ఆళ్లగడ్డలో శోభ కూతురు: చంద్రబాబుపై ఒత్తిడి
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికపైనే అందరి దృష్టి నిలిచింది. ఈ దఫా ఎన్నికల్లో విజేతలెవరన్న విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం భూమా, గంగుల కుటుంబాలు హోరాహోరీగా పోరాడాయి. ఇప్పుడు రాజకీయంగా ఆ రెండు కుటుంబాలు నువ్వా, నేనా అన్నట్లు తలపడుతూనే ఉన్నాయి.
ఈ రెండు కుటుంబాలు 1962, 1997 ఎన్నికలు మినహా 13సార్లు తలపడ్డాయి. వీటిలో తొమ్మిది దఫాలు భూమా కుటుంబీకులు, నాలుగు దఫాలు గంగుల కుటుంబం వారు విజయం సాధించారు. 2009, 2012 ఉప ఎన్నికల్లో విజయం సాధించిన శోభా నాగిరెడ్డి 2014 ఎన్నికల్లో నామినేషన్ వేసిన తరువాత ఎన్నికలకు ముందు ప్రమాదంలో మరణించారు.
అప్పటి ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి విజయం సాధించారు. శోభ మృతితో ఆళ్లగడ్డకు మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉప ఎన్నికల్లో తిరిగి భూమా కుటుంబం బరిలోకి దిగింది. శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ రాజకీయల్లోకి వచ్చి వైసీపీ తరపున తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
గతంలో రాజకీయ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తుండగా పోటీ చేయాలన్న ఒత్తిడి ఆళ్లగడ్డ నియోజకవర్గం నేతల నుంచి ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి గంగుల ప్రతాప రెడ్డి పేరు ఖరారు చేసినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ టీడీపీ పోటీ చేయాలని నిర్ణయిస్తే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గంగుల ప్రభాకర్ రెడ్డిని మళ్లీ బరిలోకి దింపుతారని అంటున్నారు. ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగితే కాంగ్రెస్ అభ్యర్థిగా గంగుల ప్రతాప రెడ్డి పోటీ చేయకపోవచ్చని టీడీపీ నేతలు భావిస్తున్నారు. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి శోభా కూతురు అఖిల ప్రియ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఎక్కువగా టీడీపీ పోటీ చేసే అవకాశాలు ఉండవంటున్నారు.