వస్తా.. కానీ!: జగన్ పార్టీకి తమ్మినేని షరతులు?
తమ్మినేని టిడిపిలో కీలక నేత. ఇతను ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు అడుగులు వేస్తున్నారట. శ్రీకాకుళం లోక్సభ టిక్కెట్తో పాటు, ఆమదాలవలస అసెంబ్లీ టిక్కెట్, మున్సిపల్ చైర్మన్ పదవులు తాను సూచించిన వారికి కేటాయిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతానని ఆయన షరతులు విధించారని, దీనిపై పార్టీ నాయకత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం వల్లే జాప్యం జరుగుతోందట.
పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తే తర్వాత ఆలోచిద్దామని జగన్ పార్టీ తమ్మినేనికి సూచించిందట. జగన్ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ద్వారా జరిపిన ఈ చర్చలపై నిర్ణయం వెలువడకపోవడంతో తమ్మినేని కొద్దికాలంగా స్తబ్దుగా ఉంటున్నారంటున్నారు. ఆయన టిడిపిని వీడటం ఖాయమని, అదెప్పుడు జరుగుతుందో వేచి చూడాలంటున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిన తమ్మినేని ఆ తర్వాత తిరిగి టిడిపిలోకి వచ్చారు.
ఆ సమయంలో తనకు నియోజకవర్గ ఇన్చార్జి పదవి ఇస్తామని చెప్పి అధిష్ఠానం మాట తప్పిందని ఆయన ఆరోపిస్తున్నారు. అసంతృప్తి, జగన్ పార్టీతో చర్చల నేపథ్యంలో తమ్మినేని పార్టీ కార్యక్రమాలకు హాజరు కావట్లేదు. జిల్లాలో పార్టీ చేపడుతున్న ఏ కార్యక్రమాల్లోనూ ఆయన వాణి వినిపించడం లేదు. గత నెల 27న విశాఖలో పాదయాత్ర ముగింపు సభకూ తమ్మినేని హాజరుకాలేదు. ఈ సభకు జిల్లా నుంచి జనాన్ని తరలించే కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనలేదు.