కెసిఆర్పై కోదండ ఫైట్: విపక్షాల ఎజెండా గల్లంతు?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుపై సమరం విషయంలో తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తున్నారు. కెసిఆర్పై కోదండరామ్ విమర్సలతో ప్రతిపక్షాలకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఒక్కసారిగా కోదండరామ్కు మద్దతు పలికాయి.
కానీ దూరదృష్ణితో ఆలోచిస్తే ప్రతిపక్షాలకు కోదండరామ్ వ్యూహం పెద్ద విఘాతంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రతిపక్షాల ఎజెండాను తన చేతుల్లోకి తీసుకుని కెసిఆర్పై వాగ్బాణాలు విసిరిన కోదండరామ్ మరి కొంత కాలం మౌనంగా ఉండిపోవచ్చు. దానివల్ల అసలు విషయం పక్కదారి పట్టి కెసిఆర్కు ప్రయోజనం చేకూరే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయంలో కోదండరామ్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో నిర్ణాయక పాత్ర వహించడానికి అవసరమైన ఏర్పాట్లను కోదండరామ్ నాయకత్వంలోని రాజకీయ జెఎసి చేసుకుంటూ ఉండవచ్చు. అది రాజకీయ పార్టీగా మారి ఎన్నికల గోదాలోకి దిగితే టిఆర్ఎస్కు పోటీ ఇవ్వవచ్చు. మిగతా ప్రతిపక్షాలు గల్లంతైనా ఆశ్చర్యం లేదు. జెఎసి రాజకీయ పార్టీగా మారకుండా కూడా నిర్ణయాత్మక పాత్రనే పోషిస్తూ ఉండవచ్చు.
జెఎసి రాజకీయ పార్టీగా మారుతుందా...
తెలంగాణ రాజకీయ జెఎసి రాజకీయ పార్టీ రూపం తీుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంలో పెద్ద యెత్తునే చర్చ సాగుతోంది. తెలంగాణ రాజకీయ జెఎసిలో గతంలో టిఆర్ఎస్, బిజెపి, టిడిపి, కాంగ్రెస్ పార్టీలున్నాయి. కానీ ఇప్పుడు న్యూడెమోక్రసీ దానికి ప్రధాన అంగం కావచ్చు. తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున కోదండరామ్ జెఎసికి నాయకత్వం వహించారు. తెలంగాణ విద్యావంతుల వేదికలోని చాలా మంది నాయకులు ఇప్పుడు పాలకపక్షం వహించారు.
కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపిల నాయకులు చేసిన విమర్సలను టిఆర్ఎస్ తీవ్రంగా పరిణనలోకి తీసుకోలేదు. ఆ పార్టీలకు ఇంకా ప్రజల నుంచి మద్దతు లభించకపోవడమే అందుకు కారణం కావచ్చు. కానీ కోదండరామ్ విమర్శలను పార్టీ సీరియస్గా తీసుకుంది. వెంటనే కాకపోయినా భవిష్యత్తులో టిజెఎసిని రాజకీయ పార్టీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని దృష్టిలో పెట్టుకునే టిఆర్ఎస్కు టిజెఎసికి ఇకపై ఎలాంటి సంబంధం లేదనే స్పష్టమైన సంకేతాలు ఇవ్వడానికే కోదండరామ్ విమర్శలపై తీవ్రంగా స్పందించినట్టు మంత్రులు తెలిపారు.
గతంలో నక్సల్స్ ఉద్యమంతో కోదండరామ్కు అనుబంధం ఉంది. పౌర హక్కుల సంఘంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. టిఆర్ఎస్ ఏర్పడక ముందు నుంచే తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా కార్యకలాపాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ శక్తులను కోదండరామ్ కూడగడుతారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. కెసిఆర్కు కోదండరామ్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో విద్యావంతుల వేదికకు, తెలంగాణ జెఎసికి దూరంగా ఉంటూ వస్తున్న కొంత మంది నాయకులు ఇటీవల జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు.
లక్షలాది సభ్యులు ఉన్న తెలంగాణ ఎన్జివోల సంఘం కూడా ఇప్పుడు టిజెఎసికి దూరమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్యవాదం వినిపించిన సిపిఎం ఇప్పుడు టిజెఎసి పట్ల సానుకూల వైఖరి వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు టిజెఎసిలో కీలకపాత్ర వహించేందుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కోదండరామ్ ఎటు వైపు అడుగులేస్తారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయ చర్చల్లో ప్రధానంగా నలుగుతున్న చర్చ.