ఎన్టీఆర్ తర్వాత..: ఆ రెండింట్లో కిరణ్ ఏం చేస్తారు?
హైదరాబాద్: కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఆయన ఆది, సోమవారాల్లో పలువురు సీమాంధ్ర నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కిరణ్ కొత్త పార్టీ పెట్టేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రిగా సమైక్యాంధ్ర నినాదాన్ని భుజాన వేసుకుని పోరాడారని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన తీరును నిరసిస్తూ ఆయన ఎమ్మెల్యే పదవికి, ముఖ్యమంత్రి పదవికి, చివరికి పార్టీకి కూడా రాజీనామా చేశారని, ఆయన పార్టీ పెడితే సీమాంధ్ర ప్రజలు ఆదరిస్తారంటున్నారు.
ప్రస్తుతం తన ఇంటికే పరిమితమైన కిరణ్ ముందు రెండే రెండు మార్గాలు ఉన్నాయట. ఒకటి రాజకీయాల నుంచి వైదొలగడం. రెండోది రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే కొత్త పార్టీని ఏర్పాటు చేయడం. కొందరు రాజకీయాల నుండి తప్పుకుంటే మంచిదని చెబుతుండగా, మరికొందరు కొత్త పార్టీ పెట్టాలని సూచిస్తున్నారట.
కిరణ్ ఇంకా యువ నేతనే కాబట్టి, పార్టీ పెట్టకపోతే రాజకీయంగా ఇక భవిష్యత్తు ఉండదని చెబుతున్నారట. పార్టీ పెట్టకుండా ఊరుకుంటే ఆయనను నమ్ముకున్న వాళ్ల పరిస్థితి గందరగోళంలో పడుతుందని కొందరు చెబుతున్నారు. విభజన తర్వాత సీమాంధ్రలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీలు పలుచనయ్యాయని, ఇప్పుడు అక్కడ రాజకీయ శూన్యత ఉందని కిరణ్ వర్గం భావిస్తోంది.
సీమాంధ్ర ప్రాంతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, ఈ పరిస్థితిని మనకు అనుకూలంగా మలచుకుందామని చెబుతున్నారట. పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకతకు సంబంధించి మరో అంశాన్ని కూడా కిరణ్కు ఆయన సన్నిహితులు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి సమైక్య నినాదాన్ని ఎత్తుకున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడవచ్చని, లోక్సభ ఎన్నికల్లో మనకు కూడా కొన్ని ఓట్లు, సీట్లు వస్తే ప్రభుత్వ ఏర్పాటులో మన అవసరం వాళ్లకు ఉంటుందని, అప్పుడు మనకు కూడా కొంత రక్షణ ఉంటుందని వివరిస్తున్నారు.
ఎపి ఏర్పడిన తర్వాత మూడు దశాబ్దాల వరకూ ఒకే ట్రెండ్ కొనసాగిందని, 1983లో దానికి బ్రేక్ పడిందని, అప్పట్లో ఏర్పడిన రాజకీయ శూన్యతను ఎన్టీఆర్ తనకు అనుకూలంగా మార్చుకున్నారని, రాజకీయాల్లోకి కొత్త రక్తం ఎక్కించారని ఇప్పుడు 1983 తరహాలో రాజకీయ శూన్యత ఏర్పడిందని కిరణ్ వర్గం భావిస్తోంది. రాజకీయ శూన్యత కేవలం కిరణ్ వర్గం అపోహ మాత్రమేననే వారు లేకపోలేదు.
సమైక్యగళం వినిపించిన పార్టీగా వైయస్సార్ కాంగ్రెసు, సమన్యాయంతో పాటు చివరలో సమైక్యాంధ్ర కోసం లాబీయింగ్ చేసిన వారిగా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, సీమాంధ్ర ప్రయోజనాల కోసం బిజెపి పోటీ పడిందని అందుకోసమే ఆ పార్టీలలోకి వెళ్లేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారని, అలాంటప్పుడు రాజకీయ శూన్యత ఎక్కడిదని అంటున్నారు. అయితే, ఆ పార్టీలలో చేరడం ఇష్టంలేని వారు, కిరణ్ను సీమాంధ్ర ప్రజలు బలంగా నమ్ముతున్నందున, అదే సమయంలో నమ్ముకున్న వారి కోసమైనా కిరణ్ పార్టీ పెడతారని ఆయన వర్గం భావిస్తోంది.
విభజన జరిగిపోయిన తర్వాత ఇంకా సమైక్య వాదం అంటే ప్రజలు ఆమోదిస్తారా అని కిరణ్ను జెసి దివాకర్ రెడ్డి ప్రశ్నించగా.. సీమాంధ్రలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రజల దృష్టికి తీసుకువెళితే తప్పకుండా ఆదరిస్తారని కిరణ్ వివరించారు. తద్వారా కిరణ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. కిరణ్తో ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, సాయిప్రతాప్, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, హర్ష కుమార్, లగడపాటి రాజగోపాల్ తదితరులు ఆదివారం కిరణ్తో అయ్యప్ప సొసైటీలోని ఏఎంఆర్ బిల్డింగ్లో సమావేశం కానున్నారు.