1956 స్థానికత సవాలే, పత్రాలు లేకున్నా...
స్థానిక, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇది అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోందట! 1956 స్థానికత ఓ సవాల్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికత, ఆదాయ, కుల ధ్రువీకరణ నిర్ధారించుకోవడం తేలికేనని కానీ, పట్టణ ప్రాంతాల్లో పని చేసే వారికి పత్రాల జారీ కత్తిమీద సాములాగా మారనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
సరైన పత్రాలు ఉంటే ఇబ్బంది లేదని అయితే, ఏ పత్రాలు లేని వారి లేదా సరైన పత్రాలు సమర్పించని వారి స్థానికత విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని, వారి స్థానికతను ఎలా నిర్ధారించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారట. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ధ్రువీకరణ పత్రాల కోసం ప్రతి జిల్లాలో నెలకు 20 వేల నుంచి 50 వేల వరకు దరఖాస్తులు వస్తుంటాయి. 1956 నిబంధన పెట్టడంతో ఇప్పటి దాకా జారీ చేసిన ఏ ధ్రువీకరణ పత్రమూ చెల్లుబాటయ్యే అవకాశం లేదంటున్నారు.
దీంతో కొత్త ఫార్మాట్ ప్రకారం తహసీల్దార్ కార్యాలయాలకు లక్షలాదిగా ధరఖాస్తులు వెల్లువెత్తే అవకాశం ఉంది. లక్షలాది రూపాయల ఫీజుకు ఈ ధ్రువీకరణపత్రం ముడిపడి ఉండడంతో తహసీల్దార్లను లోబరుచుకుని తప్పుడు పత్రాలు పొందడానికి పలువురు ప్రయత్నించే అవకాశం ఉందంటున్నారు. అయితే, ఎటువంటి పొరబాట్లు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఉండటంతో జాగ్రత్తగా వ్యవహరించాలని తహసీల్దార్లు నిర్ణయించుకున్నారు.
అయితే క్షేత్రస్థాయిలో సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల పని ఒత్తిడి పెరిగే అవకాశముందని, దానివల్ల తప్పులు జరిగినా ఆర్డీవోలు, కలెక్టర్లపై కూడా చర్యలుంటాయని సీఎం చెప్పడంతో తహసీల్దార్లపై పరోక్ష ఒత్తిడి పెరిగినట్లేనని అభిప్రాయపడుతున్నారు. కాగా, స్థానికతకు తాత, తండ్రి సమర్పించే పత్రాలు కీలకం కానున్నాయి. 1956కు ముందునుంచి నివాస ముంటున్నట్లు తెలియజేసే ఆధారాల కోసం భూమి పత్రాలు, కౌలుపత్రాలు, పన్నులు కడితే ట్యాక్స్ రసీదులు, కరెంట్ కనెక్షన్ పత్రాలు వంటివి కీలకం కానున్నాయి.
తాత స్థానికత నిర్ధారణ అయితే తండ్రి స్థానికతకు ఇబ్బందుల్లేవు. ఉద్యోగం రీత్యా స్థిరపడితే ఆ పత్రాలు కూడా కీలకం కానున్నాయి. ఇక హైదరాబాద్ సంస్థానంలో 1948కు ముందే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారి సంఖ్య అధికం. వీరు స్థానికతకు దరఖాస్తు చేసుకుంటే ఏయే పత్రాలు కోరాలనే అంశంపై యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే స్థానికతను కోరే ధరఖాస్తు పత్రాల ఫార్మాట్ సిద్ధం చేసిన యంత్రాంగం.. సుప్రీం కోర్టులో ఉన్న కేసు తేలగానే దీనిపై జీవో వెలువరించనుంది. ఆ తర్వాతే ధ్రువీకరణ పత్రాల జారీ మొదలు కానుంది.