అనంత పాలిటిక్స్: ఇష్టారాజ్యంగా జేసీ బ్రదర్స్.. పట్టుకోసం ఆగడాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాది ప్రత్యేక పరిస్థితి. అందునా తాడిపత్రి.. 1994 నుంచి 2005 వరకు జిల్లా రాజకీయాల్లో టీడీపీలో పరిటాల రవీంద్ర,
హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాది ప్రత్యేక పరిస్థితి. అందునా తాడిపత్రి.. 1994 నుంచి 2005 వరకు జిల్లా రాజకీయాల్లో టీడీపీలో పరిటాల రవీంద్ర, కాంగ్రెస్ పార్టీలో జేసీ దివాకర్ రెడ్డి క్రియాశీల పాత్ర పోషించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నిలిచిన అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్రెడ్డి 2014లో అనివార్య కాంగ్రెస్ పార్టీని వీడి సైకిలెక్కారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల వ్యతిరేకతతో ఉన్న జేసీ దివాకర్రెడ్డిది.. 2009లో వైఎస్ తన క్యాబినెట్లో చోటు కల్పించలేదని ఒక మీడియా సంస్థ కార్యాలయంపైనే దాడి చేసిన నేపథ్యం ఉంది.
మారిన పరిస్థితుల్లో మూడేళ్ల క్రితం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అనంతపురం లోక్ సభ స్థానానికి ఎంపీగా ఎన్నికైతే.. ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. నాటి నుంచి అన్న ఎంపీగా, తమ్ముడు ఎమ్మెల్యేగా జిల్లా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఏపీ సీఎం - టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డిపై విమర్శలు గుప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎదిగే కొద్దీ ఇలా జేసీ బ్రదర్స్
ఒక విషయం గమనించాల్సిందేమిటంటే నాడు తెలంగాణ పట్ల గానీ, నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై గానీ కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడంలో మాత్రం జేసీ దివాకర్ రెడ్డి ముందుంటారు. జిల్లాలోనూ, తాడిపత్రిలోనూ రాజకీయంగా పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న జేసీ బ్రదర్స్ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతోంది. హోదా పెరిగే కొద్దీ ఒదిగి ఉండాల్సిన నాయకులు రోడ్డెక్కి చేస్తున్న యాగీ నవ్వుల పాలవుతోంది. ఇదే సమయంలో వివాదాస్పద వైఖరి అడ్డూఅదుపు లేని వ్యాఖ్యలతో వీరిలాగే అన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. జేసీ బ్రదర్స్ వేదికనెక్కి మైకు పట్టుకుంటే చాలు.. ఆ నోట నుంచి వచ్చే ప్రతి మాటకూ.. ఆఖరికి వారు సీరియస్గా చేస్తున్న ప్రసంగం వినే ప్రజానీకం నవ్వులు చిందిస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. ఓ దశలో పీసీసీ చీఫ్ రేసులో నిలిచారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో తాడిపత్రి రాజకీయం సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేతుల్లోకి వెళ్లింది.
చంద్రబాబు జోక్యం చేసుకుంటేనే ఇలా జేసీ బ్రదర్స్
మున్సిపల్ వైస్చైర్మన్గా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంత రాజకీయ చరిత్ర కల వీరు ఇటీవల వివాదాస్పదం అవుతున్నారు. ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ప్రతి వేదికపైనా కనీస మర్యాద పాటించకుండా విమర్శలు గుప్పిస్తున్న తీరు ప్రజల్లో చర్చానీయాంశం జనాల్లో అవుతోంది. చివరకు సీఎం చంద్రబాబుతో వేదిక పంచుకున్న పలు సందర్భాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం ఇదేలా ఉంటోంది. క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆయనను నివారిస్తే తప్పా.. తనలో తను నవ్వుకోవడం పార్టీ ప్రతిష్ట ఎంతలా దిగజారిపోయిందో బయటపడ్తున్నది. తాజాగా విజయవాడ, వైజాగ్ విమానాశ్రయాల్లో వీరంగం సృష్టించిన దివాకర్రెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చివరకు విమానయాన సంస్థలు ఆయనపై నిషేధం విధించడం గమనార్హం.
తాడిపత్రిలో పైలాపై కేసు ఇలా
ఎంపీ దివాకర్రెడ్డితోపాటు ఆయన సోదరుడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి వైఖరి మరింత వివాదాస్పదమవుతున్నది. ఎన్నికలకోడ్ అమలులో ఉన్న సమయంలో ఇటీవల అనంతపురం బైపాస్రోడ్డులో టెంట్ వేసి విపక్షనేతను దుర్భాషలాడారు. దీనిపై సోషల్ మీడియాలో జేసీ బ్రదర్స్పై నెటిజన్లు తీవ్ర దాడి చేశారు. ట్రావెల్స్ వ్యవహారంలో తెలంగాణ ఆర్టీఓ కార్యాలయంలోనూ రగడ చేశారు. తాజాగా తాడిపత్రి వాసి పైలా నర్సింహయ్య అనే వ్యక్తిపై దాడిచేసినట్లు తాడిపత్రి నగర పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితోనే ఈ కేసు నమోదు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో లొంగిపోయిన పైలా నర్సింహయ్య కోర్టులో లొంగిపోయారు. అనారోగ్యం వల్ల కోర్టు ఆదేశాలతో ‘అనంత' ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పైలా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, మెరుగైన వైద్యం కోసం నిమ్స్కు తరలించాలని మహేశ్ అనే డాక్టర్ సిఫారసు చేసినా సూపరింటెండెంట్ జగన్నాథం పైలాను పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి జోక్యంతోనే ఇతన్ని రెఫర్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఆశ్రమ రవాణాను అడ్డుకున్నారని జేసీపై విమర్శలు?
దీంతోపాటు తాడిపత్రిలో శ్రీకృష్ణ ప్రాంగణంలో ప్రభోదానంద ఆశ్రమం నడుస్తోంది. నిర్వాహకులను జేసీ ప్రభాకర్రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఆశ్రమ నిర్మాణానికి ఆర్డీఓ అనుమతి తీసుకుని ఇసుక రవాణా చేస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే పోలీసులు ఇలా వ్యవహరించారని ఆశ్రమ నిర్వాహకులు వాపోతున్నారు. ఇసుక వ్యవహారంలో వెంకటేశ్ అనే దళితుడిని కులం పేరుతో దూషించి, బెదిరించారని.. తనకు ప్రాణహాని ఉందని ప్రభాకర్రెడ్డిపై వెంకటేశ్ మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ)లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై దళితుల్లోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. జేసీ బ్రదర్స్ తాడిపత్రిలో పేకాట, మట్కా నిర్వహించే వారికి అండగా ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. మునిసిపాలిటీ పాలకవర్గంలోని ఓ నేత తన ఇంట్లోనే పేకాట నిర్వహిస్తున్నారని తెలుస్తున్నది. పోలీసులూ పలుసార్లు తనిఖీలు చేసినా చర్యలు తీసుకోలేకపోయారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అధిపత్యం కాపాడుకునేందుకు జేసీ బ్రదర్స్ ఇలా
జేసీ బ్రదర్స్కు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో తమకు ఎదురులేకుండా పోయింది. జేసీ బ్రదర్స్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఎన్నికలు మరో రెండేళ్లు మాత్రమే ఉండటంతో అసమ్మతి గళం వినిపిస్తున్న వారిని కేసులతో భయపెడుతున్నారు. అంతేకాక వేధింపులకు గురి చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గంపన్న సోదరుడికి ఫోన్ చేసి తీవ్ర పదజాలంతో దూషించి బెదిరించిన ఘటన వారి వైఖరికి సాక్ష్యమని.. బయటికి రాని బెదిరింపులు ఇలా చాలా ఉన్నాయనేది విపక్షాల వాదన. ఈ పరిణామాలన్నీ జేసీ బ్రదర్స్ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది.