నితీష్కు తాజా సర్వే షాక్: బీహార్లో బిజెపిదే గెలుపు
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని తాజా సర్వే ఒకటి చెబుతోంది. జీ న్యూస్ - జంటకామూడ్ కలిపి చేసిన సర్వేలో బిజెపికి 2/3 మెజార్టీ వస్తోందని సర్వేలో తేలింది.
బీజేపీకి 53.8 శాతం ఓట్లు, 147 సీట్లు వస్తాయని, మహా కూటమికి 64 సీట్లు, 40.2 శాతం ఓట్లు రావచ్చని, ఇతరుల స్థానం నామమాత్రమేనని సర్వేలో తేలింది. ఎన్డీయేలో భాగంగా జితన్ రామ్ మాంఝీ, రామ్ విలాస్ పాశ్వాన్, ఉపేంద్ర కుశాహ్వ తదితర నేతలు ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీ పడుతున్నారని తెలిపింది.
వీరి నేతృత్వంలోని హెచ్ఏఎం, ఎల్జేపీ, ఆర్ఎస్ఎల్పీలు చేతులు కలిపి పోటీలో నిలువగా, ఆర్జేడీ, జనతాదళ్ యునైడెట్, కాంగ్రెస్, జనతాదళ్ పార్టీలు మహా కూటమిగా అవతరించిన విషయం తెలిసిందే.
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 54.6 శాతం మంది ఎన్డీయే కూటమికి, 39.7 శాతం మంది నితీష్ నేతృత్వంలోని కూటమికి అనుకూలంగా ఉన్నట్టు సర్వే ఫలితాలు వెల్లడించాయి.
ఏ పార్టీకి అవకాశాలున్నాయని, బీహార్ రాజకీయాల్లో శక్తిమంతమైన యాదవుల వర్గాన్ని అడగగా, 50.2 శాతం మంది మహా కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా, ఎన్డీయే గెలుస్తుందని 43.7 శాతం మంది చెప్పారు.
రాష్ట్రంలో కులాలు, ప్రాంతాల వారీగా సర్వే జరిపామని... ముస్లింలలో 35.9 శాతం మంది, హిందువుల్లో 57 శాతానికి పైగా ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నారని తేలిందని సర్వే తెలిపింది.