మోడీకి ఇదీ బలమే: సోనియాకు సోపతి కరువు
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన తర్వాత కూడా విపక్షాల మధ్య అనైక్యతకు దారి తీసిన కారణాలేమిటన్నదీ ప్రశ్నార్థకంగా మారింది.
న్యూఢిల్లీ: తదుపరి రాష్ట్రపతి ఎన్నికల ఎన్నికల్లో నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ అభ్యర్థికి ధీటైన ఉమ్మడి అభ్యర్థి ఎన్నిక కోసం గత వారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ విపక్ష పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రతిపక్షాలు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), త్రుణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ), ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ), నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), డీఎంకే, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సహా విపక్షాల పార్టీల నేతలంతా హాజరయ్యారు. కానీ 2013 నుంచి ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీటైన నేతగా ఎదిగిన జేడీయూ అధ్యక్షుడు - బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం గైర్హాజరయ్యారు.
కానీ ఆ మరుసటి రోజున ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యాన నిర్వహించిన విందు సమావేశంలో ఠంచన్గా పాల్గొన్నారు. కాకపోతే దానికి రాజకీయ ప్రాధాన్యం లేదని నితీశ్ కుమార్ చెప్పారనుకోండి. అది వేరే సంగతి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిన తర్వాత కూడా విపక్షాల మధ్య అనైక్యతకు దారి తీసిన కారణాలేమిటన్నదీ ప్రశ్నార్థకంగా మారింది.
బీజేపీ విజయ పరంపర ఇలా
మూడేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రం, ఒక సిటీ తర్వాత మరొక సిటీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్నా, విపక్షాల్లో చలనం రాలేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలు ఐక్యత సాధించేందుకు మరోసారి శనివారం సమావేశమవుతున్నాయి.
మూడున డీఎంకే అధినేత జన్మ దిన వేడుకలు
తమిళనాట విపక్షమైన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సుప్రీం ఎం కరుణానిధి 94వ జన్మ దినోత్సవ వేడుకలు శనివారం జరుగనున్నాయి. కాకలు తీరిన రాజకీయ యోధుడు కరుణానిధి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వేళ ఇది. అయినా విపక్షాల మధ్య ఐక్యత సాధించేందుకు ఒక వేదికగా మారింది. దేశంలోని విపక్ష పార్టీల నేతలంతా శనివారానికి చెన్నై బాట పడుతున్నారు. ఈ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనుండడం గమనార్హం.
కరుణ జన్మ దిన వేడుకలకు నితీశ్ హాజరవుతారా?
డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మాత్రం తన తండ్రి జన్మదిన వేడుకలకు బీజేపీ నేతలను ఆహ్వానించడం లేదని చెప్పేశారు. ఇదిలా ఉంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మాత్రం ఈ సమావేశానికి పిలువక పోవడం ఆసక్తికర పరిణామమే మరి. కరుణానిధి జన్మదిన వేడుకలకు బీహార్ సీఎం నితీశ్ హాజరవుతారా? లేదా? సందేహమేనని అంటున్నారు. ఇక్కడ ఒక గమ్మత్తు ఉన్నది. 1999 ఎన్నికల తర్వాత నితీశ్, కరుణానిధి కేంద్రంలో ఎన్డీయే మిత్ర పక్షాలుగానే ఉన్నాయి. 2002 నాటికే కేంద్రం అన్నాడీఎంకే పరోక్ష మద్దతు తీసుకోవడంతో 2004 ఎన్నికల నుంచి డీఎంకే, కాంగ్రెస్ పార్టీతో జత కట్టింది. 2013లో మోదీకి వ్యతిరేకంగా నితీశ్ బయటకు వచ్చారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలతో మమేకమవుతున్నారు.
ఇలా దేశ చరిత్రలో బలహీన విపక్షం
మూడేళ్ల క్రితం ఏర్పాటైన నరేంద్ర మోదీ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ రోజురోజుకు మరింత బలోపేతం అవుతున్నది. స్వాతంత్రోద్యమ అనంతర భారత చరిత్రలో బలహీనమైన విపక్షం ఏర్పాటైన దాఖలాలు లేవని జాతీయ పరిణామాలు చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతున్నది. 2019 ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తప్ప మరో పార్టీకి ఓటేసే, ఓటేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే రెండేళ్ల నాటికైనా విపక్షాల మధ్య ఐక్యత సాధ్యం కాకపోతే అదే నిజం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్తున్నారు.
మోదీ ప్రజాకర్షణ ముందుకు విపక్షాలు ఇలా..
తొలి నుంచి భారత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ వచ్చిన అతి పురాతన పార్టీ కాంగ్రెస్.. తొలి నాటి విధేయుల విశ్వాసాన్ని పొందడంలో విఫలం అవుతున్నది. ఒంటరిగా ఎప్పటికప్పుడు సవాళ్లు ఎదుర్కొంటున్నది. 2014లో చారిత్రక తీర్పుతో బీజేపీని అధికారంలోకి తెచ్చిన నరేంద్రమోదీ ప్రధానిగా ఎదిగితే, ఆయన ప్రజాకర్షక శక్తి ముందు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కకావికలమైంది. కేవలం 44 స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ సరిదిద్దలేని పరిస్థితికి చేరుకున్నది. ఒకరిద్దరికీ పార్టీ పూర్వ వైభవం కోసం క్రుషి చేస్తారని, పార్టీ పునాదిని బలోపేతం చేస్తారని ఆశలు ఉన్నాయి.
గుణ పాఠాలు నేర్చుకోని విపక్షాలు
కానీ మోదీ ప్రభుత్వ హయాంలో మధ్యలోకి వచ్చిన తర్వాత ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాల బలహీనతలను మరోసారి గుర్తుచేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ గానీ, ఇతర విపక్షాలు గానీ గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ప్రధాన విపక్ష పార్టీగా కాంగ్రెస్.. తనలో వైఫల్యాలకు కారణాలేమిటన్న విశ్లేషణకు గత మూడేళ్లలో ఒక్కటంటే ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవంటే అతిశేయోక్తి కాదని గాంధీ కుటుంబ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
బీజేపీ ఇలా ఆచితూచీ స్పందన
బీహార్ సీఎం నితీశ్ కుమార్ మాత్రం చురుగ్గా ఉన్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ వివాదాస్పదమైన మాటెలా ఉన్నా ఆయన మిత్రుడు - ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను పశుగ్రాసం కుంభకోణం దర్యాప్తు వెంటాడుతున్నది. ఇదీ 2019లో మోదీతో పడేందుకు గల అవకాశాలను దెబ్బ తీసున్నది. మరోవైపు బీజేపీ కూడా నితీశ్ కుమార్ తో ఆచితూచి స్పందిస్తున్నది. నితీశ్ కుమార్ ఇబ్బంది పడకుండా కమలనాథులు వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ విపక్షాలను మరింత బలహీన పరుస్తున్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
బెంగాల్ మంత్రుల అవినీతే ఆమెకు అడ్డంకి
పశ్చిమ బెంగాల్ సీఎం, త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జీ ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో సమర్థవంతంగా వాణి వినిపించగల మహిళా నాయకురాలిగా పేరొందారు. కానీ ఆమె వాక్ఛాతుర్యం, సమర్థతలు జాతీయ రాజకీయాల్లో విపక్షాలను ఐక్యంగా కలిపి ఉంచేందుకు సహకరిస్తాయా? అన్న సందేహం వ్యక్తమవుతున్నది. శారదా చిట్ ఫండ్, నారదా తదితర సంస్థల కుంభకోణాల్లో ఆమె సహచర మంత్రులే చిక్కుకోవడం మమతాబెనర్జీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తున్నదన్న మాటలు వినిపిస్తున్నాయి.
ఐక్యం కావాలని కేరళ సీఎం విజయన్ పిలుపు
పలు విపక్షాల నాయకులపై అవినీతి ఆరోపణలు, అభియోగాలు ఉన్నాయని లెఫ్ట్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. దేశ ప్రజలందరి ముందు అవినీతి పరుల నేతలు ఉన్నారని, ఆయా నేతలపై ఉన్న కేసుల్లో నిజమైన అభియోగాలేవి? అబద్దాలేవి? అన్నవీ చెప్పలేమని ఆ నేత తెలిపారు. నాయకులందరినీ ఒకే గాటన కట్టేయడం సరి కాదని లెఫ్ట్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలా ఉంటే, దేశ వ్యాప్తంగా గోవధపై విధించిన నిషేధంపై చర్చ జరుగుతున్నది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని, హక్కుల ఉల్లంఘనేనని పేర్కొంటూ విపక్షాలు ఒకే వేదికపైకి రావడానికి ప్రభుత్వమే అవకాశం కల్పించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గోవధను నిషేధిస్తూ విపక్ష నాయకులు ఐక్యంగా కలిసి రావాలని కేరళ సీఎం పినరయ్ విజయన్ పిలుపునిచ్చారు.
ఐక్యంగా ఎదగాలని విపక్షాల నిర్ణయం
కేరళ సీఎం విజయన్ పిలుపునకు స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ముందుకు వచ్చారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కంటే తీవ్రంగా గట్టిగా ప్రతిస్పందించారు. జాతీయ స్థాయిలో ఎదుగుతున్న బీజేపీ నిలువరించేందుకు సిద్ధమన్న సంకేతాలిచ్చింది. విపక్ష పార్టీల నాయకులు విభిన్న వైఖరులు ఉన్నా ప్రస్తుతం ఉమ్మడిగా ముందుకు సాగాలన్న సూత్రాన్ని ఆవశ్యకతను గుర్తించారు. ప్రధాని నరేంద్రమోదీని విపక్ష నేతలు తాము వ్యక్తిగతంగా ఎదుర్కోలేమన్న నిర్ణయానికి వచ్చారు. శరవేగంగా దూసుకెళ్తున్న ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు విపక్షాలకు సమయం వస్తుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.