పూడ్చేదెలా?: అక్కడ టిడిపికి దెబ్బపై దెబ్బ
శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ముఖ్యనేత ఎర్రన్నాయుడు గతేడాది నవంబర్ 2వ తేదిన మృతి చెందారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు. ప్రధానంగా జిల్లాలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ఇప్పట్లో రారనే చెప్పవచ్చు. అలాంటి నేత చనిపోయాక జిల్లా తెలుగు తమ్ముల్లో పార్టీ భవిష్యత్తుపై ఆందోళన పట్టుకుంది. జిల్లాకు చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే ఎర్రన్నాయుడి మృతి తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లారు.
ఎర్రన్నాయుడు ఉండి ఉంటే ఆయనను వెళ్లనిచ్చి ఉండే వారు కాదంటారు. ఎర్రన్న తనయుడు రామ్మోహన నాయుడు పగ్గాలు చేపట్టినా తండ్రి లోటును భర్తీ చేసే అనుభవం, సామర్థ్యం లేదంటున్నారు. ఇక దాడి వీరభద్ర రావు పార్టీని వీడటం తెలుగు తమ్ముళ్లను మరింత కుంగ దీసింది. ఎర్రన్న మృతితో అప్పటికే ఉత్తరాంధ్రలో పార్టీ భవిష్యత్తుపై ఆందోళన పడుతున్న నేతలకు దాడి మరో పెద్ద షాక్ ఇచ్చారు.
ఎర్రన్నాయుడు బతికి ఉంటే ఏ నేతలు వెళ్లినా పెద్దగా ప్రభావం పడక పోయి ఉండేదని కానీ, ఇప్పుడు ఎవరు వెళ్లినా పార్టీకి నష్టమే అంటున్నారు. ఎమ్మెల్సీగా రెండోసారి అవకాశం ఇవ్వక పోవడంతో అలిగిన దాడి పదవి ఆఖరి రోజు వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి, గురువారం పార్టీని వీడుతున్నట్లు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మెయిల్ చేశారు. దాడి ఎందుకు పార్టీని వీడారో టిడిపి కార్యకర్తలతో పాటు ప్రజలు అర్థం చేసుకున్నారని, ఆయన స్వార్థ రాజకీయాల కోసం పార్టీని వీడారని, వైయస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెసు పార్టీ పైన తీవ్రస్థాయిలో విమర్సలు గుప్పించిన దాడి తిరిగి ఆ పార్టీలలోకి వెళ్తే ఆయన ఇమేజే దెబ్బ తింటుందని మరికొందరు అంటున్నారు.