జగన్ కేసు: సిబిఐ జెడి బదలీపై వీడని సస్పెన్స్
తాజాగా ఆయన మహారాష్ట్రకు తిరిగి వెళ్తారా? ఇక్కడే కొనసాగుతారా? అనే విషయమై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మహారాష్ట్ర కేడర్కు చెందిన లక్ష్మీ నారాయణ 2006 జూన్లో సిబిఐ డిఐజి హోదాలో హైదరాబాద్ బ్రాంచ్ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 10వ తేదితో ఆయన డిప్యుటేషన్ ముగియనుంది. సిబిఐలో ఐదేళ్ల సర్వీసు పూర్తయ్యాక 2011లో ఆయన తిరిగి మహారాష్ట్రకు వెళ్లాల్సి ఉండింది.
అప్పుడే అత్యంత కీలకమైన ఓబుళాపురం మైనింగ్ కేసు, ఆ వెంటనే జగన్ అక్రమాస్తుల కేసుల దర్యాప్తును సిబిఐ చేపట్టింది. దీంతో సిబిఐలో లక్ష్మీ నారాయణ సర్వీసును ఏడాది పొడిగించారు. ఆ గడువు గత ఏడాదితో ముగిసింది. జగన్ అరెస్టు అయిన వెంటనే జెడిని బదిలీ చేస్తే కేసు నీరుగారిపోతుందని, జనంలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించడంతో లక్ష్మీ నారాయణ సర్వీసును మరో ఏడాది పొడిగించారు.
ఈ గడువు ఈ నెల 10తో ముగియనుంది. కేంద్ర సర్వీసుల్లో గరిష్ఠంగా ఏడేళ్లకు మించి కొనసాగించే అవకాశం లేకపోవడంతో... జూన్ 11లోగా రిలీవ్ కావాలని జెడికి ఆదేశాలు అందినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే సమాచారం మేరకు.. మరో ఏడాది కూడా జెడిని పొడిగించే అవకాశాలు ఉన్నాయట. మరోవైపు లక్ష్మీ నారాయణ కొనసాగడానికి లేదా వెళ్లిపోవడానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. సిబిఐ ప్రధాన కార్యాలయం నుండి ఆయనకు రిలీవింగ్ ఆదేశాలు కూడా రాలేదు. మరో ఏడాది అవకాశముండటం, ఉత్తర్వులు ఇప్పటి వరకు రాకపోవడంతో ఆయన బదలీపై వెళతారా? లేక రాష్ట్రంలోనే కొనసాగుతారా? అనే అంశం చర్చనీయాంశమైంది.