కాంగ్రెస్లో ‘గుజరాత్’ నూతనోత్తేజం: కేసీఆర్కూ హెచ్చరికేనా!
హైదరాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయ విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వ్ నూతనోత్తేజంతో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావులకు హెచ్చరికేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా అధికార బీజేపీ నాయకత్వానికి గట్టిపోటీ ఇవ్వడంతోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి ప్రత్యామ్నాయం అందించగలమన్న భరోసానందిస్తోంది కాంగ్రెస్ పార్టీ. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో పరస్పర భిన్నమైన పరిస్థితులు కూడా ఉన్నాయి.
గుజరాత్ రాష్ట్రంలో 22 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసే కార్యకర్తల బలం అంతగా లేకున్నా కమలనాథులను హడల్ కొట్టింది. ఆ కార్యకర్తల బలమే ఉంటే జీఎస్టీకి వ్యతిరేకంగా వ్యాపారులు ఆందోళన చేసిన సూరత్లో తద్భిన్నమైన పరిస్థితులు ఉండేవి.
ఇలా 80 స్థానాలకు పెరిగిన విపక్షం
2012 అసెంబ్లీ ఫలితాలతో పోలిస్తే గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకున్నది. 2012లో 61 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో 12 స్థానాలు గెలుచుకోగా, మద్దతుతో పోటీ చేసిన ఇద్దరు ‘చోటువాసవ, జిగ్నేశ్ మేవానీ' విజయం సాధించారు. ఇక ఎన్సీపీ ఒక స్థానంలో గెలుపొందింది. దీని ప్రకారం విపక్షం బలం 80కి చేరింది. కొద్ది నెలల క్రితం రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి ఫిరాయించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ రాజ్యసభకు ఎన్నికవ్వకుండా చూడాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పరువు దక్కించుకోవడంతోపాటు నైతికంగా బలం సంపాదించుకున్నది.
ఆరు శాతం ఓట్లు పెంచుకున్న కాంగ్రెస్
రాజ్యసభ ఎన్నికల సమయంలోనే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న శంకర్ సింఘ్ వాఘేలా రాజీనామా చేసి సొంతంగా జనవికల్ప్ మోర్చా పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. సుమారు 100 స్థానాల పరిధిలో వాఘేలా.. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీయగలమని లెక్కలేసుకున్నారు. కానీ వాస్తవ పరిణామాలు అందుకు భిన్నంగా జరిగాయి. అంతటితో ఆగలేదు. కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకున్నది ఓటింగ్ శాతాన్ని గ్రామీణ ప్రాంతంలో 19శాతం ఓటుబ్యాంకు పెంచుకున్నది. పట్టణాల్లో ఇంకా రెండు శాతం వెనుకబడి ఉండటంతో స్థూలంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరుశాతం ఓటింగ్ పెంచుకున్నది.
పట్టణాల్లోనూ మద్దతు లేక అధికారానికి దూరమైన కాంగ్రెస్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్థానాల పెంపుతో కచ్ఛితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నైతిక మద్దతునిచ్చే అంశమే. పట్టణ ప్రాంతాల్లో ప్రజల మద్దతు కూడగట్టుకోగలిగి ఉంటే గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదే. పట్టణాల్లో తొలి నుంచి ఉన్న మద్దతును కాపాడుకోవడం వల్లే ఆరోసారి బీజేపీ గుజరాత్ రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కుల సమీకరణాలు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగ యువతలో అసమ్మతి ఆసరగా గణనీయ విజయాలు సాధించింది కాంగ్రెస్ పార్టీ.
పట్టణ యువత, కులాల బుజ్జగింపుపై సీఎం కేసీఆర్
గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగానే తెలంగాణలో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. సెంటిమెంట్ ఆధారంగా అధికారంలోకి వచ్చిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. పట్టణ యువత, కొన్ని కుల సంఘాలు, గ్రూపులను విజయవంతంగా బుజ్జగించొచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో యువతలో, ప్రజల్లో తీవ్రంగా అసమ్మతి, వ్యతిరేకత గూడు కట్టుకున్నది. ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా.. యువత, గ్రామీణుల సమస్యలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ద్రుష్టి సారించకుండా ఉండి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గోడకు కొట్టిన బంతిలా తిరిగి అధికారంలోకి రావడం ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సెంటిమెంట్తోనే అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్
ఐదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కొదవలేదు. తెలంగాణ కొత్త రాష్ట్ర కావడంతోపాటు రాష్ట్రస్థాయిలో కాదుగా జిల్లా స్థాయిలోనూ పార్టీకి సారథ్యం వహించే నాయకులే కరువయ్యారు. కానీ గ్రామ గ్రామాన పార్టీ శ్రేణులు ఇప్పటికీ బలంగానే ఉన్నారు. మూడున్నరేళ్ల పాటు కేవలం నినాదాలతో కాలం గడిపిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది. కానీ 2014 నాటికి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి కొంత కార్యకర్తల బలం ఉన్న మాట నిజమే కానీ మిగతా జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో కార్యకర్తలు కరువే అంటే అతిశయోక్తి కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ పూర్తయ్యేనా?
లక్షా పది వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మూడున్నరేళ్లుగా ప్రకటనలు చేసినా ఇప్పటివరకు అధికారికంగా నియమించిన ఉద్యోగాలు 20 వేల లోపే. కానీ ఏడాది లోపు మిగతా ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారన్నది అనుమానమే. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలుకు నోచుకున్న దాఖాలాలు కనిపించడం లేదు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేది. కానీ సంపూర్ణంగా ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. నిరుపేద దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తామని ఇచ్చిన హామీ.. జిల్లాల్లో 50 మంది, 100 మందికి లోపే ఉన్నది. కానీ దళితులు వేలల్లో ఉన్నారు.
మానకొండూరులో దళితుడి ఆత్మహత్యతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన
మానకొండూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఒక దళితుడు తమకు మూడెకరాల భూమి రాదన్న ఆవేదననతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా నిరసన రేకెత్తించింది. ఇచ్చిన హామీల అమలులో వెనుకబడ్డ టీఆర్ఎస్ అధినేత - సీఎం కేసీఆర్.. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తానని చెబుతూనే మరోవైపు ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల మధ్య ఎలా సమన్వయం సాధిస్తారన్నదీ అనుమానమే మరి. ఏం జరుగుతున్నదన్న తేలాలంటే మరో 17 నెలలు ఆగాల్సిందే.