టిడిపిలో రాజ్యాంగేతర ముద్ర: ఎస్పిలో ఆధిపత్య పోరు
తెలుగునాట ఆత్మగౌరవం పేరిట అలనాటి సినీ నటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1982లో ఒక ఊపు ఊపింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిపత్య రాజకీయాలకు చెక్ పెట్టింది.
న్యూఢిల్లీ: తెలుగునాట ఆత్మగౌరవం పేరిట అలనాటి సినీ నటుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1982లో ఒక ఊపు ఊపింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆధిపత్య రాజకీయాలకు చెక్ పెట్టింది. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల గడువులోపే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టి అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి ఉమ్మడి ఏపీలో 16 ఏళ్లు పాలన సాగించిన తెలుగుదేశం పార్టీ.. ప్రస్తుతం అవశేష ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది.
రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలకు వారసుడిగా.. తొలుత లోక్దళ్.. తర్వాత జనతాదళ్ పార్టీ ఆవిర్భావంలోనూ కీలక పాత్ర.. 1990లో స్వయంగా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడిగా ములాయం సింగ్యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీల రాజకీయాల్లో పాలుపంచుకుంటున్నారు. 'మండల్' రాజకీయాలు వచ్చాక ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఎస్పీ పాత్ర కీలకంగా మారింది. అదే సమయంలో 'కమండల్' రాజకీయం జోరుగా సాగడంతో సుదీర్ఘ కాలం హంగ్ అసెంబ్లీ కొనసాగింది. 1996 నుంచి 2002 వరకు పలుసార్లు ప్రభుత్వాలు మారాయి.
మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుల సమీకరణాలను పూర్తిగా ఆకళింపు చేసుకుని దళిత, బ్రాహ్మణ, ముస్లింల కాంబినేషన్తో 2007లో తొలిసారి అధికారంలోకి వచ్చింది. 2012లో సంప్రదాయంగా ముస్లింలు, యాదవ్లతోపాటు ఇతర సామాజిక వర్గాల మద్దతు కూడగట్టడంలో కీలక పాత్ర పోషించిన అఖిలేశ్.. నాటి ఎన్నికల విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. తదనుగుణంగానే ఎస్పీ వ్యవస్థాపకుడిగా ములాయం సింగ్ యాదవ్ తన వారసుడిగా.. యుపి సిఎంగా కొడుకు అఖిలేశ్ యాదవ్ను కూర్చుండబెట్టారు.
నాటి నుంచి ములాయం సోదరుడు శివ్ పాల్ యాదవ్, అఖిలేశ్ మధ్య దూరం పెరిగింది. అది నాలుగున్నరేళ్లుగా అడపాదడపా బయటపడ్డా ములాయం రాజీ చేస్తూ వచ్చారు. మరోవైపు ములాయం రెండో భార్య సాధనాగుప్తా తన కొడుకుకు ములాయం రాజకీయ వారసత్వంలోనూ ప్రాతినిధ్యంపై ఆశలు పెట్టుకున్నది. వీరిద్దరికీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సహచరుడు అమర్ సింగ్ తోడయ్యారు. అఖిలేశ్ యాదవ్కు వ్యతిరేకంగా జట్టు కట్టారని ఆరోపణలు వచ్చాయి. అఖిలేశ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివ్రుద్ధి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇటు సాధువులు, అటు ఇమాంల మద్దతు కూడగట్టడంలో సఫలమయ్యారు.
ఇప్పటివరకు తండ్రి చాటు బిడ్డగా వ్యవహరించిన అఖిలేశ్ సర్కార్ హయాంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణలు గుప్పిస్తూ వచ్చింది బిజెపి. కానీ ఎస్పీ పగ్గాలు పూర్తిగా అఖిలేశ్ యాదవ్కే దఖలు పడడంతో కమలనాథుల నోట మాట పెగలడం లేదు. ఇక పార్టీలో ఆధిపత్యం, విధాన నిర్ణయాక శక్తిగా ఎదిగేందుకు తండ్రిని ఎదిరించేందుకు కూడా అఖిలేశ్ వెనుకాడలేదు. అందులో భాగంగా శివ్పాల్యాదవ్కు సన్నిహితుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తొలగించేందుకు కూడా వెనుకాడలేదు. ప్రతిగా తండ్రి ములాయం స్వయంగా కొడుకు మద్దతుదారులపై వేటేశారు. ఇది 2016 డిసెంబర్ చివరి వారం వరకు సాగింది. సీఎంగా ఉన్న అఖిలేశ్ యాదవ్తోపాటు ములాయం తన మరో సోదరుడు రాంగోపాల్ యాదవ్పై ఆరేళ్ల బహిష్కరణ, ఉపసంహరణ డ్రామా సాగింది.
ఈ పర్యవసానాల నేపథ్యంలో రాంగోపాల్ యాదవ్ సారథ్యంలో జరిగిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ప్రత్యేక జాతీయ సదస్సు ఈ నెల ఒకటో తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ స్థానే అఖిలేశ్ యాదవ్ను ఎన్నుకున్నారు.
ఈ వివాదం క్రమంగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) వరకు సాగింది. ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించినా చివరకు ఎన్నికల సంఘం ముందు అఖిలేశ్ యాదవ్ వాదమే నెగ్గింది. 229 మంది ఎమ్మెల్యేలకు పైగా 195 మంది, 60 మంది ఎమ్మెల్సీలతోపాటు ఎంపిలతోపాటు పార్టీ ప్రతినిధుల్లో అత్యధికులు అఖిలేశ్ యాదవ్ పక్షానే నిలిచారని నిర్ధారించుకున్న సిఇసి.. అఖిలేశ్ గ్రూపునకే 'సైకిల్' గుర్తు కేటాయించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎన్నికల గుర్తు'సైకిల్' కావడం యాద్రుచ్చికమే. పార్టీల చీలికలోనూ టిడిపి, ఎస్పి మధ్య కొన్ని సారుప్యతలు ఉన్నాయి. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది.
అప్పుడే తెలుగుదేశం పార్టీ (టిడిపి)లో ఆధిపత్య పోరుకు తెర లేచింది. పునర్వివాహం చేసుకున్న 'అన్న'పై తిరుగుబాటుకు ఆదిలోనే పునాది ఏర్పడింది. ఎన్టీఆర్ సతీమణిగా లక్ష్మీ పార్వతిపై 'రాజ్యాంగేతర శక్తి' ముద్ర వేశారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు.. మూడోసారి టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీలోని నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు నందమూరి కుటుంబాన్ని తన దరి చేర్చుకున్నామన్న సంకేతాలు ఇచ్చారు.
1995 జూలై నాటికే టిడిపి రెండు గ్రూపులుగా చీలింది. జూలై నెలాఖరులో శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు నాటి ఆర్థికశాఖ మంత్రి, నేటి ఏపి సిఎం చంద్రబాబు. ఎన్టీఆర్ సీఎంగా ఉత్తరాంధ్ర పర్యటనలో ముగించుకుని వచ్చేలోగా హైదరాబాద్లో సమర సన్నాహాలు జోరుగా సాగాయి.
ట్యాంక్ బండ్ పక్కనే ఉన్న ఓ ప్రముఖ హోటల్ ను అందుకు వేదికగా చేసుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలతో మొదలైన శిబిరం 24 గంటల్లోగా మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్నది. చివరకు అసెంబ్లీ సాక్షిగా ఎన్టీఆర్ బల నిరూపణకు ముందే సిఎం పదవికి రాజీనామా చేశారు. తర్వాత పార్టీ గుర్తు దక్కించుకునేందుకు న్యాయ పోరాటం సాగింది. తెర వెనుక రాజకీయాల నడుమ చంద్రబాబు నాయుడు గ్రూపునకే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం 'హైకోర్టు' సైకిల్ గుర్తు అప్పగించింది.
నాడు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన చంద్రబాబు గానీ, నందమూరి కుటుంబ సభ్యులుగానీ 'అన్న' గారి వద్దకు వెళ్లే సాహసం చేయలేకపోయారు. 1995 సెప్టెంబర్లో సిఎంగా ప్రమాణ స్వీకారంచేసిన చంద్రబాబు, మంత్రిగా హరిక్రుష్ట, భువనేశ్వరి, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బాబు.. ఎన్టీఆర్ ఇంటికి వెళ్లినా ముఖం ముందే తలుపులు వేసేశారు. నాటి నుంచి ఎన్టీఆర్ను చంద్రబాబు గానీ, ఆయన కుమారులుగానీ కలుసుకున్న దాఖలాలే లేవు. చివరికి మరణించే వరకు ఎవరూ ఆయనను కలుసుకోలేదు.
కానీ ఎస్పీలో తిరుగుబాటు భావుటా ఎగురవేసిన తర్వాత కూడా తండ్రీ తనయులు ములాయం, అఖిలేశ్ యాదవ్లు కలుసుకుని చర్చించుకున్నారు. పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్'ను అఖిలేశ్ యాదవ్కు కేటాయించిన తర్వాత కూడా తండ్రి ఆశీస్సుల కోసం ములాయం ఇంటికి వెళ్లారు యువ 'నేతాజీ'. తన తండ్రి ఓటమి సాధారణ విషయమేమీ కాదన్నారు. తొలి నుంచి తండ్రి పట్ల గౌరవం ప్రదర్శిస్తూ పరిణతితో కూడిన రాజకీయాలకు నెలవుగా మారారు.