దినకరన్ విజయం వెనక ఆ ముగ్గురు: వారెవరు?
చెన్నై: జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కె నగర్ నియోజకవర్గంలో టిటీవి దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన విజయం వెనక కీలకమైన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు.
దినకరన్ను ఓడించడానికి అన్ని విధాలుగా ప్రయత్నించిన ఈపిఎస్ - ఓపిఎస్ వర్గం ఘోరంగా దెబ్బ తిన్నది. దినకరన్ విజయానికి ముగ్గురు నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
పి. వెట్రివేల్
వెట్రివేల్ ఆర్కె నగర్ మాజీ ఎమ్మెల్యే. ఉత్తర చెన్నైలో బలమైన నాయకుడు. దినకరన్ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జయలలిత రెండు సార్లు ఆ నియోజకవర్గం నుంచి విజయం సాధించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆర్కె నగర్ నియోజకవర్గంలో కూలీలు ఎక్కువగా ఉంటారు. ప్రధానమైన అందరితోనూ వెట్రివేల్ దినకరన్తో మాట్లాడించారు.
వెట్రివేల్ ప్లాన్ బి..
వెట్రివేల్ ప్లాన్ బి కూడా రూపొందించి అమలు చేశారు. తమకు విధేయులైన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్న ఇతర కార్యకర్తలను రంగంలోకి దించారు. పోలింగ్ రోజు బూత్ ఏజెంట్లు ఎక్కడికీ కదలకుండా, చెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇద్దరు మాజీ మంత్రులు ఇలా..
ఇద్దరు మాజీ మంత్రులు కూడా దినకరన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. వారు సెంథిల్ బాలాజీ, పలనియప్పన్. వారిపై ఎమ్మెల్యేలుగా ఇటీవల అనర్హత వేటు పడింది. క్వీన్ మేరీ కాలేజీలో ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కున్నారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టినప్పుడు, ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఘర్ణణవాతావరణం నెలకొన్నప్పుడు దినకర్ మద్దతుదారులను శాంతపరచడానికి తీవ్రంగా ప్రయత్నించారు.
బాలాజీ ఇలా చేశారు..
ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నప్పుడు బాలాజీ పోల్ అబ్జర్వర్స్పై కేకలు వేయడం కూడా కనిపించింది. తమ తమ సొంత జిల్లాల నుంచి దినకరన్ సమావేశాలకు పెద్ద యెత్తున ప్రజలను కూడగట్టడంలో వారిద్దరు ప్రముఖ పాత్ర పోషించారు.