2018 చివర్లో పాక్షిక జమిలి ఎన్నిక? మొదలైన మోడీ కసరత్తు!
2019లో లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధాని మోడీ ఆలోచన. అయితే ఇందుకు న్యాయ, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు స్పష్టంగా చెప్పడంతో పాక్షిక జమ
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టిన తరువాత నుంచి జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. 2019లో లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధాని మోడీ ఆలోచన.
అయితే ఇందుకు న్యాయ, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు స్పష్టంగా చెప్పడంతో పాక్షిక జమిలి వైపు దృష్టి సారించారు. అందుకు లోక్సభ ఎన్నికలను ముందుకు జరిపితే ఎలా ఉంటుందన్న దానిపై బీజేపీ, సంఘ్ మేధోమథనంలో నిమగ్నమయ్యారు.
ఎన్ని పార్టీలు అనుకూలం?
2018 చివర్లో మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాంలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరిపితే లాభమా? నష్టమా? ఇందుకు మిత్రపక్షాల్లో ఎన్ని పార్టీలు సై అంటాయి? 2018లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కశ్మర్తో పాటు గత సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ఏపీ, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషాలను కూడా కలుపుకొని జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయా? 2023 నాటికి మిగతా రాష్ట్రాలన్నీ కలిపి జమిలి ఎన్నికలు సాధ్యమవుతాయా? రాజ్యాంగ పరంగా ఏర్పడే చిక్కులను ఎలా తొలగించాలి? అన్న అంశాలపై చర్చా పత్రాన్ని తయారు చేయాలని మోడీ ఆదేశించారు.
అమిత్ షా, పీయూష్ గోయల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ...
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చా పత్రాన్ని రూపొందించే దిశగా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు, ఎంపీ అమిత్షా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఒక వ్యూహకర్తల బృందాన్ని ప్రధాని మోడీ ఏర్పాటు చేశారు. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి.కశ్యప్ సలహాలను తీసుకుంటున్నారు. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల ముందే ఏ అసెంబ్లీకైనా ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. గడువును పెంచేందుకు మాత్రం రాజ్యాంగం ప్రకారం వెసులుబాటు లేదు. అందుకే జమిలి ఎన్నికలను దశల వారీగా రానున్న 10 ఏళ్లలో నిర్వహించడం మంచిదని బీజేపీ నేతలకు కశ్యప్ చెప్పినట్లు తెలిసింది.
కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేసేందుకేనా?
కాంగ్రెస్ ప్రతిష్ఠ నానాటికీ దిగజారుతున్న నేపథ్యంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీతో పాటు మిత్రపక్షాలకు అధికారం దక్కుతుందని, తరువాత కేంద్రంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవచ్చన్నది ప్రధాని మోడీ ఎత్తుగడగా కనిపిస్తోంది. రాష్ట్రాల్లో అధికార పార్టీలు, వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపితే 2024 నాటికి జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చన్న సలహా నీతి ఆయోగ్ ఇచ్చింది. 2024 వరకూ వేచి చూడకుండా 2018 నవంబర్-డిసెంబర్లలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్లతో కలిపి లోక్సభ ఎన్నికలు జరపాలని, మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ, కశ్మీర్, జార్ఖండ్ల ఎన్నికలు కూడా ముందుకు జరపాలని మోడీ యోచిస్తున్నారు. ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమంటూ ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
ఏపీ, తెలంగాణలోనూ ముందస్తు ఎన్నికలు?
ఏపీ, తెలంగాణలు కూడా అంగీకరిస్తే.. ఒడిషా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లను కలుపుకొని ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ప్రధాని మోడీ ఉన్నారు. గుజరాత్ ఎన్నికల అనంతరం.. ఈ జమిలి ఎన్నికల గురించి ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అవసరమైతే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని మోడీ-షాల ద్వయం యోచిస్తున్నట్లు తెలిసింది. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సమావేశం కావాలని ప్రధాని నిర్ణయించారు.
మోడీ కల నెరవేరుతుందా?
పశ్చిమ బెంగాల్, తమిళనాడులలో 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2023 వరకు వాటిని పొడిగించడం సాధ్యమవుతుందా? మధ్యలోనే ప్రభుత్వాలు పడిపోతే జమిలి పరిస్థితి ఏమిటి? అన్న అంశాలన్నింటికీ మోడీ పరిష్కారం కనుక్కోవాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాలి. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీతో చట్టం చేయాలి. కాంగ్రెస్, వామపక్షాలు, పలు ప్రాంతీయ పార్టీలు జమిలి ఎన్నికల విధానానికి ససేమిరా అంటున్న నేపథ్యంలో మోడీ కల నెరవేరడం అనుమానమేనంటున్నారు.