బిజెపి ప్లాన్: బాబుతో దోస్తీ, పవన్ కల్యాణ్ కార్నర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి తన వ్యూహాన్ని పక్కగా ఖరారు చేసుకున్నట్లు అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో దోస్తీని కొనసాగిస్తూనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కార్నర్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రాజకీయంగా బలం పుంజుకోకుండా చూడాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇంతకు ముందు తన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాటలను బట్టి, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలను బట్టి, తాజాగా బిజెపి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సిద్ధార్థనాథ్ సింగ్ ప్రకటనను బట్టి ఆ విషయం తెలిసిపోతోంది.
పవన్ కల్యాణ్ సభలపై మంగళవారం బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన ప్రకటనను బట్టి కూడా అది అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ సభలు ఆయన వ్యక్తిగతమని ఆమె వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్ కార్యకలాపాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదనే ఆలోచన కూడా బిజెపికి ఉన్నట్లు ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇలా...
చంద్రబాబుకు తాము ఎళ్లవేళలా తోడుంటామని, చంద్రబాబును ఒంటరి చేయబోమని అరుణ్ జైట్లీ అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెబుతూనే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, హోదా కన్నా ఎక్కువ ప్రయోజనం రాష్ట్రానికి కలిగేలా చూస్తామని ఆయన ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో అన్నారు. చంద్రబాబుతో వేదికను పంచుకుని ఆయన ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
వెంకయ్య నాయుడు పరోక్షంగా ఇలా...
తమను తమ మిత్రులే విమర్శిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అరుణ్ జైట్లీ, చంద్రబాబులతో వేదికను పంచుకున్న ఆయన ఇటీవల అమరావతిలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ను ఉద్దేశించే ఆయన ఆ మాటలు అన్నట్లు దాన్ని అన్వయించుకుంటున్నారు. వెంకయ్య నాయుడు మొదటి నుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది.
అందుకే బిజెపి చంద్రబాబుతో...
ప్రత్యేక హోదాను వదులుకుని ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించడంతో బిజెపికి, కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లయింది. ప్యాకేజీ వల్ల హోదా కన్నా ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు పదే పదే చెబుకుంటూ వస్తున్నారు. దీనివల్ల తమకు నష్టం ఉండదని బిజెపి భావిస్తూ ఉండవచ్చు. రాష్ట్రంలో చంద్రబాబుతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఎక్కువ సీట్లను సాధించుకోవచ్చుననే అంచనా కూడా బిజపి నాయకులకు ఉండవచ్చునంటున్నారు.
పవన్ కల్యాణ్తో బిజెపి అందువల్లనే...
ప్రత్యేక హోదాపై పోరాటం చేయడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా ఆయన హోదానే ఎజెండాగా వచ్చే ఎన్నికల్లో తన పార్టీని పోటీకి దించడానికి కూడా సిద్దవడుతున్నట్లు తెలుస్తోంది. హోదా డిమాండ్ను తీర్చే అవకాశం లేకపోవడంతో ఆయనను బుజ్జగించడం సాధ్యం కాదని బిజెపి నాయకులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ దూరమైనా బలమైన తెలుగుదేశం పార్టీ అండదండలతో ఎపిలో నెట్టుకు రావచ్చునని బిజెపి నాయకులు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
వైయస్ జగన్ ఏం చేస్తారు...
ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఇప్పటికే చెప్పారు. దాని కోసం తమ పార్టీ పార్లమెంటు సభ్యులతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్తామని కూడా ఆయన చెప్పారు. ఈ స్థితిలో జగన్తో దోస్తీ కట్టడం బిజెపికి సాధ్యమయ్యే పని కాదు. పైగా, జగన్పై ఇంకా పలు కేసులు పెండింగులో ఉన్నాయి. ఈ దృష్ట్యా జగన్కు దూరంగా ఉండడమే మంచిదని బిజెపి నాయకత్వం భావిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.
చంద్రబాబు ధీమా ఏమిటో...
వచ్చే ఎన్నికల్లో బిజెపితో కలిసి నడిస్తేనే తమకు ఉపయోగంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లు అర్థమవుతోంది. పవన్ కల్యాణ్, జగన్ ఓట్లను చీలిస్తే బిజెపితో జత కట్టడం ద్వారా తమకు ప్రయోజనం కలుగుతుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. కుల, ప్రాంతాలను బట్టి ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోతాయనే అంచనా ఉంది. ఇది బిజెపి, టిడిపి కూటమికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. బిజెపిని దూరంగా పెడితే సమయానికి బిజెపి తన మిత్రులను వెతుక్కుంటే టిడిపికి కష్టాలు ఎదురవుతాయని ఆయన భావిస్తున్నారు.
సమయానికి ఈ నేతలేం చేస్తారో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి బలపడుతుందనే ఉద్దేశంతో పలువురు ప్రధాన నాయకులు కాంగ్రెసు నుంచి బిజెపిలో చేరారు. వారిలో కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మినారాయణ, పురంధేశ్వరి వంటివారున్నారు. బిజెపితో టిడిపి జత కట్టినా కావూరి సాంబశివరావుకు ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ చంద్రబాబుకు తీవ్ర వ్యతిరేకి అయిన కన్నా లక్ష్మినారాయణ ఎలా ప్రతిస్పందిస్తారనేది చెప్పలేం. అయితే, పార్లమెంటు సీటు ఇస్తే ఆయన సర్దుకోవచ్చునని చెబుతున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే పురంధేశ్వరి కూడా సర్దుబాటు చేసుకుంటారని భావిస్తున్నారు. (
రెండు పార్టీలు బలంగా ఉంటేనే మేలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ఎన్నికల బరిలోకి దింపితే తమకే లాభమని చంద్రబాబుతో పాటు వెంకయ్య నాయుడు కూడా అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకే ప్రతిపక్షం ఉంటే ముఖాముఖీ పోటీ ఉంటుందని, దానివల్ల జగన్ను ఎదుర్కోవడానికి కష్టపడాల్సి వస్తుందని, పవన్ కల్యాణ్ వస్తే రెండు పార్టీలు కూడా పోటీకి దిగితే ముక్కోణపు పోటీ జరుగుతుందని, దానివల్ల తెలుగుదేశం, బిజెపి కూటమి లాభపడుతుందని భావిస్తున్నారు.