మరో కళావతిని దొరకబుచ్చుకున్న రాహుల్
కుక్షీ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో పదిహేను నిమిషాలు ప్రసంగించాక ఉన్నట్టుండి వేదికపై నుంచి దిగి అక్కడున్న గిరిజన మహిళ లలితా బాయిని పలుకరించారు. ఆమె కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద పని దొరుకుతోందా? అని ప్రశ్నించారు.
ఆమె తనకు కొద్ది రోజులుగా పని లేదని చెప్పారు. దీంతో రాహుల్... కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే మీ కష్టాలు తీరుస్తామని చెప్పారు. ఆ తర్వాత లలిత కూతురు పూజను పాఠశాలకు వెళ్తున్నావా అని అడిగారు. ఐదో తరగతి చదువుతున్నానని ఆ బాలిక చెప్పింది. లలితా కుటుంబం కుక్షీకి పదిహేను కిలోమీటర్ల దూరంలోని గిర్వానియాలో ఓ పూరింట్లో నివసిస్తోంది.
కాగా, మహారాష్ట్రలో ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కళావతిని తెర పైకి తీసుకు వచ్చారు. తన సభకు వచ్చిన కళావతిని పరామర్శించిన రాహుల్.. ఆమెకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎన్నికలలో లలితా బాయిని తెర పైకి తీసుకు వచ్చారు.