జయ వారసుడు దినకరన్!: మంత్రులు-అన్నాడీఎంకే రివర్స్, శశికళవైపు చూపు
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో చిన్నమ్మ శశికళ వర్గం నాయకుడు టీటీవీ దినకరన్ గెలుపు దిశగా సాగుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నేతల స్వరం మారుతోంది. స్వయంగా మంత్రులే.. దినకరన్కు అనుకూలంగా వ్యాఖ్యానిస్తున్నారు.
Recommended Video
జయ వారసుడ్ని, మూణ్ణెళ్లు వెయిట్&సీ: దినకరన్, బీజేపీ రికార్డ్ అంటూ సుబ్రహ్మణ్యస్వామి ఎద్దేవా
మంత్రి సెల్లూరు రాజు ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే దినకరన్తో కలిసి పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆర్కే ఎన్నికల ఫలితాలను బట్టి తేలిపోయిందని చెప్పారు. అపార్థాల వల్లే పార్టీ రెండుగా చీలిందని చెప్పారు.
కొందరు ఈ గెలుపును జీర్ణించుకోవడం లేదు
దినకరన్ గెలుపును అన్నాడీఎంకే నేతలు కొందరు జీర్ణించుకోవడం లేదు. జయలలిత మృతి అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శశికళ.. పన్నీరును సీఎం చేయడం, ఆ తర్వాత ఆయన ఎదురు తిరగడం, చిన్నమ్మపై కేసులు, అనంతరం పన్నీరును పక్కన పెట్టి చిన్నమ్మ తెరపైకి పళనిస్వామిని సీఎంగా చేయడం, ఆ తర్వాత పన్నీరు-పళనిలు ఒక్కటి కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శశికళ.. దినకరన్ను తెరపైకి తీసుకు వచ్చింది.
మరోసారి అన్నాడీఎంకేలో కీలక పరిణామాలు
శశికళది అసలైన అన్నాడీఎంకే కాదని అన్నాడీఎంకే కీలక నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. మరోవైపు జయ వారసులం తామే అని దినకరన్ వర్గం చెప్పింది. ఇలాంటి సమయంలో ఆర్కే నగర్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పలువురు అధికార పార్టీ నేతల స్వరం మారింది. ఈ ఫలితాల ప్రభావంతో మరోసారి అన్నాడీఎంకేలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని భావిస్తున్నారు.
జయ వారసులు శశికళ-దినకరన్లేనా
ఆర్కే నగర్ గెలుపు నేపథ్యంలో దినకరన్ మాట్లాడారు. జయలలితకు అసలైన వారసులం తామే అని ప్రజలు తేల్చి చెప్పారని అన్నారు. పన్నీరు-పళని ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోనుందని చెప్పారు. జయ వారసులు పన్నీరు, పళనిలు కాదని ప్రజలు తేల్చి చెప్పారని దినకరన్ వర్గీయులు చెబుతున్నారు.
అన్నాడీఎంకే దినకరన్తోనే
అన్నాడీఎంకే కేడర్ (కార్యకర్తలు) అందరూ దినకరన్ - శశికళతోనే ఉన్నారని తేటతెల్లమైందని చిన్నమ్మ వర్గీయులు చెబుతున్నారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ నేతలు స్వరం మారుస్తుండటం కూడా ఆసక్తిని కలిగిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే దినకరన్ చెప్పినట్లుగా ప్రభుత్వం కూలుతుందా లేక అన్నాడీఎంకే ఒక్కటవుతుందా అనే ఆసక్తి అందరిలో కలుగుతోంది.
శశికళకు కొత్త ఉత్సాహం
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలుపు చిన్నమ్మ శశికళకు భారీ ఊరట అని చెప్పవచ్చు. తనను దెబ్బతీయాలనుకున్న వారందరికీ ఈ గెలుపుతో గట్టిగా బుద్ది చెప్పినట్లుగా ఆమెతో పాటు ఆమె వర్గీయులు భావిస్తారు. దినకరన్ గెలుపుతో పార్టీలోను చీలిక రావొచ్చని భావిస్తున్నారు.