వరుస కష్టాల్లో చిన్నమ్మ: దినకరన్ కు ఆ సత్తా ఉందా?, అనిశ్చితే
తమిళనాడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాలని గత ఫిబ్రవరిలో కలలుగన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళా నటరాజన్ వరుస ఎదురు దెబ్బలతో విలవిల లాడుతున్నారు.
చెన్నై/ బెంగళూరు/ న్యూఢిల్లీ: తమిళనాడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టాలని గత ఫిబ్రవరిలో కలలుగన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళా నటరాజన్ వరుస ఎదురు దెబ్బలతో విలవిల లాడుతున్నారు. శశికళ సీఎం పదవి చేపట్టడం సంగతలా ఉంచి.. అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవిస్తుండగా, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ తర్వాత సుదీర్ఘ కాలం పార్టీ మనుగడకు పట్టుగొమ్మగా మారిన జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు తెర వెనుక రాజకీయాలతో తమిళనాట బీజేపీ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా శశికళకు ఎదురవుతున్న పరిణామాలతో ఆమె వ్యతిరేకులు సంతోషపడుతుండగా... మద్దతుదారులు మాత్రం సింహం బోనులో ఉన్నా... బయట ఉన్నా ఒకటేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు శివారులోని పరప్పన అగ్రహారం జైలులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
శశికళకు ప్రత్యేక ప్రాధాన్యంపై డీఐజీ రూప ఇలా
శశికళ జైలులో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, ఖైదీలా కాకుండా వీఐపీగా సేవలు పొందుతున్నారన్న ఆరోపణలు ఇటీవల సంచలనం సృష్టించాయి. ఆమె వదిన ఇళవరసితోపాటు జైలు నుంచి బయటకు వెళ్లి షాపింగ్ చేసుకుని వస్తున్నారని కర్ణాటక డీఐజీ అధికారిగా గతంలో వ్యవహరించిన డీ రూప ఆధారాలను సమర్పించారు. తాజాగా శశికళ జైలు నుంచి బయటకు వెళ్లి వస్తున్న వీడియో దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి. శశికళ జైలుకు సమీపంలో హోసూరుకు చెందిన ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి వచ్చారని తాజాగా బుధవారం రూప వెల్లడించారు.
Recommended Video
తమ తీర్పులో తప్పేమీ లేదన్న అత్యున్నత న్యాయస్థానం
మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పును పునఃపరిశీలించాలని ఆమె తరఫున సుప్రీం కోర్టులో దాఖలైన రివ్యూ పిటిషన్ను బుధవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ధ్రువీకరించడంలో ఎటువంటి పొరపాటు లేదని సుప్రీంకోర్టు తేల్చేయడంతో జైలునుంచి బయట పడొచ్చన్న నమ్మకం పూర్తిగా పోయింది. ఈ క్రమంలో ఆమె పూర్తికాలం జైలులో ఉండాల్సిన పరిస్థితి. ఆమెతోపాటు ఆమె వదిన ఇళవరసి, దత్త పుత్రుడు వీఎన్ సుధాకరన్ కూడా జైలులోనే ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏ-1గా ఉన్న జయలలిత మరణించారు. ఆమె లేని సమయంలో తమకు శిక్ష నుంచి విముక్తి కల్పిస్తారని ఆశించిన శశికళకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆమెను బయటకు తేవాలని విశ్వప్రయత్నాలు చేసిన ఆమె భర్త నటరాజన్, ఇతర మద్దతుదారులు విఫలమయ్యారు.
సీఎం పీఠం కాపాడుకునే పనిలో పళని
మరోవైపు రాష్ట్రంలో పన్నీర్సెల్వం, పళనిస్వామి వర్గాలు ఒక్కటయ్యాయి. నమ్మి అధికారంలో కూర్చొబెట్టిన సీఎం ఎడప్పాడి పళనిస్వామి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ పదవిని అంటిపెట్టుకున్నారు. తమ పక్షానికి మళ్లించుకునేందుకు కేంద్రంలోని బీజేపీ నాయకత్వం అమలు చేసిన వ్యూహంలో భాగంగా మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు డిప్యూటీ సీఎం పదవితోపాటు ఆర్థికశాఖ అప్పగించిన పళనిస్వామి తన పీఠం కాపాడుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే టీటీవీ దినకరన్ను పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా తొలగిస్తూ అన్నాడీఎంకే కార్యవర్గం తీర్మానం ఆమోదించి ఎన్నికల సంఘానికి పంపితే సంస్థాగత పదవి ఊడుతుంది.
డిప్యూటీ సీఎంగా పన్నీర్ సెల్వం ఇలా
ఇదే పరిస్థితి మున్ముందు శశికళకు గల అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవికి ఏర్పడుతుంది. దీంతో టీటీవీ వర్గం ద్వారా తాను అనుకున్నట్లు వ్యూహాలను అమలు చేసి విజయవంతం కాలేదన్న అంశం కూడా మరోపక్క ఆమెకు మింగుడుపడటం లేదని సమాచారం. గతంలో ముఖ్యమంత్రి పదవికి ఒక అడుగు దూరంలో నిలిచిపోయిన ఆమెకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా త్వరలో పోయే అవకాశం ఉండటం ఇబ్బందికరంగా మారింది. జైలుకు వెళ్లకముందే సీఎం కావాలనుకుని పన్నీర్సెల్వం వద్ద రాజీనామా చేయిస్తే ఆయన తిరుగుబాటుతో పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయి. ఇప్పుడు పన్నీర్సెల్వం మళ్లీ పార్టీలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. ఈ పరిణామాలన్నీ చిన్నమ్మకు ఇబ్బందికరంగా మారాయి.
దినకరన్ ప్లస్ డీఎంకే కలిస్తే ఇక అంతే
కాకపోతే 19 మంది ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్న టీటీవీ దినకరన్.. గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు. తత్ఫలితంగా పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడినట్లే. పళనిస్వామి అసెంబ్లీలో సభా విశ్వాసం పొందాలంటే మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు పొందడం అత్యవసరం. కనుక ఆయన, ఆయన డిప్యూటీ సదరు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టటంపైనే ప్రధానంగా కేంద్రీకరించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే కూడా అవకాశం కోసం కాచుకుని కూర్చుకున్నది. పరిస్థితులు తారుమారైతే.. టీటీవీ దినకరన్, డీఎంకే కలిస్తే మెజారిటీ కోల్పోతే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమే. ఆ పరిస్థితి వస్తుందా? రాదా? అనే విషయం ఇప్పుడు చెప్పడం కష్టమే గానీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం తమిళనాట ఒక వెలుగు వెలిగిన అన్నాడీఎంకే ప్రాభవం కోల్పోనున్నదన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.