బిజెపితో తెగదెంపులు ఉత్తుత్తేదేనా: కేంద్రం ఖాతాలోకి....
హైదరాబాదు: భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు ఉత్తుత్తదేనా అంటే, అవుననే అంటోంది వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా. తన తప్పులను బిజెపి ఖాతాలో వేయడానికే చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని తప్పు పట్టింది.
Recommended Video
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో తెలుగుదేశం పార్టీ బృందం భేటీపై కూడా సాక్షి మీడియా వ్యాఖ్యలు చేసింది. అక్కడేం జరిగిందో చూసినట్లు వార్తాకథనం ఇచ్చింది. అరుణ్ జైట్లీ అడిగిన ప్రశ్నలకు టిడిపి ప్రతినిధులు సమాధానం ఇవ్వలేకపోయారని నిందించింది.
హోదాపై ఇలా కావడంతో...
ప్రత్యేక హోదాపై ప్రత్యామ్నాయం లేదని రాష్ట్రమంతా ఏకకంఠంతో నినదిస్తుండడంతో తన ఇన్నాళ్ల వైఫల్యాలను, తన తప్పులను, తన పాపాలను అన్నింటికీ కేంద్రం ఖాతాలోకి నెట్టి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారని సాక్షి మీడియా విమర్శించింది. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి దాని నుంచి బయటపడడానికి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించింది.
జైట్లీ వద్ద ఇలా జరిగిందని...
రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపి కె. రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కుటుంబరావులతో కూడిన ప్రతినిధుల బృందం మంగళవారం ఢిల్లీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసింది. అక్కడ జైట్లీ అడిగిన ప్రశ్నలకు టిడిపి ప్రతినిధులు మౌనం వహించారని సాక్షిరాసింది.
ప్రత్యేక హోదాపై ఇలా..
ప్రత్యేక హోదాపై డిమాండ్లు పెరుగుతున్నాయని టిడిపి ప్రతినిధులు అంటే ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ సరిపోతుందని మీరే కదా అని అన్నారని జైట్లీ అన్నట్లు, దానికి వారు మౌనం వహించినట్లు సాక్షి రాసింది. పన్ను రాయితీలు ఇచ్చే అవకాశాలు లేవని జైట్లీ చెప్పినప్పుడు కూడా వారు ఏమీ మాట్లాడలేదట. అమరావతి నిర్మాణానికి, వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చిన నిధులపై జైట్లీ లెక్కలు అడిగారని, దానికి కూడా వారు ఏమీ మాట్లాడలేదని సాక్షి రాసింది.
చంద్రబాబుతో మాట్లాడి చెప్తాం...
కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రతపాదనలపై జవాబు చెప్పడానికి, జాప్యం చేయడానికి కారణాలను ఏమిటని జైట్లీ అడిగారని, తమ నాయకుడు చంద్రబాబుతో మాట్లాడి వివరాలు అందిస్తామని టిడిపి నాయకులు చెప్పారని రాసింది.
అది ఉత్తుత్తదేనా....
బిజెపితో తెగదెంపులు చేసుకుందామని తెలుగు శాసనసభా పక్ష సమావేశం (టిడిఎల్పీ) సమావేశంలో 95 శాతం మంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు వచ్చిన వార్తలు చంద్రబాబు డ్రామాలో భాగమని సాక్షి మీడియా రాసింది.నాలుగేళ్ల పాటు నాటకాలు ఆడి జనంలో దోషిగా నిలబడే సమయం వచ్చేసరికి తనకు సంబంధం లేనట్లు బిజెపియే ఇవ్వడం లేదన్నట్లు చెప్పి బయటపడడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సాక్షి విమర్శించింది.
బిజెపితో తెగదెంపులూ ఉత్తవే...
సమావేశంలో చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ బిజెపితో తెగదెంపులు చేసుకుందామని 95 శాతం మంది ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. కేంద్రం నుంచి ఇబ్బందులు వస్తాయని, పోలవరం ఆగిపోతుందని, ఇతరత్రా సమస్యలు వస్తాయని చంద్రబాబు అన్నప్పటికీ తెగదెంపులు చేసుకుని ఎదుర్కోవడమే మంచిదని ఎక్కువ మంది శాసనసభ్యులు అభిప్రాయపడినట్లు వార్తలు వచ్చాయి. దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు అన్నారని, ఇదంతా తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి లీకు చేసిన వార్తలని సాక్షి అభిప్రాయపడింది.