కెసిఆర్ లక్ష్యం కాంగ్రెసు: హెలికాప్టర్ రెడీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లేనని భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెసును లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసు తెలంగాణ నేతలపై ఆయన విరుచుకుపడుతున్నారు. ఆయన త్వరలోనే తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకుగాను ఆయన హెలికాప్టర్ను కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ ఉపయోగించే అద్దె హెలికాప్టర్ 25 నాటికి అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. ఒకే రోజు రెండు వేర్వేరు జిల్లాల్లో కెసిఆర్ ప్రచార సభలు ఉండేలా ఆయన పర్యటన షెడ్యూల్ను ఖరారు చేస్తున్నారు.
మెదక్ జిల్లా నంగునూరు మండలం కోనాయపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2001లో పార్టీని ప్రారంభించినప్పటి నుచి ప్రతి ఎన్నికల్లో ఓటు వేయటానికి ముందు ఆయన ఆ దేవాలయానికి వెళ్లి వస్తుండడాన్ని సంప్రదాయంగా పెట్టుకున్నారు. 2001లో కోనాయపల్లి ఆలయం నుంచి నాంపల్లి దర్గాకు వెళ్లి ఆ తర్వాత జలదృశ్యానికి వెళ్లిన నేపథ్యంలో ఈసారి కూడా అక్కడికి వెళ్లాలని కెసిఆర్ అనుకుంటున్నారు.
నిజామాబాద్ జిల్లా మోతెలో కట్టిన మట్టి ముడుపును విప్పే కార్యక్రమం కూడా తెరాస నాయకత్వం కార్యక్రమంలో ఉంది. 2001లో పార్టీ పెట్టిన కొత్తల్లో అక్కడి గ్రామస్తులు తెలంగాణ కోసం పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవం చేసిన నేపథ్యంలో అక్కడ మట్టి ముడుపు కట్టారు. దాన్ని విప్పి, మట్టి చల్లే కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.
తమ పార్టీలో చేరడానికి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, అవసరాన్నిబట్టి వారిని చేర్చుకుంటామని తెరాస నాయకులు. ఆ పార్టీలోని అన్ని స్థాయి నాయకులనూ తమ పార్టీవైపు వైపు ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించామని చెబుతున్నారు. ఎన్నికల నాటికి కాంగ్రెస్ను బాగా దెబ్బతీయగలమనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకా దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, వేర్వేరు కారణాల వల్ల తీసుకోలేమని వారికి స్పష్టంచేసినట్లు చెబుతున్నారు. తెలంగాణలో తాము తిరుగులేని విజయం సాధిస్తామనే ధీమాతో తెరాస అధినేత కెసిఆర్ ఉన్నారు.