గుజరాత్ వ్యూహం ఇదే: పొలిటికల్ టూరిజం
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ఊపులో బీజేపీ గుజరాత్ రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతోంది.
అహ్మదాబాద్/ గాంధీనగర్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ఊపులో బీజేపీ గుజరాత్ రాష్ట్రంలోనూ ముందస్తు ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. దాన్ని సొమ్ము చేసుకునేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నది.
అందుకోసం ఏ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధం అవుతోంది. మహిళలూ యువతే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది. అంతా అంచనాల ప్రకారమే జరిగితే మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలే ఆఖరు. ప్రజలను ఆకర్షించేందుకు ప్రతిరోజూ గాంధీనగర్లోని గుజరాత్ విధాన సభకు తర్వాత మహాత్మా మందిర్కు అటునుంచి అక్షర్ధామ్ వరకు 50 లగ్జరీ బస్సుల్లో తరలిస్తున్నారు.
ప్రస్తుతం మహిళలు, యువతే విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వారి ఓట్లను సొమ్ము చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు వదులుకునేందుకు సిద్ధంగా లేరు. అలా తరలిస్తున్న మహిళలు, యువత, విద్యార్థుల ప్రయాణం, భోజన వసతుల ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తోంది మరి.
ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ పాతర
ప్రజాస్వామ్య విలువలకు పాతరేసేందుకు అధికార పక్షం బీజేపీ అనుసరిస్తున్న క్రూరమైన విధానాలకు పాల్పడుతున్నదని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రభుత్వ నిధులతో వారిని తరలించి.. వచ్చిన వారితో భారత్ మాతాకీ జై నినాదాలు చేయిస్తూ బీజేపీకి అనుకూల ఓటర్లుగా మార్చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణ. గాంధీనగర్కు తరలి వస్తున్న ప్రతి ఒక్కరి దూరాన్నిబట్టి వారి కోసం రూ.300 నుంచి రూ.500 వరకు ఖర్చు అవుతుందని అంచనా. అసెంబ్లీలోపలికి వెళ్లాలంటే పాస్లు తప్పనిసరి. గత గురువారానికే 55 వేల పై చిలుకు పాస్ లు జారీ చేసినట్లు సమాచారం. ఆ సందర్శకులను లాబీల్లోకి, విజిటర్స్ గ్యాలరీల్లోకి తీసుకెళ్తున్నారు.
భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరును వీక్షించేందుకు 15 నిమిషాల సమయం పడుతుంది. తాము దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నామని, సమయాన్ని బట్టి తమకు లంచ్ ఏర్పాటు చేస్తున్నారని పలువురు సందర్శకులు చెప్తున్నారు. సర్క్యూట్ హౌస్లో గానీ, బ్రహ్మ్ భవన్లో గానీ, గాంధీ నగర్ లోని సెక్టార్ 16లో గానీ లంచ్ చేస్తున్నామని తెలిపారు.జిల్లాల వారీగా, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎంపిక చేసిన మహిళలు, విద్యార్థుల గ్రూప్లతో గుజరాత్ సీఎం విజయ్ రూపాని ఇష్టాగోష్టిగా చర్చించడంతోపాటు తమ ప్రభుత్వ విజయాలను సవివరంగా వివరిస్తున్నారు. వచ్చిన వారితో భారత్ మాతా కీ జై, వందేమాతరం నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం మార్మోగుతున్నది.
భావోద్వేగం రంగరిస్తున్న సీఎం
సీఎం విజయ్ రూపానీ వారితో జరిపే చర్చల్లో భావోద్వేగాన్ని రంగరించి మరీ సెంటిమెంట్ బలోపేతం చేస్తున్నారు. ‘అప్ సౌ జామ్యా నె. జామినే శాంటితి పచ్చా జాజో (మీకు భోజనం కావాలా? భోజనం చేసి ప్రశాంతంగా ఇంటికెళ్లండి' అని చెప్తారన్నారు. తాము ఫొటోగ్రఫీ బిజినెస్ చేస్తామని ఎనిమిదేళ్ల కొడుకు ఖుష్ దార్జీతో కలిసి నీతాబెన్ దార్జీ తెలిపారు. తమకు బిజినెస్ విస్తరణకు గల అవకాశం తాము ఇక్కడికి వచ్చామని తెలిపారు. జింకాల్ దుంగా (20) అనే బీఎస్సీ విద్యార్థి మాట్లాడుతూ సీఎం స్పీచ్ తమను స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. శాసనసభలో క్రమశిక్షణాయుతంగా కార్యకలాపాలు ఎలా సాగుతాయో తెలుసుకున్నామని, మరోసారి అసెంబ్లీని సందర్శించి పూర్తిగా సభ పనితీరు తెలుసుకోవాలని కోరుతున్నామని తెలిపారు. కొద్ది సేపట్లోనే సభ గురించి తెలుసుకోవడం కష్టమని 300 మందితో కలిసి ఓ లగ్జరీ బస్సులో వచ్చిన సవితానాయి తెలిపారు.
పర్యటనకు రూ.4 కోట్లు?
విలాసవంతమైన బస్సు ప్రయాణం, మహాత్మా మందిర్, అక్షర్ ధామ్ ల సందర్శన, భోజన వసతులకు కలిపి ఇప్పటివరకు సుమారు రూ.2.20 కోట్లు ఖర్చవుతుందని, ఇది అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు రూ.4 కోట్లకు చేరుకుంటుందని సీనియర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. మహిళలు, విద్యార్థులను తరలించేందుకు అవసరమైన నిధులను సురక్షా సేతు జిల్లాకు కేటాయించారని ఓ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ చెప్పారు. బీజేపీకి మద్దతునిచ్చే ఖోజాలు 150 మందితో వర్ధ్వాన్ ఎమ్మెల్యే వర్ష దోషి కలిసి విధాన సభకు వచ్చారు. సందర్శకులు అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్లే ముందు ఫొటో సెషన్ ఉంటున్నారు.
నిధుల మంజూరు
కరంజ్ ఎమ్మెల్యే జనక్ కచ్చాదియా తన సొంత పట్టణం బాగ్దానా నుంచి మద్దతుదారులతో ఇక్కడకు వచ్చారు. ఇప్పటికే పంచాయతీ రాజ్, విద్యుత్, ఆరోగ్యశాఖ మంత్రులను కలుసుకున్నామని తెలిపారు. తమ పట్టణంలో నూతన గ్రామ పంచాయతీ భవన్ నిర్మించాలని కోరుతున్నారని కచ్చాదియా తెలిపారు. అందుకు రూ.22 లక్షలు ప్రభుత్వం నిధులు మంజూరయ్యారని కూడా తెలిపారు. కాగా ప్రతి గ్రామంలో మహిళా సాదికారతను పెంపొందించడమే తమ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు జ్యోతి పాండ్యా ధ్రువీకరించారు. ప్రతి గ్రామం, పట్టణం, జిల్లా నుంచి మహిళలను తీసుకొచ్చి ప్రభుత్వ విజయాలను వారికి తెలియజేయడమే తమ లక్ష్యమని వివరించారు.
కొనసాగుతున్న ప్రక్రియ: శంకర్ సింఘ్ వాఘేలా
అసెంబ్లీలో విపక్ష నేత శంకర్ సింఘ్ వాఘేలా మాట్లాడుతూ ఇది పశువుల మార్కెట్ (బక్రా మండీ)ను తలపిస్తున్నదని ఆరోపించారు. ఈ ధోరణి నరేంద్రమోడీ సీఎంగా ప్రారంభిస్తే.. ఆనందీబెన్ పటేల్.. తర్వాత విజయ్ రూపానీ కొనసాగిస్తున్నారని చెప్పారు. స్త్రీలు, విద్యార్థులను తమ ఓటర్లుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని శంకర్ సింఘ్ వాఘేలా ఆరోపించారు. ప్రజాస్వామ్య దేవాలయమైన విధానసభను బీజేపీ మత బోధకులకు నిలయంగా మారుస్తున్నదని మండిపడ్డారు. ఉచిత పర్యటనల ద్వారా బీజేపీ తన ఓటు బ్యాంకును సంఘటితం చేసుకుంటున్నదని ఆరోపించారు.
ఆదేశాలు భేఖాతర్
సురక్ష సేత కింద పార్లమెంటరీ సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేందుకు నిధులు పొందడానికి వీలు కల్పించి.. ప్రభుత్వ నిధులతో మహిళలు, యువతను ఆకర్షించి వారితో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ వారిని తమ ఓటర్లుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎఐసీసీ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్ గోహిల్ ఆరోపించారు. కానీ మాజీ స్పీకర్ల ఆదేశాలకు భిన్నంగా ప్రస్తుతం వ్యవహారం నడుస్తున్నదని అన్నారు. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, సీఎంలకు సమాన అవకాశాలు కల్పించాలని మాజీ స్పీకర్ నట్వర్ లాల్షా ఆదేశించారని గుర్తుచేశారు. కానీ సీఎం విజయ్ రూపానీ కేవలం రాజకీయ ప్రసంగాలకు పరిమితం అవుతారన్నారు.
స్పందించని డిప్యూటీ సీఎం
దీనిపై స్పందించేందుకు డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ అందుబాటులోకి రాలేదు. రాష్ట్ర హోంశాఖ మంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా మాత్రం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత స్పందిస్తానన్నారు.