మనం ఇంకా అక్కడేనా?,వాటిపై నిర్ణయం జరగాలి: కేసీఆర్ 'థర్డ్ ఫ్రంట్' ఎజెండా..
హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి అవసరమైన ప్రణాళికను రూపొందించే పనిలో పడ్డారు.
Recommended Video
ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రగతి భవన్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు, సీనియర్ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
ఎజెండా సిద్దం చేయడానికి..
దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు, ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బేరీజు వేసి అందుకు అనుగుణంగా ఒక కామన్ ఎజెండా రూపొందించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకం చేసేలా ఎజెండా ఉండాలని యోచిస్తున్నారు. ఇదే విషయమై సుమారు గంటన్నరపాటు వివిధ రంగాలకు చెందిన సీనియర్ అధికారులతో ఆయన చర్చలు జరిపారు.
మార్పులు-చేర్పులు
దేశంలో ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలను, చట్టాలను క్షుణ్ణంగా స్టడీ చేసి.. ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు అవసరమో సూచించాలని కేసీఆర్ వారితో అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా ఎజెండా ఉండాలని.. ఆ దిశగా అధ్యయనం సాగాలని చెప్పారు.
మనం ఇంకా అక్కడే..
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అభివృద్ది పథంలో దూసుకెళ్తుంటే మనదేశంలో ప్రజలు ఇంకా ప్రాథమిక అవసరాలు కూడా తీరకుండా ఉన్నారని కేసీఆర్ అధికారులతో అన్నారు.
మంచినీరు, విద్యుత్,సాగునీరు, మౌలిక సదుపాయాల వంటి కనీస అవసరాల కల్పన కూడా దేశంలో జరగడం లేదన్నారు. రాష్ట్రాల మధ్య జల సమస్యలు కూడా అపరిష్క్రుతంగానే ఉన్నాయన్నారు.
ఫెడరల్ స్ఫూర్తి
కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో కూడా అనేక కమిషన్లు, నిపుణులు సూచించిన సంస్కరణలు అమలుకావటం లేదన్నారు కేసీఆర్. దేశంలో ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి కొరవడిందన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వ పథకాల గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్ర పథకాలు కేంద్రానికి కూడా ఆదర్శంగా నిలిచాయన్నారు.
వాటిపై నిర్ణయం జరగాలి
దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి. ఏ శాఖ ఎవరి వద్ద ఉండాలనే దానిపై నిర్ణయం జరగాల్సిన ఆవశ్యకత ఉన్నది. దేశవ్యాప్తంగా ఉమ్మడి జాబితా అమలులో ఉండటంవల్ల ఒకే శాఖకు సంబంధించి వేర్వేరు పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇది అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతోందని కేసీఆర్ సమావేశంలో వివరించారు.
రిజర్వేషన్లపై చర్చ..
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు సామాజిక పరిస్థితులున్నాయని, వాటికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించుకోవాల్సి ఉందన్నారు కేసీఆర్. న్యాయవ్యవస్థలోనూ, పాలనావ్యవస్థలోనూ, శాసన వ్యవస్థలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, చట్ట సవరణలు, రాజ్యాంగ సవరణలు తదితర అన్ని విషయాల్లో కూడా స్పష్టమైన ఎజెండా రూపుదిద్దుకోవాలన్నారు.