మీడియా వార్: రామోజీరావు వర్సెస్ జగన్
హైదరాబాద్: తెలుగులో మరోసారి మీడియా వార్ పతాక స్థాయికి చేరుకుంది. అమెరికా ప్రభుత్వం బయట పెట్టిన టైటానియం కుంభకోణం నేపథ్యంలో ఈ వార్ పతాకస్థాయికి చేరుకుంది. టైటానియం కుంభకోణం కేసులో ఎఫ్బిఐ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు పేరును ప్రస్తావించింది. టైటానియం కుంభకోణం కేసులో మూడో వ్యక్తి పేరు ప్రస్తావించకుండా ఎఫ్బిఐ సిగా పేర్కోంది. ఆ సి అనే వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి సన్నిహిత బంధువు అని చెప్పడంతో తెలుగులోని రామోజీ రావు ఈనాడు దిపనత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక వైయస్ జగన్కు ఆపాదిస్తూ వార్తాకథనాలను ప్రచురించాయి.
ఈనాడు వార్తాకథనంపై వైయస్ జగన్కు చెందిన సాక్షి దినపత్రిక తీవ్రంగా మండిపడుతూ శనివారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. సి అనే వ్యక్తి జగన్ అని నిరూపిస్తే సాక్షిని రామోజీరావుకు స్వాధీనం చేస్తామని, లేకపోతే ఈనాడును తమకు స్వాధీనం చేస్తారా అంటూ సవాల్ విసురుతూ సాక్షి దినపత్రిక ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది. రామోజీకి సాక్షి సవాల్ అనే శీర్షిక కింద ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది.
టైటానియం తవ్వకాల కోసం డిమిట్రి ఫిర్టాష్ అనే కంపెనీ భారతదేశంలోని పలువురికి లంచాలు ఇచ్చిందని ఎఫ్బిఐ ఆరోపణలు చేసిందని, అందులో పేరు వెల్లడించకుండా సి అనే వ్యక్తిని పేర్కొందని ఆ సి జగనేనని ఈనాడు రాసిందని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవునంటూ తలూపారని సాక్షి దినపత్రిక వార్తాకథనం తెలిపింది.
సి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డేనంటూ తన ఊహల్ని ఆకాశానికి ఎగదోసి నిలువెల్లా విషం కక్కారని సాక్షి దినపత్రిక రామోజీరావుపై విరుచుకుపడింది. వర్జిన్ ఐలాండ్ కంపెనీల ద్వారా జగన్ సంస్థల్లోకి ఈ నిధులు వచ్చాయని ఈనాడు రాసిన కథనంపై కూడా సాక్షి తీవ్రంగా మండిపడింది. కుమారుడిని కుటుంబ సభ్యుడంటారు గానీ సన్నిహిత బంధువు అంటారా అని లాజిక్ను కూడా సాక్షి లాగింది. చంద్రబాబుకు లోకేష్ బంధువా లేక కొడుకా అని కూడా ప్రశ్నించింది.
కాగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఆ వార్తాకథనానికి పొడగింపుగా శనివారం మరో వార్తాకథనాన్ని ప్రచురించాయి. ఎఫ్బిఐ పేర్కొన్న సి అనే వ్యక్తిని ఆ పత్రికలు వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు సుధీకర్ రెడ్డి అని చెబుతూ వార్తాకథనాలు ప్రచురించాయి. సుధీకర్ రెడ్డి అమెరికా పౌరుడని, అమెరికా దర్యాప్తు సంస్థలు తమ పౌరుల పేర్లను నేరుగా చెప్పవని, అందుకే సుధీకర్ రెడ్డిని మిస్టర్ సిగా పేర్కొంటూ అభియోగాలు మోపిందని ఆ పత్రికలు వార్తాకథనాలను ప్రచురించాయి. మొత్తం మీద, ఎన్నికల వేళ రాష్ట్రంలో మీడియా వార్ ఊపందుకుంది.