క్రైస్తవులు బీజేపీ వెంటే, ఈశాన్య రాష్ట్రాల గెలుపు చెబుతోందిదే: రవిశంకర్ ప్రసాద్
కొచ్చి: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అధికార బీజేపీకి కొత్త ఊపునిచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మేఘాలయలలో అత్యధిక సంఖ్యలో ఉన్న క్రైస్తవులను కూడా తనవైపు తిప్పుకోవడంలో మోడీ సర్కారు సఫలీకృతమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ రెట్టించిన ఉత్సాహంతో కేరళపై దృష్టిసారించింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలోనూ పాగా వేయాలని కాషాయదళం పావులు కదుపుతోంది. కేరళలోని క్రైస్తవులను కూడా తనవైపు తిప్పుకోవాలని భావిస్తోంది. కేరళలోని ఓ చర్చి ఆధ్యర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైరో మలబారు క్యాథలిక్ చర్చి హెడ్ అయిన జార్జ్ అలెన్చెర్రీపై ప్రశంసలు కురిపించారు. అలెన్చెర్రీ అన్నా, చర్చి తరుపున ఆయన చేపట్టే కార్యక్రమాలన్నా తనకెంతో గౌరవమని తెలిపారు. అందుకే ఆయన పిలవగానే తాను ఈ కార్యక్రమానికి విచ్చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
సీపీఐ(ఎం) నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్లకు బాగా పట్టున్న కేరళలో బీజేపీ కూడా తన బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ మాటల ద్వారా తేటతెల్లం అవుతోంది.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) ఓటమి దేశంలోనే ఒక కొత్త మేల్కొలుపుగా ఆయన అభివర్ణించారు. కేరళలో కూడా బీజేపీ త్వరలోనే అధికార పార్టీకి సమాన స్థాయికి చేరుకోగలదనే ఆశాభావాన్ని రవిశంకర్ ప్రసాద్ వ్యక్తం చేశారు. 'గోవా తరువాత బీజేపీ నాగాలాండ్, మేఘాలయలో కూడా తన బలాన్ని చాటుకోగలిగిందన్నారు.
నాగాలాండ్లో 75 శాతానికిపైగా క్రైస్తవులు ఉన్నారని, 20 మంది బీజేపీ అభ్యర్థులలో 11 మంది విజయం సాధించారని, ఇదంతా ప్రధాని మోడీ చలువేనన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మోడీ పాలనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. దాదాపు 70 శాతం భారతదేశం బీజేపీ పాలనలో ఉందన్నారు. దేశంలోని 21 రాష్ట్రాలలో నేడు బీజేపీ అధికారంలో ఉందని మంత్రి పేర్కొన్నారు.
కేరళలో సాగుతోన్న రాజకీయ హింసకు అధికార పార్టీదే బాధ్యత అని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఏ పార్టీ అయినా ప్రజలకు దగ్గరకావచ్చన్నారు. ప్రజలదే అంతిమ తీర్పు అని, ఈశాన్య రాష్ట్రాల ప్రజల తీర్పుతో వారు బీజేపీపై విశ్వాసం వ్యక్తం చేశారని, కేరళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పార్టీ వారికి కూడా మరింత దగ్గరవుతుందని స్పష్టం చేశారు.