దిగ్బంధానికి తెర పడేనా?: రాజు శరణుజొచ్చిన బీరెన్ నాగాలతో నేడే చర్చలు
మణిపూర్లో వేర్పాటు వాద సంస్థ యూనైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్సీ) నాలుగున్నర నెలలుగా కొనసాగిస్తున్న ఆర్థిక దిగ్బంధం తొలగించేందుకు బీరెన్ సింగ్ సారథ్యంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింద
ఇంఫాల్: మణిపూర్లో వేర్పాటు వాద సంస్థ యూనైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్సీ) నాలుగున్నర నెలలుగా కొనసాగిస్తున్న ఆర్థిక దిగ్బంధం తొలగించేందుకు బీరెన్ సింగ్ సారథ్యంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న యూఎన్సి అధ్యక్షుడు గైడోన్ కామెయితో ఆదివారం సేనాపతి జిల్లా పరిధిలో చర్చలు జరుగనున్నాయి.
చర్చల్లో అందరికి ఆమోద యోగ్యమైన పరిష్కారం లభిస్తే త్వరలో గైడోన్ కామెయి జైలు నుంచి విడుదల కానున్నారు. ట్రబుల్ షూటర్గా పేరు ఉన్న బీరెన్ సింగ్ ప్రభుత్వంపై నెలల తరబడి ఆర్థిక దిగ్బంధంలో కొనసాగుతున్న నాగాలు, మీటీలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.ఈ సమావేశంలో హోంశాఖ అదనపు చీఫ్ సెక్రటరీ సురేశ్ బాబు, కళలు, సమాచార , ప్రసారాలశాఖ కమిషనర్ రాధాకాంత తదితరులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా చర్చలు జరుపనున్నారు. యూఎన్సి డిమాండ్ మేరకు త్రైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ ప్రతినిధులు కూడా ఇప్పటికే మణిపూర్ చేరుకున్నారు.
రాష్ట్ర క్యాబినెట్ నుంచి బిశ్వజిత్ ప్రాతినిధ్యం
రాష్ట్ర క్యాబినెట్ నుంచి టీహెచ్ బిశ్వజిత్ ప్రతినిధిగా చర్చల్లో పాల్గొంటారు. చర్చలు ఎక్కడ జరుగుతాయన్న విషయం బహిర్గతం చేయని రాష్ట్ర మంత్రి బిశ్వజిత్.. సమస్య పరిష్కారంపై ఆశాభావం వ్యక్తం చేశారు. గమ్మత్తేమిటంటే మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే ఆర్థిక దిగ్బంధం ఎత్తివేసేందుకు చర్చలు తీసుకుంటామని ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ భేటీ జరుగడం గమనార్హం. ఏడు జిల్లాలను కొత్తగా మరో ఏడు జిల్లాలుగా విభజించిన మాజీ సీఎం ఓక్రాం ఇబోబిసింగ్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యూఎన్సి గత నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆర్థిక దిగ్బంధం కొనసాగిస్తున్నది.
బీరెన్ సింగ్ హయాంలో త్రైపాక్షిక చర్చలకు ఓకే
యూఎన్సి, తంగ్ ఖుల్ నాగా లాంగ్ తదితర నాగా సంస్థలు ఏడు జిల్లాలను ఏర్పాటు చేస్తూ గత ఇబోబిసింగ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ పూర్వికుల భూమిని తమకు దూరం చేయడమేనని, ఇది ఎంతమాత్రమూ ఆమోద యోగ్యం కాదని చెప్తున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో గానీ, ఇంఫాల్లో గానీ సమావేశం ఏర్పాటు చేయాలని యూఎన్ సి పదేపదే కోరుతూ వచ్చింది. చివరకు బీజేపీ ఆధ్వర్యంలోని సంకీర్ణ సర్కార్ తాజాగా సమావేశం ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. సుదీర్ఘ కాలం కొనసాగిస్తున్న ఆర్థిక దిగ్బంధం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటే స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని వారానికి రెండుసార్లు ట్రక్కుల ద్వారా మణిపూర్లోకి తరలిస్తున్నా.. ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. వచ్చిన సరుకులు వచ్చినట్లే బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి.
రాజు సాయం కోరిన బీరెన్ సింగ్
గిరిజనులు, గిరిజనేతరుల మధ్య సయోధ్యకు చేయూతనివ్వాలని మణిపూర్ టిటూలార్ రాజు లైషెంబా సనాజావోబాను సీఎం బీరెన్ సింగ్ కోరారు. ప్రోటోకాల్ నిబంధనలతో నిమిత్తం లేకుండా బీరెన్ సింగ్.. రాజుతో సమావేశమయ్యారు. కాగా ఈ సమస్య పరిష్కారానికి తన వంతుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటానని రాజు లైషెంబా సనాజావోబా సీఎంకు హామీనిచ్చారు. కొండల్లో జీవిస్తున్న వారికి, లోయలో బతుకుతున్న వారి మధ్య సఖ్యతకు కుదిర్చేందుకు ప్రయత్నిస్తానని సీఎం బీరెన్ సింగ్కు రాజు లైషెంబా సనాజావోబా హామీ ఇచ్చారు. గతంలో గిరిజనేతరుడ్ని గిరిజనుడు తమ పెద్ద సోదరుడిగా భావించే వారని లైషెంబా సనాజావోబా గుర్తు చేశారు. నాగాల్లోనూ, మీటీల్లోనూ, కుకీల్లోనూ ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు లైషెంబా సనాజావోబాకు ఉన్నాయి. పెద్దలకు బహుమతులు అందజేసే కార్యక్రమం ‘మీరా హౌచుంగ్బా' సందర్భంగా ఇరు పక్షాలను కలిపేందుకు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.
దళారులు నెలకొల్పించిన సమస్య ఇది
ఈ సందర్భంగా మణిపూర్ సీఎం బీరెన్సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాష్ట్రంలో నివసిస్తున్న వివిధ జాతుల ప్రజల మధ్య కొందరు వ్యక్తులు, ఏజంట్లు నెలకొల్పిన సమస్యే ఇది అని చెప్పారు. కానీ తన ప్రభుత్వం ఈ సమస్యకు చరమగీతం పాడుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల అత్యవసరాలేమిటో తెలుసుకునేందుకు కొండ జిల్లాల్లోనూ క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తామని బీరేన్ సింగ్ తెలిపారు. కొండలు, లోయల్లో చేపట్టే అభివ్రుద్ధి కార్యక్రమాల్లో సమతుల్యత పాటించాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదన్నారు. ఇదిలా ఉండగా సీఎం బీరెన్ సింగ్ ఆదేశాల మేరకు వారం లోగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివ్రుద్ధిని ప్రాజెక్టు నివేదికలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓయినం నాబా కిశోర్ అధికారులను ఆదేశించారు.