అఖిలేష్కు ఆజంఖాన్ ఝలక్: సమావేశానికి డుమ్మా
ఆజంఖాన్ గైర్హాజరీ పార్టీని ఇరకాటంలో పడేసింది. అనారోగ్యం కారణంగా ఆజంఖాన్ రెండు రోజుల మేధోమథన సమావేశానికి హాజరు కాలేకపోతున్నారని ఎస్పీ వర్గాలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముజఫర్ నగర్ అల్లర్ల నియంత్రణలో అఖిలేష్ యాదవ్ విఫలమయ్యారనే ఆసంతృప్తితోనే ఆయన సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
2012 ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆజంఖాన్ అంటూ వస్తున్నారు. ముజఫర్ అల్లర్ల విషయంలో అఖిలేష్ యాదవ్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అల్లర్లు విస్తరించకుండా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని కొన్ని ముస్లిం గ్రూపులు కూడా అంటున్నాయి. అల్లర్లలో ఇప్పటి వరకు 38 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్ సమావేశానికి హాజరు కాకపోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అల్లర్లను అరికట్టడంలో విఫలమైన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని జమైత్ ఉలామా -ఐ - హింద్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, ఆల్ ఇండియా ముస్లిం మజ్లీస్ - ఎ - ముషావరత్, జమాత్ - ఎ - ఇస్లామీ హింద్, జమైత్ ఆహ్లే హదీస్ హింద్ వంటి ముస్లిం సంఘాలు డిమాండ్ చేశాయి. ఆజంఖాన్ అసంతృప్తి అఖిలేష్ యాదవ్ ప్రత్యర్థులను పెంచిందని చెప్పవచ్చు.
ఆజంఖాన్ గైర్హాజర్ కారణంగా నష్టం కలగకుండా చూసే బాధ్యతను ఎస్పీ నాయకత్వం సీనియర్ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్కు అప్పగించింది. ఆజం కోపంగా లేరని, ముఖ్యమంత్రితో పాటు ఆయన కనిపిస్తారని, ఆజం ఖాన్ గైర్హాజరీపై ఎక్కువగా ఊహించుకోవద్దని రామ్ గోపాల్ యాదవ్ చెప్పారు. ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ను నియమించడంపై మొదటి నుంచి ఆజం ఖాన్ అసంతృప్తితోనే ఉన్నారు.