ఫ్యాన్ హత్య, పవన్ ఉద్వేగం: చిరు బాటలో.. సభ వెనుక!
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం నాడు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారా? మరో హీరో అభిమాని చేతిలో తన అభిమాని హత్యకు గురైన సందర్భంలో ఎందుకు పార్టీ తొలి సభకు నిర్ణయం తీసుకున్నారనే చర్చ సాగుతోంది.
పవన్ కళ్యాణ్ ట్విస్ట్: తిరుపతిలో హఠాత్తుగా సభ, ఏం చెప్తారు? జగన్తో ఎలా?
2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ టిడిపి-బిజెపి కూటమికి మద్దతు పలికారు. ప్రభుత్వం తప్పు చేస్తే తాను కచ్చితంగా ప్రశ్నిస్తానని పవన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి ప్రభుత్వాలని ప్రశ్నించిన సందర్భాలున్నాయి.
పవన్ ప్రశ్నాస్త్రాల పైన అధికార టిడిపి, బిజెపి, ప్రతిపక్ష వైసిపి, కాంగ్రెస్ పార్టీలు ఆయా రీతుల్లో స్పందించారు. ప్రధానంగా వైసిపి మాత్రం పవన్ ప్రశ్నించిన విధానాన్ని పలుమార్లు తప్పుబట్టింది. ఏదేమైనా ఇప్పుడు జనసేన ఏపీలో చురుకవుతుండటం గమనార్హం.
చిరంజీవి దారిలో...
పవన్ కళ్యాణ్ తన సోదరుడు చిరంజీవి బాటలోనే పయనిస్తున్నారని చెప్పవచ్చు. మరో యంగ్ హీరో అభిమానుల చేతిలో హత్యకు గురైన తన అభిమాని వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న తిరుపతి చేరుకున్న పవన్... శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడే తనకు కేటాయించిన గెస్ట్ హౌస్కు చేరుకున్న ఆయన అక్కడే ఉన్నారు.
సన్నిహితులతో సమాలోచనలు
తనకు అత్యంత సన్నిహితులైన వారితో మాత్రం ఆయన సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే జనసేన పేరిట రాజకీయ పార్టీని ప్రకటించిన పవన్... శనివారం తిరుపతిలో పార్టీ పేరిటే భారీ బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
గతంలో చిరంజీవి తిరుపతిలోనే..
గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ప్రారంభించిన తిరుపతిలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తొలి పార్టీ సభను నిర్వహిస్తున్నారు.
మోడీని నిలదీసేనా
2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి-బిజెపి కూటమికి పవన్ మద్దతు పలికినా.. అది బిజెపి లేదా మోడీ పైన అభిమానంతోనే అనే వాదనలు ఉన్నాయి. ఏపీలో టిడిపి, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పలు సందర్భాల్లో పవన్ మాటల ధోరణి బీజేపీకి అనుకూలంగానే ఉందనే వాదనలు ఉన్నాయి. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన మాట్లాడలేదు. ఇప్పుడు జనసేన పార్టీని చైతన్యం చేస్తే ఆయన హోదా పైన మోడీని కచ్చితంగా నిలదీయాల్సిందేనని, లేదంటే ప్రజలు విమర్శలు ఎదుర్కోక తప్పదంటున్నారు.
జగన్ మాట వినేనా?
ఏపీలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయని, వాటి కోసం తమతో కలిసి రావాలని వైసిపి ఎప్పటి నుంచో చెబుతోంది. జనసేనను చైతన్యం చేస్తే ఆయన ఏపీలోని ప్రజా సమస్యల పైన జగన్తో కలిసి నిలదీస్తారా, లేదా సొంతగా నిలదీస్తారా తెలియాల్సి ఉంది.
జిల్లాల్లోను బహిరంగ సభలు
తిరుపతిలో బహిరంగ సభ అనంతరం పవన్ కళ్యాణ్ జిల్లాల్లోను బహిరంగ సభలు నిర్వహించనున్నారు. శనివారం నాడు తిరుపతిలోని ఇందిరా మైదానంలో బహిరంగ సభ జరగనుంది.
అభిమాని వినోద్ హత్య
మరో హీరో అభిమాని చేతిలో పవన్ కళ్యాణ్ అభిమాని వినోద్ హతమయ్యాడు. వారి కుటుంబాన్ని ఓదార్చే సమయంలో పవన్ కళ్యాణ్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో హీరోల మధ్య గొడవ.. అభిమానులు ఎలా ఉండాలి అనే విషయమై మాట్లాడుతారా లేక రాజకీయాల గురించా అనే చర్చ సాగుతోంది. బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్న వేదిక కేవలం ఏడెనిమిది వేల మంది పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ సభనా లేక అభిమానులను ఉద్దేశించి మాట్లాడే సభనా అనే చర్చ సాగుతోంది.