విచిత్రం: పంట రుణ మాఫీపై కేంద్రం కప్పదాట్లు
పంట రుణాల మాఫీ పథకం అమలుపై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పిల్లిమొగ్గలేస్తున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకునే అధికార బీజేపీ.. 2014లో..
న్యూఢిల్లీ: పంట రుణాల మాఫీ పథకం అమలుపై కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పిల్లిమొగ్గలేస్తున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తమది భిన్నమైన పార్టీ అని చెప్పుకునే అధికార బీజేపీ.. 2014లో.. మళ్లీ మరో రెండేళ్లలో తన విజయానికి కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రైతుల పట్ల ఒక విధంగా.. మిగతా వారి పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
చివరకు బీజేపీ - శివసేన కూటమి అధికారంలో ఉన్న మహారాష్ట్ర.. అందునా అధిక వర్షాభావంతో రైతులు ఎక్కువగా బలవ్నర్మరణాలకు పాల్పడిన రాష్ట్రం గురించి కూడా కేంద్రం బహిరంగంగా ఒక్క మాట్ల కూడా మాట్లాడలేదు.
2014 చివరిలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రుణ మాఫీ పథకం అమలు చేస్తామని హామీలు గుప్పించిన ఘనత కేంద్ర సర్కార్ వారిదే. కానీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ ఊసే మరిచిపోయారు.
యూపీలో గెలుపుపై బీజేపీ ఇలా
తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయ భవితవ్యాన్ని నిర్దేశించేవి కావడంతో అప్రమత్తతతో వ్యవహరించిందీ బీజేపీ నాయకత్వం. ప్రధాని నరేంద్రమోదీ మొదలు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వరకు ప్రతి ఒక్కరూ పంట రుణాలు మాఫీ చేస్తామని ఊరూవాడా ఊదరగొట్టారు. దీనికి తోడు వైరిపక్షాలను మించి సామాజిక సమీకరణాల సమతుల్యతతో ఉత్తరప్రదేశ్లో బిజెపి చారిత్రక విజయం సాధించింది.
ఇలా కేంద్రమంత్రి కప్పదాట్లు
తదనుగుణంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నామని, ఇదీ తమ నిబద్ధత అని చాటుకునేందుకు ఉత్తరప్రదేశ్ రైతులకు రుణ మాఫీ పథకం అమలు చేస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించారు. ఇతర పక్షాల నుంచి ప్రశ్నలు ఎదురుకావడంతో తొట్రుపాటుకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం రుణ మాఫీ పథకం అమలుచేస్తుందని, దానికి కేంద్రం చేయూతనిస్తుందని జాగ్రత్తగా దాటేశారు.
కర్ణాటక అమలు చేస్తుందని కేంద్రమంత్రి ఆశాభావం
తాజాగా శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల్లో దేశవ్యాప్తంగా రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలన్న కాంగ్రెస్ డిమాండ్కు కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించలేదు. ఈ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్శర్మ లేవనెత్తారు. మరో సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ తీవ్ర కరువు నెలకొన్న కర్ణాటక రైతులకు రుణమాఫీ అమలు చేస్తారా అని ప్రశ్నించినప్పుడు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్సింగ్ స్పందిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర తరహాలోనే కర్ణాటక సర్కార్ కూడా రైతులను ఆదుకుంటుందని ఆశిస్తున్నానన్నారు.
దేశం సంగతి పట్టదా? అని ప్రశ్నించిన కాంగ్రెస్
కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినట్లే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్న హామీ మాత్రం కేంద్రం నుంచి లభించకపోవడంతో కాంగ్రెస్ సభ్యుడు ఆనందశర్మ మంత్రి రాధామోహన్ సింగ్ను తప్పుబట్టారు. ‘మీరు ఒక్క రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడతారు? గత యూపీఏ సర్కారు దేశమంతా రుణమాఫీ అమలుచేసిన విధానాన్ని మోదీ అమలు చేస్తారా? లేదా? అన్న విషయమై కేంద్రమంత్రిగా మీరు చెప్పండి' అన్నారు. దీనిపై వ్యవసాయ మంత్రి సమాధానం ఇవ్వకుండా దాటేశారు.
హామీ ఇవ్వకున్నా 2008లో మన్మోహన్ అమలు చేశారన్న పవార్
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గెలుపే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ‘పంటరుణాల' మాఫీ అమలు చేస్తామని స్వయంగా హామీ ఇచ్చారని, బీజేపీ యూపీ శాఖ ఇవ్వలేదని ఆర్థిక నిపుణులు గుర్తుచేశారు. కనుక ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని ఇచ్చిన హామీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సైతం 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలుపుకోవాలని ప్రధాని మోదీకి గుర్తు చేశారు. 2004 ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా 2008లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రుణ మాఫీ అమలు చేసిన సంగతి గుర్తు చేశారు.