నంద్యాల టెన్షన్: లగడపాటి అంచనానే.. ఏ సర్వే నిజం....
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందనేది కచ్చితంగా ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పిన లగడపాటి రాజగోపాల్ అది తన అంచనా మాత్రమేనని చెప్పారు.
న్యూఢిల్లీ: నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందనేది కచ్చితంగా ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పిన లగడపాటి రాజగోపాల్ అది తన అంచనా మాత్రమేనని చెప్పారు.
సర్వేలు మాత్రం భిన్నమైన ఫలితాలు ఇస్తున్నాయి. బుధవారం నాడు ఉప ఎన్నిక సందర్భంగా పలు సంస్థలు సర్వేలు నిర్వహించాయి. 28న కౌంటింగ్ జరగనుంది. దీంతో సర్వే ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నంద్యాల ఉపఎన్నికల్లో టిడిపి గెలుస్తుందని లగడపాటి రాజగోపాల్ చెప్పారు.
కాగా, ప్యూపల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రిపోల్ శాంపిల్ సర్వేలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని వెల్లడించింది. ఈ ఉపఎన్నికల్లో తెలుగుదేశం గెలుస్తుందని తమ టీం అంచనాకు వచ్చినట్టు లగడపాటి గురువారం మీడియాకు చెప్పారు.
లగడపాటి ఇలా...
టిడిపి గెలుస్తుందనేది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని, ఈ ఎన్నిక ఫలితంపై తన టీంతో సర్వే చేయించానని చెప్పిన ఆయన ఆ తర్వాత టిడిపి గెలుసుందన్నది ఒక అంచనా మాత్రమేనని వెల్లడించారు. అసెంబ్లీ ఉపఎన్నిక నామినేషన్లకు ముందు, అనంతరం ప్రచార సమయంలో, మంగళవారం నాడు జరిగిన ఎన్నిక సందర్భంగా తమ టీం సర్వే చేసిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో అన్ని సందర్భాల్లోను తెలుగుదేశం పార్టీకే ప్రజలు మొగ్గు చూపినట్టు తేలిందని అన్నారు.
వైసిపికి ఎదురు లేదు...
నంద్యాలలో ఆగస్టు 17,18,19లలో ప్యూపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ప్రిపోల్ శాంపిల్ సర్వేలో అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్షపార్టీ వైసిపి మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని తేలింది. టిడిపికి 45.6శాతం, వైసిపికి 48.3శాతం ఓట్లు వస్తాయని, 2.7 శాతం ఓట్లతో వైకాపా గెలుస్తోందని ఆ సంస్థ తేల్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 2.3శాతం ఓట్లు, ఇతరులకు 2.5శాతం, నోటాకు 1.3శాతం వచ్చే అవకాశం ఉందని చెప్పిది. ఉపఎన్నికకు ముందు మూడు రోజుల ముందు జరిపిన ఈ సర్వే ఫలితాల్లో మార్పు ఉండే అవకాశం ఉందని కూడా ఈ సంస్థ వెల్లడించింది.
అలా జరుగుతుంది...
2014లో అప్పటి వైసిపి అభ్యర్థి భూమా నాగిరెడ్డి, టిడిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మధ్య జరిగిన ఎన్నిక మాదిరిగానే ఈ ఉప ఎన్నిక కూడా జరుగుతుందని ప్యూపుల్స్ పల్స్ సంస్థ వెల్లడించింది. కాగా ఆగస్టు 17,18,19 తేదీలలో 48పోలింగ్ బూత్లకు సంబంధించి 1,433మంది వివిధ కులాలకు, మతాలకు చెందిన వారి నుంచి శాంపిల్స్ సేకరించినట్టు సంస్థ వెల్లడించింది.
ఈ సంస్థ ఇలా...
నంద్యాల ఉపఎన్నికలో టిడిపి గెలుస్తుందని ఆర్జీ ఫ్లాష్ టీం తన సర్వే తేల్చింది. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో కూడా వెల్లడించింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం ఆర్జీ ఫ్లాష్ టీం ప్రత్యేకంగా సర్వే చేసింది. ఉన్నాయి. ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వేలో టీడీపీకి అత్యధికంగా 54.00 శాతం నుంచి 56.78 శాతానికిపైగా ఓట్లు పడే అవకాశం ఉందని తేలింది.
మస్తాన్ టీమ్ సర్వే ఇలా....
ప్రముఖ సర్వే సంస్థ ‘ఆరా' మస్తాన్ టీమ్ సర్వేలో టిడిపికి 49.7 శాతం(+1, -3శాతం ఎక్కువ తక్కువగా), వైఎస్సార్కు 44.5 శాతం(+1, -3శాతం ఎక్కువ తక్కువగా), ఇతరులకు 5.8 శాతం (+1, -3 ఎక్కువ తక్కువగా) ఓట్లు వస్తాయని, ఇది 24వ తేదీ సాయంత్రానికి తేలిన సర్వే ఫలితమని చెప్పింది. ఇదే సంస్థ చేసిన తొలి విడత సర్వేలో, వైసీపీకి 6-9 వేల మెజారిటీ ఉన్నట్లు చెప్పింది.
ఇంటలిజెన్స్ సర్వే ఇలా..
ఇంటలిజన్స్ వర్గాల సర్వేలో.. టిడిపికి 50.2 శాతం, వైసీపీకి 41.03శాతం, కాంగ్రెస్కు 5.09 శాతం; ముస్లిం ఓట్లలో టిడిపి 45.2 శాతం, వైసీపీ 37.5 శాతం, కాంగ్రెస్ 11.5 శాతం, గోసుపాడులో వైసీపీకి 3500 మెజారిటీ, నంద్యాల రూరల్ మండలంలో టిడిపి 4 వేలు మెజారిటీ, టౌన్లోటిడిపి 13 వేల ఓట్లు వస్తాయని అంచనా వేసింది.
మొత్తంగా 18 వేలతో టిడిపి విజయం సాధిస్తుందని తేల్చింది.