బహుముఖ లక్ష్యం.. అదే జైట్లీ బడ్జెట్ వ్యూహం! ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలతో ఆర్థిక క్రమశిక్షణ గోవిందా!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన 201819 సాధారణ వార్షిక బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాలను సంతృప్తి పరచలేకపోయింది. కొత్త బడ్జెట్ చూసి ఇటు కార్పొరేట్లు, అటు మధ్యతరగతి వర్గాలు, ముఖ్యంగా వేతన జీవులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
వేతన జీవులకు నిరాశే! మారని పన్ను శ్లాబులు, రేట్లు, రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్తో సరి!
ఆర్థిక లావాదేవీలు రూ.2.5 లక్షలు దాటితే పాన్ నంబర్ తప్పనిసరి!
నిజానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారని తెలిసిన తరువాత దేశంలోని వివిధ రంగాల ప్రముఖుల నుంచి సూచనలు, అభ్యర్థనలు ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందాయి.
కానీ ఎవరెన్ని కోరికలు కోరినా.. అన్నీ బుట్టదాఖలే అవడం వెనుక మోడీ సర్కారు లోతైన వ్యహమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండడం, మరోవైపు ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లాలన్న కేంద్ర సర్కారు యోచన.. ఇవన్నీ కొత్త బడ్జెట్పై ప్రభావాన్ని చూపించాయి.
రాబోయే ఎన్నికలే వ్యూహంగా...
కేంద్ర సర్కారు నూతన బడ్జెట్ బహుముఖ లక్ష్యంతో రూపొందింది. ఆగ్రహంతో ఉన్న గ్రామీణ ఓటర్లను శాంతింపజేయడం, ఉద్యోగాల కల్పన, సార్వత్రిక ఆరోగ్య బీమా పథకం దిశగా అడుగులు.. ఇవన్నీ ఈ బడ్జెట్ వెనకున్న మోడీ సర్కారు వ్యూహాలుగా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ ఏడాది 8 రాష్ట్రాలకు జరగనున్న శాసనసభ ఎన్నికలు, అలాగే 2019లో రాబోతున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈసారి బడా కార్పొరేట్లను మోడీ ప్రభుత్వం కాస్త దూరం పెట్టినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలపై పెద్దగా దృష్టిసారించని ఫలితంగా ఆ ప్రభావాన్ని మోడీ సర్కారు చవిచూసింది. రాబోయే రోజుల్లో ఇలాంటి పొరపాటు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ బడ్జెట్లో రైతులు, గ్రామీణ ప్రాంత పేదల కోసం పలు పథకాలు ప్రకటించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆర్థిక క్రమశిక్షణను పక్కనపెట్టి మరీ...
కొత్త బడ్జెట్ను పరిశీలిస్తే దాని రూపకల్పనలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చివరికి ఆర్థిక క్రమశిక్షణను సైతం పక్కనపెట్టేశారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి కారణం.. రాబోయే ఎన్నికల పరంగా కొన్ని అనివార్యతలు తలెత్తడం అని చెబుతున్నారు. ద్రవ్యలోటు కొంత పెరగబోతోందని తెలుస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రజాకర్షక పథకాలవైపు వెళ్లక తప్పలేదని విశ్లేషిస్తున్నారు. కొత్త బడ్జెట్ కారణంగా గురువారం స్టాక్ మార్కెట్లు కూడా నీరుగారాయి. ఒకపక్క ఆర్థిక మంత్రి జైట్లీ లోక్సభలో తన బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. కార్పొరేట్ రంగంపై ఎలాంటి వరాలు కురిపించకపోగా.. ఈక్విటీలలో దీర్ఘకాలిక పెట్టుబడులపై రూ.లక్షకు మించి ఆర్జించిన పక్షంలో 10 శాతం ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంటుందంటూ ప్రకటించడం మదుపరులను నివ్వెరపరిచింది. దీంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
గ్రామీణ భారతంపైనే దృష్టి...
వ్యవసాయంలో ఖర్చు తగ్గి, రాబడి పెరగాలనే సంకల్పంతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్లో వివిధ చర్యలను ప్రకటించారు. రైతులకు పంటల బీమా, మద్దతు ధరలు, వ్యవసాయ మార్కెట్లు, రుణాలు, అందరికీ ఆరోగ్య బీమా వంటివాటిపై ఈసారి బడ్జెట్లో దృష్టిసారించారు. ఎందుకంటే, మన దేశ జనాభా దాదాపు 130 కోట్లు ఉంటే.. అందులో 68 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నవారే. గ్రామీణ ప్రాంత ప్రజల్లో వ్యతిరేకత ప్రభావాన్ని ఇప్పటికే మోడీ ప్రభుత్వం గతంలో జరిగిన గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో చవిచూసింది. అందుకే ఇప్పుడు ముందు జాగ్రత్త తీసుకుంది. రాబోయే రోజుల్లో 8 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రైతులు, గ్రామీణ ప్రాంత పేద ప్రజానీకంపై ఈ బడ్జెట్లో వరాల జల్లు కురిపించింది.
మధ్యతరగతి వర్గాన్ని విస్మరించి మరీ....
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. దళితులు, గిరిజనులు, వయోధికులు, చిన్నతరహా పారిశ్రామికవేత్తలు... ఇలా భిన్నవర్గాల వారికి ప్రయోజనం కలిగేలా మోడీ సర్కారు కొత్త బడ్జెట్లో నిర్ణయాలు తీసుకుంది. అయితే నోట్ల రద్దు, డిజిటల్ పేమెంట్ సిస్టం, జీఎస్టీ తదితర విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో ఇన్నాళ్లూ బీజేపీకి, మోడీ నాయకత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన మధ్య తరగతి వర్గానికే ఈ బడ్జెట్లో ఎటువంటి ఉపశమనాన్నీ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమని విశ్లేషకులు అంటున్నారు. కొత్త బడ్జెట్ తమకూ ఎంతోకొంత ప్రయోజనం కలిగించే పథకాలు ఉండొచ్చని ఎంతో ఆశగా ఎదురుచూసిన సగటు వేతన జీవులకు జైట్లీ బడ్జెట్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. రూ.40 వేల స్టాండర్డ్ డిడక్షన్ నిబంధనను తిరిగి ప్రవేశపెట్టడం మినహా ఉద్యోగులకు కొత్త బడ్జెట్ ద్వారా ఒరిగిందేమీ లేదు.