టీ నేతల తనయుల హల్చల్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావమో లేక పార్టీల్లో వచ్చిన మార్పు కారణమో తెలియదు కానీ వచ్చే ఎన్నికలలో ప్రధాన పార్టీలలో యువత కీలకంగా మారనున్నారు. టిడిపి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో వచ్చే ఎన్నికలలో యువహోరు కనిపించనుంది.
సీనియర్ నేతల తనయులు, కూతుళ్లు వచ్చే ఎన్నికలలో బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తనయుల టిక్కెట్స్ కోసం పలువురు సీనియర్ నేతలు హామీ ఉన్న ఇతర పార్టీలలోకి మారుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు, తెరాస పార్టీల నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి, కెటి రామారావులు ఇప్పటికే పోటీ చేసి గెలుపొందారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో యువతను టిడిపి వైపు మళ్లించేందుకు పోటీ చేసే అవకాశాలున్నాయి. జగన్, కెటిఆర్, లోకేష్ల విషయాన్ని పక్కన పెడితే పలువురు సీనియర్ల తనయులు, కూతుళ్లు బరిలోకి దిగనున్నారు.
కాంగ్రెసు సీనియర్ నేత గాదె వెంకట రెడ్డి వచ్చే ఎన్నికల్లో తప్పుకొని తన తనయుడు మధుసూదన్ రెడ్డికి అవకాశమివ్వాలని చూస్తున్నారు. అనంత సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి తన తనయుడిని తాడిపత్రి నుండి పోటీ చేయించాలనే యోచనలో ఉన్నారు. ఆయన లోకసభ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సోదరుడి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిలు తన తనయులను బరిలోకి దింపాలని చూస్తున్నారు. మాజీ మంత్రి చెంగారెడ్డి కూతురు ఇందిరా రెడ్డి నగరి నుండి పోటీ చేయాలని చూస్తున్నారు. నగరి నుండి తరఫున ఇందిర, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి రోజా ఆసక్తి పోటీ చేయాలని చూస్తుండటం గమనార్హం.
టిడిపిలో రమేష్ రాథోడ్ తనయుడు రితీష్ రాథోడ్ అదిలాబాద్ పార్లమెంటు స్థానానికి లేదా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి, పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు అసెంబ్లీకి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి మలకపేట అసెంబ్లీకి, దయాకర్ రెడ్డి తనయుడు సిద్దార్థ రెడ్డి దేవరకద్ర నుండి పోటీ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అయ్యన్నపాత్రుడు తనయుడు విజయ్ కుమార్ నర్సీపట్నం నుండి బరిలోకి దిగాలని భావిస్తున్నారు.
టిడిపి నేత నన్నపనేని రాజకుమారి తనయ నన్నపనేని సుధ కొద్ది రోజుల క్రితం జగన్ పార్టీలో చేరారు. ఆమె వినుకొండ సీటు కోసం, మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు గౌతమ్ ఆత్మకూరు కోసం, పువ్వాడ నాగేశ్వర రావు తనయుడు అజయ్ ఖమ్మం, దాడి వీరభద్ర రావు తనయుడు దాడి రత్నాకర్ విశాఖ అసెంబ్లీ నుండి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. టిడిపి నేత దేవెందర్ గౌడ్ తనయుడు వీరేంద్ర గౌడ్ మల్కాజిగిరి స్థానంపై కన్నేశారు.
వైయస్ జగన్ యువకుడు కావడంతో ఆయన యువతను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రిటైర్ అవుదామనుకుంటున్న, వారసులను బరిలోకి దింపాలని భావిస్తున్న పలువురు సీనియర్ కాంగ్రెసు, టిడిపి నేతలు తమ కూతుళ్లను, తనయులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. టిడిపి తరఫున లోకేష్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.
జగన్ సోదరి షర్మిల కూడా కడప పార్లమెంటు లేదా మరో స్థానం నుండి బరిలోకి దిగాలని చూస్తున్నారు. ఆ పార్టీకి చెందిన రోజా నగరి నుండి మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
తెరాస చీఫ్ తనయుడు కెటిఆర్ ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో కూతురు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లోకసభకు పోటీ చేయనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. పొన్నాల లక్ష్మయ్య తప్పుకొని తన కోడలు కవితను వైశాలిని జనగామ బరిలో దించాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
దాడి వీరభద్ర రావు తన తనయుడు రత్నాకర్ను విశాఖ బరి నుండి దింపాలని చూస్తున్నారు. నన్నపనేని రాజకుమారి కూతురు నన్నపనేని సుధ జగన్ పార్టీలో చేరారు. ఆమె వినకొండ నుండి పోటీ చేయాలని చూస్తున్నారు.
టిడిపి నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు చింతకాయల విజయ్ వచ్చే ఎన్నికలలో బరిలో దిగే అవకాశాలున్నాయి.
పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుండి పోటీ చేసే అవకాశాలున్నాయి.
హీరో తారకరత్న టిడిపి టిక్కెట్ ఇస్తే పోటీ చేసేందుకు సై అంటున్నారు.