అమిత్ షా వ్యూహం: యుపి ఫార్ములాతో కెసిఆర్కు షాక్
వచ్చే ఎన్నికల్లో కెసిఆర్కు షాక్ ఇవ్వడానికి అమిత్ షా సిద్ధపడుతున్నారు. యుపి ఫార్ములాను తెలంగాణలో అమలు చేసే వ్యూహరచనకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్ కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇవ్వడానికి బిజెపి సిద్ధపడుతోంది. ఇందుకు అవసరమైన వ్యూహరచనకు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా శ్రీకారం చుట్టారు. యుపి ఫార్ములాను తెలంగాణలో అమలు చేయడానికి సిద్దపడుతున్నారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలు లోకసభ సాధారణ ఎన్నికలతో పాటు 2019లో జరగనున్నాయి. ఈ నెలాఖరులో అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తారని భావిస్తున్నారు. మూడు రోజుల పాటు హైదరాబాదులోనే ఉండి పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ సమావేశం కానున్నారు.
తమ పార్టీకి అనుకూలంగా హిందువుల ఓట్లను కూడగట్టుకుంటే కెసిఆర్ను దెబ్బ కొట్టడం ఆసాధ్యమేమీ కాదని బిజెపి నాయకులు భావిస్తున్నారు. హిందువుల ఓట్లను బిజెపి కూడగట్టుకోగా యుపిలో మైనారిటీ ఓట్లు వివిధ పార్టీల మధ్య చీలి పోయాయి. దీంతో బిజెపి విజయం సాధించడమే కాకుండా అనూహ్యమైన మెజారిటీ సాధించినట్లు అంచనా వేస్తున్నారు.
అదే ప్లాన్తో తెలంగాణలో బిజెపి....
యుపిలో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణలో అనుసరించాలని అమిత్ షా భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అయితే, బిజెపి మినహా అన్ని పార్టీలు కూడా మైనారిటీ ఓట్ల మీద ఆధారపడుతున్నాయి. ఇప్పటి వరకు హిందువుల ఓట్లు చీలిపోతూ ఉండడం వల్ల మైనారిటీ ఓట్లు ఎక్కువగా వచ్చిన పార్టీ విజయం సాధిస్తూ వచ్చింది. అయితే, దీన్ని తిరిగేయాలనేది అమిత్ షా వ్యూహంగా కనిపిస్తోంది. హిందువుల ఓట్లు చీలిపోకుండా చూస్తే తాము సత్తా చాటవచ్చునని అనుకుంటున్నారు.
కెసిఆర్ ముస్లిం రిజర్వేషన్ల హామీ కూడా....
ముస్లింలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లను కల్పించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సిద్ధపడుతున్నారు. అందుకు సుధీర్ కమిటీ నివేదిక కూడా సమర్పించింది. దానివల్ల హిందూ జనాభా నుంచి కెసిఆర్పై వ్యతిరేకత ఎదురవుతుందని బిజెపి అంచనా వేస్తుంది. దానివల్ల యుపి ఫార్ములాను తెలంగాణలో అమలు చేయడం సులభమవుతుందని భావిస్తోంది.
తెలంగాణలో తెరాసతో పొత్తు కష్టమే.
కెసిఆర్ తెలంగాణలో మైనారిటీ ఓటు బ్యాంక్ రాజకీయాలను అనుసరిస్తున్నారని, అందువల్లనే వారికి ప్రత్యేకమైన కోటాను కల్పిస్తున్నారని బిజెపి నాయకులు అంటున్నారు. ముస్లిం కోటాకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ఇప్పటికే బిజెపి ఆందోళన కార్యక్రమానికి కార్యాచరణను రూపొందిస్తోంది. ఈ స్థితిలో తెరాసతో పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదని బిజెపి నాయకులు భావిస్తున్నారు.
యువతపైనే బిజెపి దృష్టి
ముస్లింలకు ప్రత్యేక కోటా కల్పించడం వల్ల యువతపై ప్రభావం పడుతుందని, యువత తెరాస పట్ల అసంతృప్తితో రగిలిపోయే అవకాశం ఉందని బిజెపి అంచనా వేస్తోంది. దీంతో యువతను తమ వైపు తిప్పుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేపడితే మద్దతు లభిస్తుందని భావిస్తోంది.
ఎబివిపి ద్వారా ఇలా....
బిజెపి విద్యార్థి విభాగం ఎబివిపి ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఇందుకు గాను అమిత్ షా, బిజెపి శాసనసభా పక్ష నేత జి. కిషన్ రెడ్డి కలిసి పార్టీ నాయకులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులతోనే కాకుండా బూత్ స్థాయి నాయకులతో వారు సంప్రదింపులు జరిపే ఆలోచనలో ఉన్నారు.