జగన్ కోరుకుందే: పవన్ కల్యాణ్తో వ్యూహాత్మకంగా బిజెపి?
Recommended Video
అమరావతి: తెలుగుదేశం, బిజెపిల మధ్య తెగదెంపులు జరిగాయి. చాలా కాలంగా అనుకుంటోందే జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏదో ఒక రోజు బిజెపిలో తెగదెంపులు చేసుకోక తప్పదని భావిస్తూ వచ్చినట్లే జరిగింది. చంద్రబాబును బిజెపి ఆ దిశగా నెడుతోందనే గత ప్రచారాలకు కూడా ఊతం ఇచ్చినట్లయింది.
తీవ్రమైన ఒత్తిడికి గురై, బిజెపి వేసిన ఎత్తుల కారణంగా ఎన్డీఎ నుంచి తప్పుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కూడా చాలా కాలంగా అదే కోరుకుంటున్నారు. ఆయన కోరుకుందే జరిగింది. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించబోయే రాజకీయ కార్యాచరణకు పదును పెట్టేందుకు బిజెపి సిద్ధపడింది.
ఇదే అదునుగా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాష్ట్ర బిజెపి నేతలకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. అత్యసరంగా జరిగే ఆ సమావేశంలో బిజెపి జాతీయాధ్యక్షుడు కీలకమైన నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఏ పార్టీతో కలిసి నడవాలనే విషయంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
పవన్తోనా, జగన్తోనా...
తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఏ పార్టీతో వెళ్లాలనే విషయంపై బిజెపి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ను కలుపుకోవాలా, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి నడవాలా అనే విషయంపై మాట్లాడుతారని అంటున్నారు. అయితే, వారు ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తు పెట్టుకుంటారా అనేది సందేహమే.
బాబు చెప్పినట్లు అవుతుందా...
జగన్, పవన్ కల్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఓ వైపు జగన్తోనూ మరోవైపు పవన్ కల్యాణ్తోనూ కేంద్రం డ్రామాలు ఆడుతోందని చంద్రబాబు విమర్శలను చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవిశ్వాసం ప్రతిపాదించి, ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఇస్తామని జగన్కు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తే హోదా ఇస్తామని పవన్కు కేంద్రం చెప్పిందని ఆయన అంటున్నారు. కేంద్రం నిజంగానే ఆలాచేసి ఇరువురితోనూ పొత్తు పెట్టుకుంటుందా అనేది ఇప్పుడే చెప్పలేం.
మరో విషయం కూడా...
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్య కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పవన్ కల్యాణ్కు తాము సహకరిస్తామని ఆయన చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. వరప్రసాద్ ప్రకటన తర్వాతనే చంద్రబాబుకు బిజెపి వ్యూహంపై ఓ స్పష్టత వచ్చి, తెగదెంపులు చేసుకున్నారని భావించవచ్చు. వచ్చే ఎన్నికల్లో బిజెపి, వైసిపి, జనసేన కలిసి పని చేస్తాయా అనేది కూడా ఇప్పటికైతే సమాధానం దొరకని ప్రశ్ననే.
ఎన్నికల తర్వాతనే అవగాహన
అయితే, జనసేన గానీ వైసిపి గానీ ఎన్నికల తర్వాతనే బిజెపితో పొత్తు పెట్టుకోవచ్చునని తెలుస్తోంది. ఈ విషయాన్ని గతంలో ఓసారి జగన్ స్పష్టంగానే చెప్పారు. ఆయన బిజెపికి దగ్గర కావాలని అనుకుంటున్నారనేది స్పష్టం. ఆ స్థితిలో ఎన్నికల తర్వాత అవసరమైతే ఇరువురు కూడా బిజెపికి మద్దతు ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది.
చంద్రబాబపై బిజెపి విమర్శలు
చంద్రబాబు ఎన్డీఎతో తెగదెంపులు చేసుకోవడం వల్ల బిజెపి నేతలు ఏమీ కంగారు పడలేదు. వెంటనే చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించడానికి పూనుకున్నారు. చంద్రబాబుపై ఎదురుదాడికి దిగారు. బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జివిఎల్ నరసింహారవు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చంద్రబాబు పట్ల వారు రచిస్తున్న వ్యూహమేమిటో అర్థం చేసుకోవచ్చు.
జీవిఎల్ ఏమన్నారంటే...
ఢిల్లీకి 29 సార్లు వెళ్లినప్పటికీ కేంద్రం ఏమీ చేయలేదని అనడం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమని జివీఎల్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భంయతోనే బిజెపిపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని కూడా విమర్శించారు.
ఒత్తిడిలో చంద్రబాబు
చంద్రబాబు తరుచుగా భావోద్వేగానికి గురి అవతుండం ఆయన ఎంతగా రాజకీయ ఒత్తిడిలో ఉన్నారో తెలియజేస్తోందని జివిఎల్ వ్యాఖ్యానించారు. నిజానికి చంద్రబాబు బిజెపితో తెగదెంపులు చేసుకోవాలని అనుకోలేదు. ఆయన చాలా సహనంతో వ్యవహరిస్తూ వచ్చారు. కానీ, బిజెపి గానీ కేంద్ర ప్రభుత్వం గానీ చంద్రబాబును పెద్గగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. దీంతో ఆయన ఎన్డీఎ నుంచి బయటకు రాక తప్పలేదు.