ఇక రాజస్థాన్ వంతు: అన్నదాత ఆందోళన బాట
పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతూ రాజస్థాన్లో అన్నదాతలు వినూత్న రీతిలో ఆందోళన బాట పట్టారు. సుమారు 50 రైతు సంఘాలు వచ్చేనెల 22వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి.
జైపూర్: పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతూ రాజస్థాన్లో అన్నదాతలు వినూత్న రీతిలో ఆందోళన బాట పట్టారు. మరోవైపు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో జైపూర్ లో రెండు రోజుల క్రితం జరిగిన మహా పంచాయతీలో వచ్చేనెల తొమ్మిదో తేదీన రాష్ట్రవ్యాప్తంగా 'అన్ని గ్రామాల్లో పనులు నిలిపివేయాలి' అని రైతులు తీర్మానించారు. 17వ తేదీన రైతు సంఘాల ఆధ్వర్యంలో కర్ఫ్యూ అమలు చేయాలని.. ఈ సందర్భంగా తమ గ్రామాలకు వచ్చే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులను ఘెరావ్ చేయాలని గత శనివారం జైపూర్లో జరిగిన రైతు సంఘాల సదస్సు నిర్ణయించింది.
సుమారు 50 రైతు సంఘాలు వచ్చేనెల 22వ తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి.బంద్ సందర్భంగా ఆహార ధాన్యాలు, పాలు, కూరగాయల విక్రయాలను నిలిపివేస్తారు. సుమారు 45 వేల గ్రామాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొననున్నాయి. ఇటీవల రాజస్థాన్ నలుమూలల రైతులు సమావేశమై తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.
ఆగ్రహిస్తున్న రాజస్థాన్ రైతు
క్రమంగా ఆందోళన విస్త్రుతం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రైతు సంఘాల నాయకులు, రైతులు భావిస్తున్నారు. కుల, ఆస్తిత్వ రాజకీయాల నుంచి చాలా కాలం తర్వాత రైతు రాజకీయాలు తిరిగి జాతీయ స్థాయిలో రంగ ప్రవేశం చేశాయి. వారం రోజులుగా రైతుల సదస్సులు, ఇతర ఆందోళనలతో రాజస్థాన్ గ్రామాలన్నీ అట్టుడుకుతున్నాయి.
జైపూర్ సదస్సులో ఇలా కీలక నిర్ణయాలు
ప్రతి రోజూ ఏదో ఒక మూల రైతులు సమావేశమై తమ బాగోగుల కోసం ఆందోళన చేపట్టడమే మార్గమని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. రాజస్థాన్ రాజధాని జైపూర్ శివారుల్లో జరిగిన సదస్సు పూర్తిస్థాయిలో రైతుల మనోభావాలను, వారి సాధక బాధకాలను బయటపెట్టింది. పప్పు ధాన్యాలు, గోధుమలు, సజ్జలు, వేరు శనగలు, ఆవాలు పండించిన రైతులంతా నష్టాల పాలవుతున్నారని ఓం ప్రకాశ్ ఝాంగార్ అనే రైతు సంఘం నాయకుడు గుర్తు చేశారు. ఫలానా పంటలు ఇబ్బడిముబ్బడిగా పండించాలని పదేపదే పిలుపునిస్తున్న ప్రభుత్వం.. వాటికి సరైన గిట్టుబాటు ధర కల్పించలేకపోవడానికి కారణాలేమిటని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వ్యవసాయం పట్ల కనిపించని శ్రద్ధ
1960వ దశకంలో పత్తి బేల్, పది గ్రాముల బంగారం ఒకటే ధర అని, కానీ పత్తి ధర కంటే బంగారం ధర పది రెట్లు ఎక్కువగా ఉన్నదని, అలా ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు.25 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులను పరిశీలిస్తే పారిశ్రామిక ప్రగతితో పోలిస్తే వ్యవసాయ రంగం ప్రగతి నెమ్మదిగా ముందుకు సాగడం వల్లే గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల మధ్య ఆదాయాల్లో అంతరాయం, అసమానతలు నెలకొన్నాయన్నారు. వ్యవసాయ రంగం అభివ్రుద్ధి పట్ల ప్రభుత్వానికి ఆసక్తే లేదని రైతులు మండిపడుతున్నారు. తాము ఆరుగాలం కష్ట పడి పండించిన పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్ పీ) ప్రకటించకపోవడంతో మార్కెట్లలో గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల సవరణకు నియమించిన వేతన సవరణ కమిషన్ సిపారసులను ఎందుకు అమలు చేస్తున్నారని నిలదీస్తున్నారు.
రైతుల కమిషన్ మాటేమిటి
వేతన కమిషన్ సిఫారసులను ఆమోదిస్తున్న ప్రభుత్వం.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ‘రైతుల కమిషన్' ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల రుణాలతో పోలిస్తే దేశ వ్యాప్తంగా అన్నదాతలకు ఇస్తున్న రుణాలు ఒక్క శాతమేనని గుర్తు చేస్తున్నారు. పంట రుణాలు తీసుకున్న రైతులు తప్పనిసరిగా చెల్లించాలని ఒత్తిడి తెస్తున్న బ్యాంకర్లు కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్న రుణాలు ఆయా సంస్థలు మాత్రమే చెల్లించాలన్న నిబంధనలను వాటి సీఈవోలు, ప్రమోటర్లకు ఎందుకు వర్తింపజేయడం లేదని నిలదీస్తున్నారు. మద్యం వ్యాపారి విజయ్ మాల్యా మాదిరిగా రైతులు విదేశాలకు పారిపోగలరా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు రైతులకు ఎరువులపై ఇస్తున్న సబ్సిడీకి తిలోదకాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సరైన మార్గం లేకపోవడం వల్లే అన్నదాతలు నష్టాల పాలవుతున్నాయి.
ఉల్లి కొనుగోలుకు డిమాండ్
మధ్యప్రదేశ్ రైతుల సమస్యలను పట్టించుకునే తీరిక శివ్రాజ్సింగ్ ప్రభుత్వానికి లేకుండా పోయింది. మార్కెట్లో రోజుల తర బడి పడిగాపులు కాస్తున్నా ఉల్లి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయక పోవడంతో సెహోర్లో రైతులు కన్నెర్ర చేశారు. ఇండోర్-భోపాల్ హైవే ను దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా కిలోమీటర్ల దూరం మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జూన్ 6న మందసోర్ ఘటన తర్వాత కిలో ఉల్లికి ప్రభుత్వం రూ.8 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించింది. అయినా రాష్ట్రవ్యాప్తంగా చాలా మార్కెట్లలో కనీస మద్దతు ధరకు ఉల్లిని కొనుగోలు చేయడం లేదని రైతులు వాపోయారు. అంతేకాక, మార్కెట్లో కొన్ని రోజులుగా పడిగాపులు కాస్తున్నా, పంటను మాత్రం కొనుగోలు చేయడం లేదని సెహోర్ రైతులు అవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో మార్కెట్కు తెచ్చిన ఉల్లి పంట చాలావరకు పాడైపోయిందని వారు తెలిపారు. ఇటీవల మంద్ సౌర్ లో జరిగిన రెండు రోజుల నిరవధిక బంద్ పోలీసు కాల్పులకు దారి తీసింది. ఆరుగురు రైతులు మరణించారు. అయినా శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి లేదని తెలుస్తోంది.