రాహుల్ వర్సెస్ మోడీ: రెండింటిదీ ఒకేరాగం
ప్రధానంగా జెడి(యు) మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరికొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి, జెడియు నేత నితీష్ కుమార్ ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో సెక్యులర్ కార్డును ఉపయోగిస్తూ మోడీని పక్కకు తప్పించాలని చూస్తున్నారు. అవకాశం వస్తే పిఎం పోస్టుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రజల్లో, పార్టీలో మోడీకి ఉన్నంత మద్దతు ఆయనకు లేదు.
మోడీ ఇప్పటికే దేశవ్యాప్తంగా యువతలో విజన్ కలిగిన నేతగా ముద్రపడ్డారు. ఆయనకు యువతలో చాలా ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్, ఫేస్బుక్ల ద్వారా మోడీ యువతను మరింత తన దరి చేర్చుకుంటున్నారు. సామాజిక వెబ్సైట్లలో రాజకీయ నాయకుల్లో అతి ఎక్కువ ఫాలోవర్స్ కలిగి ఉన్న నేత మోడీనే. రాహుల్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లాంటి వారి ఆయనకు దరిదాపుల్లో కూడా లేరు. సామాజిక వెబ్ సైట్ల ద్వారానే మోడీని బిజెపి ప్రధాని అభ్యర్థిగా గుర్తించనప్పటికీ దేశవ్యాప్తంగా మోడీ పట్ల ఇంట్రెస్టు చూపిస్తున్న వారు పెరుగుతున్నారు.
విహెచ్పి, ఆర్ఎస్ఎస్లు కూడా మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్డీయేలో మోడీని వ్యతిరేకిస్తున్న పార్టీలను తమ దారిలోకి తెచ్చుకునే పనిలో బిజెపి పడింది. మోడీయే ఎన్డీయే ప్రధాని అభ్యర్థి అవుతాడని చాలామంది భావిస్తున్నారు. బిజెపి కూడా అందుకోసం ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ కోసం కాంగ్రెసు, మోడీ కోసం బిజెపి యువతకు ఇప్పుడు గాలం వేసే పనిలో పడ్డాయి.
యువతను ఆకట్టుకునే విషయంలో రెండు పార్టీలు ఒకే రాగాన్ని ఆలపిస్తున్నాయి! రాహుల్ను ప్రధానిగా చూడటానికి 2014 ఎన్నికల్లో సీనియర్ మోస్ట్ నేతలకు టిక్కెట్లు ఇవ్వవద్దనే భావనలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉన్నదట. ఎక్కువ మంది యువతకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా రాహుల్కు మద్దతు పెరుగుతుందని భావిస్తున్నారు. అందుకోసం టిక్కెట్లు పెద్దవారికి నో చెప్పాలని అధిష్టానం భావిస్తోంది.
బిజెపిలోనూ అదే అభిప్రాయం ఉంది. ఏడు పదులు దాటిన వృద్ధులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వవద్దని బిజెపి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందట. యంగ్ ఏజ్ నుండి మిడిల్ ఏజ్ వరకు ఉన్న వారికి టిక్కెట్లు ఇవ్వడం ద్వారా మోడికీ మద్దతు పెంచుకోవచ్చుననే భావనతో ఉంది. మొత్తానికి కాంగ్రెసు రాహుల్ కోసం, బిజెపి మోడీ కోసం యువకులకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా యంగ్ తరంగ్కు గాలం వేయాలని చూస్తున్నాయి.