బాబు, జగన్ వల: దారి చూసుకుంటున్న నేతలు
తాజా రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీలకు వల వేస్తున్నాయి. సిడబ్ల్యూసి విభజన నిర్ణయం, తెలంగాణపై వెనక్కి తగ్గేది లేదని అధిష్టానం పెద్దలు చెబుతున్న నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నాయకులు కూడా ఇతర పార్టీలోకి వెళ్లేందుకు చూస్తున్నారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నాయకులతో పలువురు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారట.
బుధవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి విశ్వరూప్, అనంతపురం ఎంపి అనంత వెంకట్రామి రెడ్డి మద్దతు పలకగా, గురువారం టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్షకు గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు సంఘీభావం తెలిపారు. తాను ఈ నెల 18వ తేదిన జగన్ పార్టీలో చేరుతానని విశ్వరూప్ చెప్పారు. ఎంపి అనంత జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
రాయపాటి టిడిపిలో చేరేందుకు సిద్దమయ్యారని అంటున్నారు. బాబుకు మద్దతు తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీమాంధ్రకు న్యాయం కోరుతున్నందున తాను బాబుకు మద్దతు తెలిపానని, ఆయన తనకు బంధువు అవుతారని చెప్పారు. ఇన్నాళ్లు కొత్త పార్టీ అన్న రాయపాటి బాబుకు మద్దతు తెలపడంతో ఆయన టిడిపి వైపుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే చెప్పవచ్చు. అయితే ఎప్పుడు చేరుతారనే విషయం తేలాల్సి ఉంది. గతంలో ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కొద్ది రోజుల క్రితం జగన్ పార్టీలో నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి చేరారు.
ఇలా పలువురు సీమాంధ్ర కాంగ్రెసు నేతలు తలోదారి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీకి అవకాశం లేనట్లే భావిస్తున్నారు. అయితే కాంగ్రెసు విభజన వైపు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరికొందరు నేతలు కాంగ్రెసును వీడి టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు ఇతర పార్టీలో చేరాలనే విషయమై చర్చిస్తున్నారట. అందరు కలిసి ఒకే పార్టీలోకి వెళ్లాలని భావిస్తున్నారట.
రాయపాటి తమ అధినేతకు మద్దతు తెలపడాన్ని టిడిపి నేతలు పత్తిపాటి పుల్లారావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు స్వాగతించారు. ఆయన పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీకి పంపించి విభజనపై అధిష్టాన అధే దూకుడు ప్రదర్శిస్తే మరికొందరు నేతలు బాబు, జగన్ల వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు.