పవన్ కల్యాణ్ సంకేతాలు: మారిన చంద్రబాబు వ్యూహం
అమరావతి: వచ్చే శానససభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుకు తగిన వ్యూహాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత తరుణంలో బిజెపితో కలిసి నడిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందనే అంచనాకు ఆయన వచ్చినట్లు చెబుతున్నారు.
తెగదెంపులకు కారణాలు ఇవీ...
బిజెపితో చంద్రబాబు తెగదెంపులు చేసుకోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిలో ఒకటి ప్రత్యేక హోదా అంశం కాగా, రెండోది మైనారిటీల మద్దతు. బిజెపితో కలిసి నడిస్తే మైనారిటీలకు దూరమవుతామనే ఉద్దేశంతో చంద్రబాబు ఆ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలకు బిజెపిని దూరం పెట్టి పొందిన ఫలితం ఆయనకు ఆ సంకేతాలను ఇచ్చినట్లు చెబుతున్నారు.
Recommended Video
ప్రత్యేక హోదాపై ఇలా...
రాష్ట్రంలో ప్రత్యేక హోదా అనేది సెంటిమెంటుగా మారింది. రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా వివిధ వర్గాలు ప్రత్యేక హోదా కోసం పోరాటన్ని ప్రారంభించాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రధానంగా ఆ నినాదాన్ని ఎత్తుకుని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే ఎత్తుగడతో ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం చెప్పిన తర్వాత కూడా బిజెపితో కలిసి నడిస్తే తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని చంద్రబాబు ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ ఇలా...
ప్రత్యేక హోదాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును కూడా తప్పు పట్టారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తనతో కలిసి నడుస్తారనే నమ్మకం ఆయన మాటల ద్వారా లేకుండా పోయింది. ఈ తరుణంలో కొత్త మిత్రపక్షాన్ని ఎంచుకోవడం చంద్రబాబుకు అనివార్యంగా మారింది.
కాంగ్రెసుతో దోస్తీ అందుకే...
రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ పూర్తిగా బలహీనపడింది. అయితే, ప్రత్యేక హోదా నినాదం కారణంగా, తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కారణంగా ఆ పార్టీ కాస్తో కూస్తో ప్రజల మద్దతు పొందవచ్చుననేది అంచనా. కాగా, స్వల్పంగానైనా కాంగ్రెసుకు ఒటు బ్యాంకు ఉంది. దాంతో కాంగ్రెసుతో దోస్తీ కట్టి పదిపరకా సీట్లు ఇస్తే తిరిగి అధికారంలోకి రావచ్చుననేది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.