తెలంగాణలో ఎన్నిక: కెసిఆర్ మైండ్ గేమ్ ఆడారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డాక జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా తీర్పు విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి మైండ్ గేమ్ ఆడుతోందని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బుధవారం పోలింగ్ జరిగిన తర్వాత నెలకొన్న పరిణామాలు.. సర్వేల పేరిట సమాచారాన్ని పరస్పరం చేరవేయడం వంటి అంశాలను చేశారంటున్నారు. ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయని చెబుతున్నారు.
పలు జిల్లాల్లో తెరాస టీఆర్ఎస్ హోరు గాని, జోష్గాని ఎక్కడా కనిపించక పోయినప్పటికీ... పలువురు ముఖ్య నేతలు ఓడుతారని తెరాస నేతలు విస్తృతంగా ప్రచారం చేశారని అంటున్నారు. 2009 ఎన్నికల సమయంలోనూ ఇదే విధంగా పలువురిని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేసినప్పటికీ చాలామంది మంచి మెజారిటీతోనే విజయం సాధించారని కాంగ్రెసు నేతలు అంటున్నారట.
ఇప్పుడు కూడా అదే సీను పునరావృతం అవుతుందంటున్నారు. ఎన్నికల తర్వాత పలు నియోజకవర్గంలో అంచనాలు తీసుకుంటే.. ఎక్కడా తాము ఓటమి చెందమని అర్థమవుతోందని పలువురు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బలమైన నేత గట్టి పోటీ ఎదుర్కొంటూ ఏటికి ఎదురీదుతున్నారన్న ప్రచారం చేయడం ద్వారా మిగిలిన నేతలను మానసికంగా బలహీనులను చేసే మైండ్ గేమ్కు తెరాస తెర తీశారని కాంగ్రెసు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ఎన్నికలకు ముందు ఇలాంటి మైండ్ గేమ్ సహజమని ఇంకొందరు అంటున్నారు.
తెరాసది మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడమేనని పలువురు అంటున్నారు. ఈ నెల 16వ తేదిన తెరాసది మైండ్ గేమో లేక నిజమో తేలిపోతుందని ఇంకొందరు అంటున్నారు. అయితే, తెలంగాణ తెరాస వల్లే సాధ్యమైందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, అదే తమ వైపు మొగ్గేలా చేసిందని తెరాస క్యాడర్ అంటోంది.