రేపే రాష్ట్రపతి ఎన్నికలు: విలువలకు ప్రతిరూపం కేఆర్, వివాదాల్లో ఫక్రుద్ధీన్
14వ రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు మరొక రోజు గడువు మాత్రమే ఉన్నది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ అధికార ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ 70 శాతానికి పైగా ఓట్లతో రాష్ట్రపతిగా ఎన్నికవుతారని .
న్యూఢిల్లీ: 14వ రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు మరొక రోజు గడువు మాత్రమే ఉన్నది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ అధికార ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ 70 శాతానికి పైగా ఓట్లతో రాష్ట్రపతిగా ఎన్నికవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి రాజ్యాంగ పరిరక్షకుడు.
విధానపరమైన, రాజకీయ నిర్ణయాలు తీసుకునే అధికారం లేకున్నా, దేశ ప్రథమ పౌరుడిగా దేశంలో శాంతి, సౌభ్రాతృత్వాలు కాపాడాల్సిన కర్తవ్యం ఆయనదే. దురదృష్టవశాత్తు కొందరు ప్రథమ పౌరులు ఎమర్జెన్సీ తరహా నిర్ణయాలు తీసుకుని అపఖ్యాతి మూటగట్టుకోగా, అతి కొద్దిమంది మాత్రం రాజ్యాంగం తమకు ప్రసాదించిన అధికారాలను వినియోగించుకుని ఆ పదవికి వన్నె తెచ్చారు.
67 ఏళ్ల గణతంత్ర భారతంలో 13 మంది రాష్ట్రపతులుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో విలక్షణ వ్యక్తిత్వం.. ఒక్కో విలక్షణ శైలి. బానిస సంకెళ్లు తెంచుకుని దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న తొలినాళ్లలో రాజ్యాంగ స్ఫూర్తి చెదరకుండా, ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షిస్తూ, ప్రభుత్వానికి మార్గదర్శకంగా నిలిచారు తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్.
రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సమున్నత వ్యక్తిత్వం, మహోన్నత విలువలకు ప్రతిరూపంగా నిలిచి ఆ పదవికే వన్నె తెచ్చారు. తరువాత కాలంలో క్రమంగా రాష్ట్రపతి ఎన్నికలో రాజకీయ జోక్యం ప్రారంభమైంది. కొందరు రాష్ట్రపతులు ప్రధాని అడుగులకు మడుగులొత్తి అప్రతిష్టపాలయ్యారు. ఆ పదవికి మాయని మచ్చతెచ్చారు. మరి కొందరు ప్రధాని, కేంద్ర కేబినెట్ నిర్ణయాలను వ్యతిరేకించి రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడి రాష్ట్రపతి పదవి గౌరవాన్ని పెంచారు. ఒకసారి ఆయా రాష్ట్రపతుల పనితీరు.. విలువల పరిరక్షణకు తీసుకున్న చర్యలను పరిశీలిద్దాం..
రబ్రీ దేవి సర్కార్ రద్దుపై కేంద్రం నిర్ణయానికి ఇలా ఆమోదం
తొలి దళిత రాష్ట్రపతిగా పేరు గాంచిన కే ఆర్ నారాయణన్ తన పదవీకాలంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించి ప్రజాస్వామ్యవాదుల మన్ననలు అందుకున్నారు. తన ఐదేళ్ల పదవీ కాలంలో (1997 - 2002) నారాయణన్ ఏనాడూ ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా ఆమోదించలేదు. వాటిలోని సహేతుకతను ప్రశ్నించడానికీ వెనుకాడలేదు. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాల రద్దు విషయంలో ఆయన నిక్కచ్చిగా వ్యవహరించారు. 1997 మార్చిలో బీజేపీ- బీఎస్పీ సంయుక్తంగా ఉత్తర్ప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆరు నెలల మాయావతి పాలన అనంతరం కల్యాణ్సింగ్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. నెల తర్వాత మాయావతి మద్దతు ఉపసంహరించుకోవడంతో సర్కారు సంక్షోభంలో పడింది. ఇతర పార్టీల మద్దతుతో కల్యాణ్సింగ్ బలాన్ని నిరూపించుకున్నారు. అయినా 1997 అక్టోబరు 22న ఉత్తర్ప్రదేశ్లోని కల్యాణ్సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి విధించాలన్న ఐకే గుజ్రాల్ సారథ్యంలోని నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ సిఫారసును పునఃపరిశీలించాలని కోరుతూ నారాయణన్ తిప్పి పంపారు. చిన్నపాటి కారణాలు చూపి 356 అధికరణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడం సహేతుకం కాదని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టంచేశారు. రాష్ట్రపతి సూచనతో ఏకీభవించిన కేంద్రం చివరికి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నది. నిజానికి నారాయణన్ బీజేపీ భావజాలంతో విభేదిస్తారు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని ఆమోదిస్తారని అంతా అనుకున్నా.. ఆయన పార్టీలకు అతీతంగా వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. మరో ఏడాది తర్వాత 1998 సెప్టెంబరులో కూడా నారాయణన్కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి సారథ్యంలోని ఎన్టీఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువై ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సజావుగా లేనందున బీహార్లోని రబ్రీదేవి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ సుందర్సింగ్ భండారీ చేసిన సిఫారసును కేంద్రం రాష్ట్రపతికి పంపింది. గతంలో మాదిరిగానే పునఃపరిశీలించాలని కోరుతూ నారాయణన్ తిప్పిపంపారు. కేంద్రం తన పాత నిర్ణయానికే కట్టుబడి ఉండటంతో అయిష్టంగానే అందుకు తలూపారు. బీహార్పై నిర్ణయం సందర్భంగా..కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై సర్కారియా కమిషన్ సిఫారసులు, ఎస్.ఆర్.బొమ్మై కేసులో సుప్రీం తీర్పును నారాయణన్ ఉటంకించారు.
Recommended Video
ఓటుహక్కు వినియోగించుకున్న తొలి రాష్ట్రపతి
రాష్ట్ర ప్రభుత్వాల రద్దు విషయంలో గతంలో ఏ రాష్ట్రపతి కూడా కేంద్రంతో విభేదించే సాహసం చేయలేదు. 356 అధికరణాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తూ..రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించినా కిమ్మనలేదు. ప్రజాస్వామ్యవాదిగా పేరొందిన జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 356 అధికరణాన్ని అడ్డం పెట్టుకుని 1959 జులైలో కేరళలో ఇ ఎం ఎస్ నంబూద్రిపాద్ నేతృత్వంలోని తొలి వామపక్ష ప్రభుత్వాన్ని అక్రమంగా రద్దుచేసింది. దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైనా..నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ మౌనంగానే ఉండిపోయారు. ఇందిరాగాంధీ హయాంలో ఇలాంటివి సర్వసాధారణం అయ్యాయి. ఏదేమైనా రాష్ట్రప్రభుత్వాల రద్దు వంటి కీలక విషయాల్లో కేంద్ర నిర్ణయాన్ని పలు దఫాలుగా వ్యతిరేకించిన నారాయణన్ భావి రాష్ట్రపతులకు మార్గదర్శిగా నిలిచారు. కాగా, ఓటుహక్కు వినియోగించుకున్న తొలి రాష్ట్రపతిగా కేఆర్ నారాయణన్ సంచలనం సృష్టించారు. 1998 లోక్సభ మధ్యంతర ఎన్నికల సందర్భంగా ఆ ఏడాది ఫిబ్రవరి 16న రాష్ట్రపతి భవన్ ఆవరణలోని పోలింగ్ కేంద్రంలో సాధారణ పౌరుడిలా క్యూలో నిలబడి ఓటుహక్కు వినియోగించుకున్నారాయన. రాష్ట్రపతి రాజ్యాంగపరంగా అత్యున్నత స్థానంలో ఉన్నా, ముందుగా దేశ ప్రథమ పౌరుడని, అలాంటి వ్యక్తి ఓటుహక్కు వినియోగించుకోకపోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఓటుహక్కు వినియోగానికి ముందుకొచ్చారు నారాయణన్. 1999 సాధారణ ఎన్నికల్లో కూడా ఆయన ఓటేశారు. ఇదిలా ఉండగా, ఈయన తన హయాంలో లోక్సభను రెండు సార్లు రద్దు చేశారు. క్లిష్ట సమయాల్లో రాష్ట్రపతి విచక్షణాధికారాన్ని ఉపయోగించే సంప్రదాయం నారాయణన్ హయాంలోనే మొదలైంది. ఐకె గుజ్రాల్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో లోక్సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వాజ్పేయికి మద్దతు ఇస్తున్నట్టు రాతపూర్వంగా ఇవ్వాలని ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలను కోరారు. 1999లో వాజ్పేయి ప్రభుత్వం ఒక ఓటుతో లోక్సభలో మెజారిటీ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా మెజారిటీ సాధించే పరిస్థితులు లేకపోవడంతో లోక్సభను ఆయన మరోసారి రద్దు చేశారు.
13 నంబర్తో ప్రణబ్కు ప్రత్యేక అనుబంధం
ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఉన్నంత పాలనా అనుభవం ఏ ప్రథమ పౌరునికీ లేదు. ఆయన నిర్వహించినన్ని కీలక మంత్రిత్వశాఖలను గతంలో ఎవరూ నిర్వహించలేదు. 80వ దశకం ప్రారంభంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ మంత్రివర్గంలో ఆర్థికమంత్రిగా పనిచేశారాయన. పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. 2004 నుంచి మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో రక్షణ, విదేశాంగ, ఆర్థిక మంత్రిత్వ శాఖలనూ నిర్వహించారు. అంతే కాదు ప్రణబ్ ముఖర్జీకి, 13వ నెంబర్కు అవినాభావ సంబంధం ఉంది. ఓ రకంగా అది ఆయన అదృష్టసంఖ్య. ఆయన పదమూడో రాష్ట్రపతి. 1957 జులై 13న ఆయన వివాహమైంది. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా సుదీర్ఘకాలం దిల్లీలో తల్కతోర రోడ్డులోని 13న నెంబరు ఇంట్లో నివసించారు. 2004-12 మధ్య కాలంలో లోక్సభ నాయకుడిగా పార్లమెంట్లోని 13వ నెంబర్ గది ఆయన కార్యాలయంగా ఉండేది. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా 2012 జూన్ 13న ఆయన పేరును ఖరారుచేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో 7,13,763 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇందులో కూడా 13 ఉండటం విశేషం.
సందర్భానుసారంగా సమయస్ఫూర్తి
తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ 1950 నుంచి 12 ఏళ్ల పాటు రాష్ట్రపతిగా వ్యవహరించిన ఏకైక వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ప్రభుత్వ నిర్ణయాలను గౌరవిస్తూనే అవసరమైనప్పుడు కరాఖండిగా వ్యవహరించాలనే సంప్రదాయానికి ఆయన నాంది పలికారు. జీతం రూ.12,500. ఆయన రూ.2,500 మాత్రమే తీసుకునేవారు. హిందూ కోడ్ బిల్లు, సోమ్నాథ్ ఆలయం విషయాల్లో నెహ్రూ నిర్ణయాలను వ్యతిరేకించారు.
రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షణకే ప్రాధాన్యం
సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు దేశం రెండు యుద్ధాలను ఎదుర్కొంది. 1962లో చైనాతో, 1965లో పాక్తో యుద్ధాలు జరిగాయి. ఆ సమయంలో డాక్టర్ రాధాకృష్ణన్ తన ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం రగిలించారు. నెహ్రూ చైనా విధానాన్ని రాధాకృష్ణన్ బహిరంగంగా దుయ్యబట్టారు. రాజస్థాన్కు చెందిన స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు గాయత్రీ దేవి సారథ్యంలో బలనిరూపణకు రాష్ట్రపతి భవన్కు వచ్చారు. తన నిర్ణయం నాటి ప్రధాని ఇందిరాగాంధీకి ఇష్టం ఉండదని తెలిసినా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాల్సిందిగా వారిని తిప్పి పంపారు రాధాకృష్ణన్.
అంతరాత్మ ప్రభోదం పేరిట ఇలా వీవీ గిరి ఎన్నిక
విద్యావేత్త అయిన జాకిర్ హుస్సేన్ అతితక్కువ సమయం ఆ పదవిలో ఉన్నారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలో బ్యాంకుల జాతీయకరణ అంశం చర్చనీయాంశంగా ఉంది. ఆయన మరణించాక తాత్కాలిక రాష్ట్రపతి అయినా హిదయతుల్లా బ్యాంకుల జాతీయకరణ బిల్లు మీద సంతకం చేశారు. తర్వాతీ కాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వంపై తన పట్టు కోసం రాష్ట్రపతి పదవిలో తన మనిషి ఉండాలని భావించారు. కాంగ్రెస్ పెద్దలంతా నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా సూచించారు. ఆయనను కాదని అంతరాత్మ ప్రభోదం పేరిట ఇందిర వి.వి.గిరిని రాష్ట్రపతిని చేశారు.
కేంద్ర క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఇలా
ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ అనే అప్రతిష్టను మూటకట్టుకున్నారు. 1974 - 77 మధ్య కాలంలో రాష్ట్రపతిగా పని చేసిన భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయానికి తెరతీశారు. వివాదాస్పద ఎమర్జెన్సీకి ఆమోదముద్ర వేశారు. 1975 జూన్ 25న రాత్రి 11 గంటల సమయంలో ప్రధాని ఇందిరా గాంధీ ఫకృద్దీన్ను కలుసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఆయనకు లిఖిత పూర్వకంగా తెలిపారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎమర్జెన్సీ విధించాలంటే ఆ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఉండాలి. రాష్ట్రపతి పదవిలో వున్న ఫకృద్దీన్ అదేమీ అడగలేదు. ఇందిర అడిగిందే తడవుగా ఎమర్జెన్సీ బిల్లు మీద అర్ధరాత్రి వేళ ఆమోదముద్ర వేశారు.
రాష్ట్రపతి పదవికి రెండుసార్లు పోటీ చేసిన తెలుగుతేజం
రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి వ్యక్తి డాక్టర్ నీలం సంజీవరెడ్డి. జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనను కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు ముక్తకంఠంతో సమర్థించాయి.రాష్ట్రపతి పదవికి పోటీ చేసే ముందు రెండుసార్లూ నీలం సంజీవరెడ్డి లోక్సభ స్పీకర్గా ఉన్నారు. తొలుత 1969లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్పీకర్ పదవికి రాజీనామా చేసి బరిలోకి దిగారు. రెండోసారి 1977లో జనతా ప్రభుత్వ హయాంలో కూడా స్పీకర్ పదవికి రాజీనామా చేసి అధ్యక్ష పదవికి పోటీచేశారు. 1979 జూలైలో మెరార్జీ ప్రభుత్వం పార్లమెంటులో మెజారిటీ కోల్పోయింది. మొరార్జీ సమర్పించిన రాజీనామాను నీలం తక్షణం అమోదించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వం గురించి ఆలోచించకుండా మొరార్జీ రాజీనామాను ఆమోదించడం వివాదాస్పదంగా మారింది. 200 మందికి పైగా ఎంపీల మద్దతున్న మొరార్జీ తప్పుకున్నప్పుడు 80 మంది ఎంపీల మద్దతు వున్న చరణ్సింగ్ను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం వివాదాస్పదంగా మారింది. చరణ్సింగ్కు మొదట మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, 24 రోజులకే ఉపసంహరించుకుంది. దీంతో చరణ్సింగ్ ప్రభుత్వం పడిపోయింది. మధ్యంతర ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాల్సిందిగా నీలం చరణ్సింగ్ను కోరారు. ఇది పెను వివాదానికి దారితీసింది. చరణ్సింగ్ ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న సమయంలో 9 ఆర్డినెన్స్లు జారీ చేశారు. వీటిని నీలం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.
తపాలా బిల్లుకు పాకెట్ వీటో వ్యతిరేకం
ఇందిరాగాంధీకి నమ్మిన బంటుగా ముద్రపడిన జ్ఞాని జైల్సింగ్ 7వ రాష్ట్రపతి అయ్యారు. 1982 - 82 మధ్య రాష్ట్రపతిగా పని చేసిన జ్ఞాని జైల్సింగ్ ‘నా నాయకురాలు చీపురు తీసుకుని శుభ్రం చేయమంటే నేను అదే చేస్తాను. ఆమె నన్ను రాష్ట్రపతి పదవి చేపట్టమన్నారు.. సరే అన్నాను' అని ప్రమాణ స్వీకారం చేశాక చెప్పుకుని ఆ పదవి వన్నె కోల్పోయేలా చేశారు. రాష్ట్రపతి హోదాకు తగని పలు కార్యక్రమాల్లో జైల్సింగ్ పాల్గొనడం కూడా అప్పట్లో వివాదాస్పదంగా మారింది. 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ను జైల్సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందిర తను ఏం చేయబోయేదీ రాష్ట్రపతి స్థానంలో ఉన్న జైల్సింగ్కు మాటమాత్రంగా కూడా చెప్పలేదు. ఇందిర వైఖరి పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఒక దశలో ఇందర ప్రభుత్వాన్ని జైల్సింగ్ రద్దు చేసే ఆలోచన చేశారని చెబుతారు. 1986లో ఇండియన్ పోస్టాఫీస్ సవరణ బిల్లును జైల్సింగ్ పాకెట్ వీటో ద్వారా వ్యతిరేకించారు.
నలుగురు ప్రధానులతో ప్రమాణం చేయించిన డాక్టర్ ఎస్డీ శర్మ
1987 - 92 మధ్య రాష్ట్రపతిగా పని చేసిన ఆర్ వెంకట్రామన్ హయాంలోనే సంకీర్ణ ప్రభుత్వాల ధోరణి మొదలైంది. రాజీవ్గాంధీ 1989 ఎన్నికల్లో పరాజయం పాలు కాగా వి.పి.సింగ్ ప్రధాని అయ్యారు. ఆయన ప్రభుత్వం పతకం కావడంతో చంద్రశేఖర్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వం కూడా పడిపోవడంతో 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పి.వి. నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నలుగురు ప్రధానులతో పనిచేసిన రాష్ట్రపతిగా శంకర్ దయాళ్ శర్మ (1992 - 97) రికార్డులకు ఎక్కారు. వారిలో ముగ్గురిని ఆయనే నియమించడం మరో విశేషం. సంస్కృతం వ్యాప్తికి కృషి చేసిన ఆయన నిత్యం గుళ్లు గోపురాల చుట్టూ తిరుగుతారనే అభిప్రాయం వ్యక్తమైంది.
అత్యధిక ఆర్డినెన్స్ లు జారీ చేసిన ఫక్రుద్దీన్
తన హయాంలో ప్రతిభాపాటిల్ అత్యధికంగా 35 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. అత్యధిక విదేశీ పర్యటనలు జరిపిన రాష్ట్రపతి( 22సార్లు) కూడా ఆమే. ఆ పర్యటనలకు అయిన ఖర్చు అక్షరాలా రూ.205 కోట్లు అని సమాచార హక్కు దరఖాస్తు ద్వారా వెల్లడైంది. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిభాపాటిల్ రాష్ట్రపతి కాకమునుపు..తర్వాత ఆమె బంధువులు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆర్. వెంకట్రామన్ తన అయిదేళ్ల పదవీ కాలంలో నలుగురు ప్రధానమంత్రులు...రాజీవ్గాంధీ, విశ్వనాథ ప్రతాప్సింగ్, చంద్రశేఖర్, పి.వి.నరసింహారావులతో కలిసి పనిచేశారు. వారిలో చివరి ముగ్గురి చేత ఆయనే ప్రమాణ స్వీకారం చేయించారు. అత్యధిక ఆర్డినెన్స్ (అత్యవసర ఆదేశం)లు జారీచేసిన రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ రికార్డు సృష్టించారు.
తమిళనాడు నుంచే ముగ్గురి ప్రాతినిధ్యం ఇలా
రాష్ట్రపతి పదవికి, దక్షిణ భారతదేశానికి అవినాభావ సంబంధం ఉంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి నలుగురు నాయకులు ఈ అత్యున్నత రాజ్యాంగ పదవిని అందుకున్నారు. తమిళనాడు నుంచి ఏకంగా ముగ్గురు (సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్, అబ్దుల్ కలాం) ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధప్రదేశ్ నుంచి నీలం సంజీవరెడ్డి (1977-1982), కేరళ నుంచి కె.ఆర్.నారాయణన్ (1997-2002) ప్రథమ పౌరులుగా రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టారు. కర్ణాటక నుంచి ఏ నాయకుడూ నేరుగా రాష్ట్రపతి కాలేదు. అయితే ఆ రాష్ట్రానికి చెందిన బి.డి.జట్టి ఉపరాష్ట్రపతిగా ఉంటూ కొంతకాలం రాష్ట్రపతిగా వ్యవహరించారు.
ప్రతిభపై విమర్శలిలా
సర్వేపల్లి రాధాకృష్ణన్ తరువాత రాజకీయేతర వ్యక్తి, మేధావి అయిన అబ్దుల్ కలాం 2002లో రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించారు. రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి భవన్కు పరిమితం కారాదని, జాతిని చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించాలని నమ్మడంతో పాటు ఆచరించి చూపారు కలాం. మేధావుల నుంచి చిన్నారుల వరకు అందరితో సన్నిహితంగా మెలుగుతూ ప్రజల రాష్ట్రపతిగా పేరొందారు. 2005లో బీహార్లో రాష్ట్రపతి పాలన విధించే బిల్లుపై ఆమోద ముద్ర వేయడం వివాదాస్పదంగా మారింది. జోడు పదవుల బిల్లులో స్పష్టత లేదంటూ కలాం రెండు సార్లు ఆ బిల్లును తిప్పి పంపారు. అయినా యూపీఏ ప్రభుత్వం ఆ బిల్లుపై పట్టుపట్టడంతో కలాం ఎట్టకేలకు ఆ బిల్లును ఆమోదించారు. భారత రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి మహిళ. కాంగ్రెస్ పార్టీకి విశ్వాసపాత్రంగా ఉండటమే ఆమె రాష్ట్రపతి కావడానికి ఏకైక అర్హత అనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. 35 మందికి విధించిన మరణ శిక్షలను జీవిత ఖైదుగా మార్చడం పెనువివాదమైంది. కుటుంబ సభ్యుల బృందంతో నిరంతరం విదేశీ పర్యటను చేస్తూ, డబ్బు దుర్వినయోగం చేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు. పుణెలోని మిలటరీ భూమిలో పదవీ విరమణ తరువాత నివాసం ఉండేందుకు 2 లక్షల చదరపు అడుగుల భవనాన్ని ప్రభుత్వ ధనంతో నిర్మించుకున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అధికారంలో ఉండగా పలు వ్యాపారాలు ప్రారంభించారనే విమర్శలు కూడా ఉన్నాయి.
భారత రాష్ట్రపతిగా ఎన్నిసార్లైనా పోటీకీ వీలు
అమెరికా అధ్యక్ష పదవి, భారత రాష్ట్రపతి పదవుల విషయంలో కొన్ని సారూప్యాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష పదవికి ఒక వ్యక్తి రెండు సార్లకు మించి పోటీ చేయరాదు. ఎంత బలం ఉన్నప్పటికీ మూడోసారి పోటీకి అక్కడి రాజ్యాంగం అనుమతించదు. మన దేశంలో ఒక వ్యక్తి ఎన్నిసార్లయినా అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు. అయితే రెండుసార్లకు మించి పోటీచేయరాదన్న అలిఖిత సంప్రదాయం ఉంది. ఈ విషయమై పార్లమెంటులో చర్చ కూడా జరిగింది. ఒక వ్యక్తి రెండుసార్లకు మించి పోటీ చేయకుండా పరిమితి విధించాలని 1961 ఏప్రిల్లో సీపీఐ సభ్యుడు భూషేష్ గుప్తా రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా నాటి ప్రధాని నెహ్రూ మాట్లాడుతూ ‘రెండు దఫాలకు మించి పదవిలో ఉండటం మంచి సంప్రదాయం కాదు. దానిని మనం తప్పక పాటించాలి. దీనికోసం ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణ అక్కర్లేదంటూ' చర్చను ముగించారు. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ మాత్రమే రెండుసార్లు ఈ అత్యున్నత పదవిలో కొనసాగారు. అందువల్ల రెండుసార్లు పోటీచేయవచ్చన్న అలిఖిత సంప్రదాయం ఏర్పడింది.