సదావర్తి ట్విస్ట్: అళ్ల రెడీ, నారా లోకేష్ ఐటి బెదరింపులు
విజయవాడ: హైకోర్టు ఆదేశాలతో సదావర్తి భూముల వివాదం కొత్త మలుపు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ హైకోర్టు సదావర్తి భూముల విషయంలో జారీ చేసిన ఆదేశాలతో వివాదం మలుపు తిరుగుతోంది. ఐదు కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి వాటిని తీసుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు.
అయితే, సదావర్తి భూములను సొంతం చేసుకోవడానికి డబ్బులు చెల్లించే వ్యక్తిని హెచ్చరించే రీతిలో చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. అదే సమయంలో ఆ భూముల ధరర నిర్ణయించడానికి మంత్రులు ఎవరని భూమి హక్కుదారు మందాల సంజీవ రెడ్డి ప్రశ్నించారు.
తాము రూ.22.44 కోట్లకు వేలంలో 43 ఎకరాలను స్వంతం చేసుకున్నామని వాటికి ధర నిర్ణయించడానికి మంత్రులు ఎవరని ఆయన ప్రశ్నించారు. భూమి తీసుకోవాలని మంత్రులు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి ఎలా చెబుతారని ప్రశ్నించారు. రూ.1650 కోట్ల భూమి అంటూ రామకృష్ణారెడ్డి ఆరోపించారని సంజీవరెడ్డి గుర్తుచేశారు. రామకృష్ణారెడ్డి ఆరోపించినట్లు రూ.1650 కోట్లు చెల్లిస్తేనే ఆ భూములు ఆయనకు ఇవ్వాలని సంజీవరెడ్డి డిమాండ్ చేశారు.
నారా లోకేష్ ఇలా...
సదావర్తి సత్రం భూములపై తాము ఏనాడో సవాల్ చేశామని రాష్ట్ర మంత్రి లోకేష్ తెలిపారు. ఎకరాకు 5 కోట్లు ఎక్కువ ఇస్తే, భూములు ఇచ్చేస్తామని ప్రకటించామని, ఇప్పుడు కోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని తెలిపారు. డబ్బులు లేవంటూ సమయం అడిగారని, కోర్టులో డబ్బులు కడితే మంచిదే కదా అని ఆయన అన్నారు.
చెల్లించకపోతే ఓడిపోయినట్లే...
సదావర్తి భూములను రూ.5 కోట్లు అదనంగా చెల్లించి కొనుగోలు చేస్తే ఇంత డబ్బు మీకు ఎలా వచ్చిందంటూ ఆదాయం పన్ను (ఐటి) శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తారని,కొనకుంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఓడిపోయినట్లేనని నారా లోకేష్ అన్నారు. సోమవారం రాత్రి ఆయన సదావర్తి భూములపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు అలా చెప్పారు.....
సదావర్తి భూముల వేలంలో అక్రమాలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టరీ ఆరోపణలు చేసినప్పుడు రూ.5 కోట్లు అదనంగా ఇచ్చి మీరే తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని నారా లోకేష్ గుర్తు చేశారు. కోర్టు కూడా ఇప్పుడు అదే చెప్పిందని, రెండు వారాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే డబ్బు కడుతారో, ఏం జరుగుతుందో చూద్దామని ఆయన అన్నారు.
అళ్ల రామకృష్ణా రెడ్డి ఇలా...
వేలంలో పలికిన ధర కంటే రూ.5 కోట్లు అదనంగా చెల్లించి, సదావర్తి సత్రం భూములను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మంగళగిరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు రెండు విడతలుగా నాలుగు వారాల్లో ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది. చెల్లించలేకపోతే రూ.కోటి జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తామని తేల్చి చెప్పింది. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ టి.రజనీతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలు జారీచేసింది.
ఎవరున్నారు....
హైకోర్టు ఆదేశం మేరకు ఐదు కోట్ల రూపాయలు తాను చెల్లించలేని స్తితిలో ఉన్నా ఆ ఐదు కోట్లతో సహా రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్టుకు తెలిపారు. మొదటి విడత రూ. 10 కోట్లను రెండు వారాల్లోపు, మిగిలిన రూ.17.44 కోట్లను రెండు వారాల్లో చెల్లించాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
83 ఎకరాల భూములు...
గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి తమిళనాడులో ఉన్న 83 ఎకరాల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామమాత్రంగా రూ.22.44 కోట్లకు 2016 మార్చి 28న వేలంలో విక్రయించిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 2016 ఆగస్టులో హైకోర్టును ఆశ్రయించారు. ఆ వేలాన్ని రద్దు చేసి మొత్తం వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.
ఐదు కోట్లు అదనంగా...
‘ఆ భూములు ఆక్రమణలు, వివాదాల్లో ఉన్నాయని.. వాటికి యథాతథంగా వేలం నిర్వహించామని' ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. వేలంలో పలికిన ధరకన్నా పిటిషనర్ రూ.5 కోట్లు అదనంగా చెల్లిస్తే ఆ భూములను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అదనంగా రూ.5 కోట్లు మీరు చెల్లించినా ఫర్వాలేదు.. లేదా కొనుగోలుదారుని తీసుకొచ్చినా ఫర్వా లేదని గత విచారణ సందర్భంగా ఎమ్మెల్యేకు స్పష్టం చేసింది. అందుకు ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంసిద్ధత వ్యక్తం చేశారు.