ఎసరు: జయప్రద రాకడ.., కెవిపి పోకడ!(పిక్చర్స్)
సాధారణ ఎన్నికలు దగ్గరపడే కొద్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో టిక్కెట్ కేటాయింపుల చిచ్చు రాజుకుంటుంది. ఎవరికి వారు తమ తమ టిక్కెట్లు ఇక్కడి నుండి అని కొందరు చెబుతుండగా.. మరికొందరు గుంభనంగా ఉంటున్నారు. యుపి రాంపూర్ ఎంపి జయప్రద ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని గురువారం కలవడం, ఆమె ఎప్పటి నుండో రాజమండ్రి స్థానం కోసం ప్రయత్నాలు చేస్తుండటంపై చర్చ సాగుతోంది. జయప్రద రాజమండ్రి టిక్కెట్ కోసం సోనియాను అడిగి ఉంటారని చెబుతున్నారు.
తన పాత స్థానం, ప్రస్తుతం కేంద్రమంత్రి పురంధేశ్వరి స్థానంపై టి.సుబ్బిరామిరెడ్డి, రాజమండ్రిపై జయప్రద, కెవిపి రామచంద్ర రావు స్థానంపై ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావులు కన్నేయడం గమనార్హం. పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ స్థానం తనదేనని సుబ్బిరామి రెడ్డి ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆ మేరకు ప్రచార కార్యక్రమాన్ని కూడా ఉధృతం చేశారు. గురువారం ఆయన సోనియాని కలిసి విశాఖ టికెట్ తనకిస్తే ఆ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులనూ తాను గెలిపిస్తానని చెప్పారు.
ఈ నియోజకవర్గం నుంచి తాను రెండుసార్లు పోటీ చేసి గెలిచానని, దాదాపు 32 ఏళ్లుగా విశాఖలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఆయన తెలిపారు. జయప్రద కూడా బుధవారం మధ్యాహ్నం సోనియాని ఆమె నివాసంలో కలుసుకున్నారు. రాష్ట్రం నుంచి పోటీ చేయాలని తనకు ఆసక్తి ఉన్నట్లు ఆమె చెప్పినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ ఎంపీగా ఉన్న జయప్రద అక్కడ సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కృతురాలు కావడంతో సొంత రాష్ట్రానికి రావాలని ఎప్పుడోనిర్ణయించుకున్నారు.
ఉండవల్లి అరుణ్ కుమార్ను తప్పించి అక్కడి నుంచి జయప్రద కాంగ్రెస్ తరఫున పోటీ చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానానికి సంకేతాలు పంపారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఉండవల్లిని ఈ విషయం అడిగినప్పుడు ఆయన నవ్వి ఊరుకున్నారు. అయితే, గతంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత చూపిన ఉండవల్లి ఈసారి పోటీ చేయడం ఇష్టం లేదని అధిష్టానానికి చెప్పి ఉంటారా అనేది కూడా తెలియాల్సి ఉంది.
కావూరి సాంబశివరావు ఈసారి తాను లోక్సభకు పోటీ చేయకుండా రాజ్యసభకు రావాలని చూస్తున్నారట. ఇటీవల కేంద్రమంత్రి పదవి అవకాశం తప్పిపోయిన తర్వాత ఆయన లోక్సభకు ఇక పోటీచేయబోనని చెప్పిన విషయం తెలిసిందే. గత నాలుగు దశాబ్దాలుగా తన కుటుంబం కాంగ్రెస్ను నమ్ముకున్నదని ఆయన సోనియాను కూడా కలిసి చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలో రాజ్యసభ పదవీ కాలం ముగుస్తున్న కెవిపి రామచంద్ర రావు స్థానంలో తాను పెద్దల సభకు రావాలని కావూరి యోచిస్తున్నారట. బందరు నుండి పోటీ చేయాలని కెవిపికి కావూరి సూచించారట కూడా. అయితే, ఆయన నవ్వి ఊరుకున్నారట.
ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజమండ్రి నుండి బరిలోకి దిగాలని జయప్రద ఉవ్వీళ్లూరుతున్నారు. ఆమె గురువారం సోనియా గాంధీని కలవడంతో కాంగ్రెసులో చేరడం దాదాపు ఖాయమైపోయింది. రాజమండ్రిపై ఆశలు పెట్టుకున్న ఆమెకు హామీ ఇస్తే ఉండవల్లిని తప్పించాల్సి ఉంటుంది. లేకుంటే మరో హామీ ఇచ్చారా అనేది ముందు ముందు తేలనుంది. 2009 ఎన్నికల్లో పోటీకి విముఖత చూపిన ఉండవల్లి.. వైయస్ ప్రోద్బలంతో పోటీ చేశారు. 2014లో ఆయనకు ఆసక్తి ఉందా అనేది కూడా తేలాల్సి ఉంది.
ఏలూరు ఎంపి కావూరి రామచంద్ర రావు రాజ్యసభకు వెళ్లాలనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆయన సిద్ధంగా లేరట. దీంతో రాజ్యసభ స్థానం కోసం ప్రయత్నాలు ప్రారంభించారట.
ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కెవిపి రామచంద్ర రావు పదవి కాలం వచ్చే ఏడాది ముగుస్తుంది. దీంతో ఆయన స్థానంపై కన్నేశారట. ఈ విషయాన్ని పరోక్షంగా ఆయన వద్ద కూడా కావూరి ప్రస్తావించారట.
ప్రస్తుతం పురంధేశ్వరి ప్రాతనిథ్యం వహిస్తున్న విశాఖపై టి.సుబ్బిరామి రెడ్డి ఎప్పటి నుండో పోటీ చేస్తానని చెబుతున్నారు. నిన్న సోనియాను కలిసిన ఆయన వైజాగ్లో తన కార్యక్రమాలను సోనియాకు వివరించానని, ఆమె మెచ్చుకున్నారని చెప్పారు.