అసమ్మతి నేతల మౌనం: చంద్రబాబుకు సీనియర్లు షాకిస్తారా?
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజేసింది. తమకు కేబినెట్లో చోటు దక్కకపోవడంతో పలువురు సీనియర్ నేతలు అలక పాన్పు ఎక్కారు. అందులో పలువురు నేతలు కూల్ అయ్యారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రాజేసింది. తమకు కేబినెట్లో చోటు దక్కకపోవడంతో పలువురు సీనియర్ నేతలు అలక పాన్పు ఎక్కారు. అందులో పలువురు నేతలు కూల్ అయ్యారు. బుజ్జగింపులతొ కొందరు తగ్గారు. ఇంకొందరిలో ఆగ్రహం చల్లారలేదు.
దూళిపాళ్ల నరేంద్ర, బొండా ఉమా మహేశ్వర రావు వంటి నేతలు ఒకింత చల్లబడ్డారనే చెప్పవచ్చు. అయితే, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలు మాత్రం ఇంకా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికీ అసంతృప్తితో ఉన్న నేతలు చంద్రబాబుకు షాకిస్తారా అనేది ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు.
సీఎం పిలుపు కోసం గోరంట్ల వర్గం ఎదురుచూపు
గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం మౌనం వహించారు. మంత్రివర్గంలోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని తీసుకోవడంతో, పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించిన ఆయన మంగళవారం మౌనం దాల్చారు. ఇక ఈ విషయాలు మాట్లాడనని సోమవారమే ఆయన మీడియాకు తెలిపారు.
ఉపముఖ్యమంత్రి చినరాజప్ప సోమవారం గోరంట్ల ఇంటికి వచ్చిన ఆయనను వ్యక్తిగతంగా కలసి మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి గోరంట్ల అభిప్రాయాలను తీసుకు వెళ్తానని చెప్పారు. అయితే సీఎం నుంచి నేరుగా నుంచి పిలుపు వస్తుందని గోరంట్ల అనుచరులు భావిస్తున్నారు. కేవలం పార్టీ మేలు కోసమే కానీ, మంత్రి పదవి కోసం కాదని గోరంట్ల చెబుతున్నారు.
గోరంట్ల అలక.. సీనియర్ల ఆందోళన
సీనియర్ నేతగా ఉన్న గోరంట్ల అలకవహించడంతో పార్టీలో నేతలంతా ఆందోళన చెందారు. రాజమహేంద్రవరంలో పార్టీ కార్పొరేటర్లు, వివిధ పదవుల్లో ఉన్నవారు గోరంట్లకు మద్దతుగా నిలిచారు. ఇదే సమయంలో 1982లో తనతోపాటు పార్టీలో క్రియాశీలకంగా ఉన్న పలువురు పాతతరం నేతలు గోరంట్లకు ఫోన్లు చేశారు. బుచ్చయ్య తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్న మనస్తాపంతో చాలాకాలంగా ఉన్నారు.
అప్పటి నుంచి అసంతృప్తి
2014 ఎన్నికలలో కూడా చివరి వరకు టికెట్ ప్రకటించకపోవడం, రాజమహేంద్రవరం సిటీ కాదని రూరల్ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించడం వంటి పరిణామాలతో గోరంట్ల అప్పటి నుంచీ పార్టీ పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్నారు.
ప్రజల్లో గెలవని వారికి మంత్రి పదవులు ఇచ్చారంటూ మంత్రి యనమల రామకృష్ణుడును ఉద్దేశించి రెండు రోజుల క్రితం రాజీనామా సందర్భంగా ఘాటుగా స్పందించారు. ఈ అంసం జిల్లాలో రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు తెరతీసింది. మరోవైపు, అధిష్ఠానం ఇంతవరకు ఆయనతో నేరుగా చర్చలు జరపడం గానీ, బుజ్జగించడం గానీ చేయలేదు. పరిస్థితి ఒకటి రెండు రోజుల్లో సద్దుమణుగుతుందని భావిస్తున్నారు.
బొజ్జల వెంటే పలువురు నేతలు
మీ వెంటే మేముంటామని శ్రీకాళహస్తీశ్వరాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గురవయ్య నాయుడు మాజీ మంత్రి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణా రెడ్డికి చెప్పారు. మంగళవారం గురవయ్య నాయుడు హైదరాబాదులో బొజ్జలను కలిసి ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై చర్చించారు. మంత్రి వర్గం నుంచి తొలగించడం పట్ల శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బొజ్జలకు తెలిపారు. ఈ సందర్భంగా బొజ్జల మాట్లాడారు. తాను టిడిపిలోనే కొనసాగుతానని, అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామన్నారు.
బండారుకు భవిష్యత్తులో సముచిత స్థానం
పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి రానున్న రోజుల్లో పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తానని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. వెన్నెలపాలెంలోని బండారు నివాసానికి మంగళవారం వెళ్లిన ముత్తంశెట్టి ఆయనను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఎంపీ స్థానిక విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి వర్గ పునర్వవస్థీకరణ చేశారన్నారు. ఈ నేపథ్యంలో బండారుకు అవకాశం లభించలేదన్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఉందని, ఆ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదన్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారందరినీ అదిష్ఠానం గుర్తిస్తుందన్నారు. బండారు లాంటి సీనియర్ నాయకులుపార్టీకి అవసరమన్నారు. 2019 ఎన్నికల అనంతరం సీనియర్లకు సముచిత స్థానం కల్పించడం ఖాయమన్నారు. బండారును పలువురు నేతలు పరామర్శించారు.