కేసీఆర్కు కౌంటర్: పవార్తో రాహుల్ భేటీ, ఇదీ ప్లాన్
న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ చురుగ్గా కదులుతున్నారు. కేసీఆర్ వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి ముందే ఆయన తన వ్యూహానికి రూపం దిద్ది ఆచరణలో పెడుతున్నారు.
భావసారూప్యం గల పార్టీలను కూడగట్టి బిజెపి వ్యతిరేక కూటమిని బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగా ఆయన బుధవారంనాడు ఎన్సీపి నేత శరద్ పవార్ను కలిసినట్లు తెలుస్తోంది. అందుకు ఆయన శరద్ పవార్ నివాసానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఇలా...
బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసిఆర్ ప్రకటించారు. దానికి మద్దతు కూడగట్టేందుకు తాను వివిధ ప్రాంతాలు పర్యటిస్తానని కూడా చెప్పారు. అయితే, ఆయన థర్డ్ ఫ్రంట్ ఆలోచనకు మద్దతు చెప్పిన హేమంత్ సొరేన్ వెనక్కి వెళ్లారరు. తృణమూల్ కాంగ్రెసు నేత మమతా బెనర్జీ ఎటూ తేల్చుకోలేనట్లు కనిపిస్తున్నారు. డిఎంకె నేత స్టాలిన్ కూడా తన వైఖరిని వెల్లడించడానికి ఇష్టపడలేదు. ఈ స్థితిలో రాహుల్ గాంధీ ఆయా పార్టీలను యుపిఎ కూటమిలోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు అర్థమవుతోంది.
మమతా బెనర్జీతోనూ భేటీ...
తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ భేటీ కావాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఆమె మార్చి 28వ తేదీన ఢిల్లీ వస్తున్నారు. ఈ సమయంలో రాహుల్ ఆమెను కలిసే అవకాశం ఉంది. 2019లో నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి బలమైన బిజెపి వ్యతిరేక కూటమి అవసరం గురించి మాట్లాడవచ్చునని అంటున్నారు.
ఆ తర్వాత పవార్తో రాహుల్ భేటీ
ప్రతిపక్షాల నాయకులకు యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ విందు ఇచ్చిన మర్నాడు రాహుల్ గాంధీ శరద్ పవార్ను కలుసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సోనియా గాంధీ విందు సమావేశానికి దాదాపు 20 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి కేసీఆర్ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను ఆహ్వానించలేదు.
మహా కూటమి ఏర్పాటుపై దృష్టి
2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో బిజెపిని ఓడించడానిికి మహా కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బుధవారం పలువురు ప్రతిపక్ష నేతలు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో బిజెపి ఓటమి తర్వాత ఆ పిలుపు ఊపందుకుంది.
మహా కూటమికి పిలుపు...
బిజెపిని ఓడించడానికి జాతీయ స్తాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయాలని ఆర్జెడీ నేత తేజస్వీ యాదవ్తో పాటు ప్రముఖ సోషలిస్టు నాయకుడు శరద్ యాదవ్ పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీల నేతలను కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ అభినందించారు.