అంతర్జాతీయ జోక్యం: శశికళ మార్క్ రాజకీయం, పెదవి విరుపు
శశికళ పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడంతో పాటు, అప్పుడే తమిళనాడు - శ్రీలంక వ్యవహారాల విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలు సాగడంపై పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో కేవలం సాధారణ సభ్యత్వం మాత్రమే కలిగి ఉన్న శశికళ పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడంతో పాటు, అప్పుడే తమిళనాడు - శ్రీలంక వ్యవహారాల విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలు సాగడంపై పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి.
పన్నీరు సెల్వంకు ఝలక్: శశికళకు శ్రీలంక 'అధికారిక' లేఖ
కచ్చదీవుల్లోని ఆంటోనియార్ ఉత్సవాలకు వందమందిని అనుమతిస్తూ శ్రీలంక ప్రభుత్వం తరఫున ఎంపీ ఆరుముగం లేఖ రాశారు. ఆయన ఈ లేఖను ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు కాకుండా శశికళకు పంపించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ పరంగా సాగాల్సిన ఉత్తర్వులు..
ప్రభుత్వపరంగా సాగాల్సిన ఉత్తర ప్రత్యుత్తరాలు కనీసం పార్టీ అధినేత కూడా కానీ శశికళతో జరపడంపై చర్చ సాగుతోంది. అప్పుడే అంతర్జాతీయ స్థాయిల దౌత్యమా అని పార్టీలోనే కొందరు పెదవి విరుస్తున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీలో అండ
అన్నాడీఎంకేలోని అధిక శాతం శశికళకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమెను ఎప్పుడైనా పార్టీ అధినేత్రిగా ప్రకటించే అవకాశముంది. పార్టీ నుంచి బహిష్కరింపబడిన శశికళ పుష్ప వంటి వారు మినహా ఆమెకు అందరి నుంచి మద్దతు లభిస్తోంది.
ఈ కారణంగానే శ్రీలంక ఆమెతో సంప్రదింపులు జరుపుతోందని అంటున్నారు. అయితే, అత్యంత ముఖ్యమైన, అంతర్జాతీయ వ్యవహారంలో జోక్యం పైన మాత్రం చర్చ జరుగుతోంది.
ఒప్పందం
భారత్ - శ్రీలంక మధ్య 1974లో జరిగిన ఒప్పందం ప్రకారం కచ్చదీవులు శ్రీలంక సొంతం. ఈ నిర్ణయాన్ని జయలలిత వ్యతిరేకిస్తూ కచ్చదీవులను తిరిగి భారత్ సొంతం చేసుకోవాలని ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో తీర్మానం చేశారు.
కచ్చదీవుల అప్పగింతపై..
కచ్చదీవుల అప్పగింత చెల్లదని సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పిటిషన్ దాఖలు చేశారు. కచ్చదీవులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి ఉత్తరాలు రాశారు. ఈ దీవుల్లో ఆంటోనియార్ ఉత్సవాల్లో తమిళనాడుకు చెందిన ప్రతినిధులు ప్రతి ఏడాది హాజరవుతుంటారు.
ఇలా హాజరయ్యే ప్రతినిధుల సంఖ్య వందకు పెంచాలని కోరుతూ శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనకు శశికళ ఉత్తరం రాశారని, శశికళ విజ్ఞప్తిని సిరిసేన మన్నించారని శ్రీలంక పార్లమెంటు సభ్యులు ఆర్ముగం తొండమాన్ గురువారం వెల్లడించారు.
ఉత్తర ప్రత్యుత్తరాలు
కచ్చదీవుల ఉత్సవాలకు వందమందిని అనుమతించాలని కోరుతూ శశికళ, కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్ తమ దేశ అధ్యక్షులకు రాశారని, వారిద్దరి విజ్ఞప్తిని అంగీకరిస్తున్నట్లు సిరిసేన తనకు ఉత్తరం రాసినట్లు తొండమాన్ తెలిపారు. సిరిసేన అంగీకరించినట్లుగా పేర్కొన్న వివరాలతో కూడిన ఉత్తరాన్ని సదరు ఎంపీ శశికళకు పంపిన విషయం తెలిసిందే. శశికళ అప్పుడే తన రాజకీయ మార్క్ చూపిస్తున్నారని అంటున్నారు.